
Pak Army chief: 'సేల్స్మ్యాన్'.. పాక్ ఆర్మీ చీఫ్పై స్వదేశంలో సెటైర్లు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నం చేసిన పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్ పన్నిన వ్యూహం పన్నిన వ్యూహం ఆయనకే బెడిసికొట్టింది. ఆయన తీరుపై స్వదేశంలోనే సెటైర్లు పేలుతున్నాయి. ఈ ఘటనపై పాక్ రాజకీయ వర్గాలు తీవ్ర విమర్శలు, వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. పాకిస్తాన్ నాయకులు ఆసిమ్ మునీర్ను ఒక "సేల్స్మెన్" లాగా చూపిస్తూ, ఆయన తీరుపై ఘోర విమర్శలు చేశారు. నిజానికి ఏం జరిగింది అంటే...
వివరాలు
ఆసిమ్ మునీర్ ట్రంప్కి ఒక చెక్కపెట్టె బహుమతి
తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, తమ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్తో కలిసి అమెరికా పర్యటన చేశారు. అక్కడ వారు వైట్హౌస్లో అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆసిమ్ మునీర్ ట్రంప్కి ఒక చెక్కపెట్టె బహుమతిగా అందించారు. ఆ పెట్టెలో పాకిస్తాన్లో మాత్రమే లభించే అరుదైన ఖనిజాలు (Rare Earth Minerals) ఉన్నాయి. ఈ చిత్రాన్ని వైట్హౌస్ విడుదల చేసింది. దానిలో ఆసిమ్ మునీర్ ఆ ఖనిజాల గురించి వివరించగా, ట్రంప్ ఆసక్తిగా విన్నట్లుగా కనిపించింది. ఈ ఫొటోపై తాజాగా పాక్ సెనెటర్ అయిమల్ వలీఖాన్ స్పందిస్తూ మునీర్పై విమర్శలు గుప్పించారు
వివరాలు
పాకిస్తాన్ సుసంపన్న దేశాలలో ఒకటిగా మారుతుంది: ఆసిమ్ మునీర్
పార్లమెంట్లో దీని గురించి ఖాన్ మాట్లాడుతూ.."మన ఆర్మీ చీఫ్ అరుదైన ఖనిజాలను బ్రీఫ్కేస్లో ఉంచుకొని తిరుగుతున్నారు. ఇటీవల వైట్హౌస్కు తీసుకెళ్లారు. ఆ సందర్భం ఎలా ఉందంటే.. ఆర్మీ చీఫ్ ఏమో అచ్చం సేల్స్మెన్ మాదిరిగా ఖనిజాల గురించి వివరించారు. ఇక, పాక్ ప్రధాని మేనేజర్లా జరుగుతున్న డ్రామాను చూస్తూ ఉండిపోయారు. ఇదేమైనా జోక్ అనుకుంటున్నారా? మన దేశాన్ని మనమే ఎగతాళి చేసుకుంటున్నట్లు ఉంది'' అని దుయ్యబట్టారు. ట్రంప్తో భేటీ అనంతరం ఆసిమ్ మునీర్ మీడియాతో మాట్లాడుతూ, "పాకిస్తాన్ వద్ద రేర్ ఎర్త్ మినరల్స్ అనే ప్రఖ్యాత ఖజానా ఉంది.ఇది మన దేశ రుణభారం తక్కువ చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కొద్దిరోజుల్లోనే పాకిస్తాన్ సుసంపన్న దేశాలలో ఒకటిగా మారుతుంది"అని ఆయన తెలిపారు.