Silent Toxins: చిన్నారులకే ఎక్కువ ప్రమాదం.. కలుషిత ఆహారంపై WHO కీలక హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచవ్యాప్తంగా కలుషిత ఆహారం కారణంగా ప్రతి ఏడాది సుమారు 15 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ఆందోళన వ్యక్తం చేసింది. ముఖ్యంగా ఐదేళ్లలోపు చిన్నారులు ఈ ప్రమాదానికి ఎక్కువగా గురవుతున్నారని హెచ్చరించింది. 2000 నుంచి 2021 వరకు 194 దేశాల్లో నిర్వహించిన అధ్యయనం ప్రకారం, కలుషిత ఆహారం తినడం వల్ల ఏటా దాదాపు 88.6 కోట్ల మంది అనారోగ్యానికి గురవుతున్నారు. ఇతర వయసు వర్గాలతో పోలిస్తే చిన్నారుల్లో ఈ ప్రమాదం దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉందని వెల్లడించింది.
వివరాలు
పరిమిత ప్రజారోగ్య వనరులు
"ఆహార భద్రత అనేది కేవలం ఒక అంశం కాదు.. ప్రతి భోజనం,ప్రతి కుటుంబం,ప్రతి రోజుతో ముడిపడి ఉన్న విషయం"అని WHO డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ గెబ్రేయేసస్ పేర్కొన్నారు. 2000 సంవత్సరంతో పోలిస్తే ఆహార సంబంధిత వ్యాధులు కొంత తగ్గినప్పటికీ, ప్రాంతాల మధ్య భారీ అసమానతలు కొనసాగుతున్నాయని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్లో దాదాపు మూడు వంతులు ఆఫ్రికా, ఆగ్నేయాసియా దేశాల్లోనే ఉండగా, మరణాల్లో 60 శాతం ఈ ప్రాంతాలకే చెందినవని నివేదిక వెల్లడించింది. నిపుణుల ప్రకారం,తగిన శీతలీకరణ సదుపాయాల కొరత, ఆహార తనిఖీ వ్యవస్థల బలహీనత, పరిమిత ప్రజారోగ్య వనరులు వంటి కారణాల వల్ల ఈ ప్రాంతాల్లో సమస్య తీవ్రంగా ఉంది. దీంతో లక్షలాది మంది నివారించగలిగే ప్రమాదాలకు గురవుతున్నారు.
వివరాలు
ఆహారంలోకి చేరుతున్న పరిశ్రమల కాలుష్యం, నాణ్యతలేని వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం
బ్యాక్టీరియా, వైరస్ల వంటి జీవసంబంధిత కారకాలు 2021లో సుమారు 86 కోట్ల ఆహార సంబంధిత వ్యాధులకు కారణమయ్యాయి. అయితే మరణాలకు ఎక్కువగా కారణమైనవి రసాయన కాలుష్యాలేనని WHO పేర్కొంది. ముఖ్యంగా ఆర్సెనిక్, సీసం (లెడ్) వంటి భారీ లోహాలు అత్యంత ప్రమాదకరంగా మారాయని తెలిపింది. పరిశ్రమల కాలుష్యం, నాణ్యతలేని వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం వల్ల ఈ లోహాలు ఆహారంలోకి చేరుతున్నాయని అధికారులు వివరించారు. ఆహార భద్రతకు సంబంధించిన WHO సాంకేతిక అధికారి యుకీ మినాటో మాట్లాడుతూ, పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోందన్నారు. వాతావరణ మార్పుల వల్ల ఆహార కాలుష్యం ప్రమాదం పెరుగుతుండగా, యాంటీబయోటిక్లకు సూక్ష్మజీవులు ప్రతిఘటన పెంచుకోవడం వల్ల ఇన్ఫెక్షన్లకు చికిత్స చేయడం కూడా కష్టమవుతోందని తెలిపారు.
వివరాలు
దేశాల మధ్య సహకారం పెరగాల్సిన అవసరం ఉంది: WHO
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని దేశాలు తమ ఆహార భద్రత వ్యవస్థలను బలోపేతం చేయాలని WHO సూచించింది. పర్యవేక్షణ వ్యవస్థల్లో పెట్టుబడులు పెంచడంతో పాటు, సరఫరా గొలుసులోని బలహీనతలను అధిగమించేందుకు దేశాల మధ్య సహకారం పెరగాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మానవ ప్రాణనష్టంతో పాటు ఆహార సంబంధిత వ్యాధులు ప్రపంచ ఆర్థిక వ్యవస్థపైనా భారీ భారం మోపుతున్నాయి. 2021లో మాత్రమే ఉత్పాదకత నష్టాల రూపంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సుమారు 647 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లినట్లు అధ్యయనం వెల్లడించింది.