LOADING...
Iran: అమెరికాతో చర్చలు లేవు.. మధ్యవర్తుల ద్వారానే సందేశాలు..: ఇరాన్ క్లారిటీ
అమెరికాతో చర్చలు లేవు.. మధ్యవర్తుల ద్వారానే సందేశాలు..:ఇరాన్ క్లారిటీ

Iran: అమెరికాతో చర్చలు లేవు.. మధ్యవర్తుల ద్వారానే సందేశాలు..: ఇరాన్ క్లారిటీ

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2026
09:11 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాతో తమకు ఎలాంటి ప్రత్యక్ష చర్చలు జరగడం లేదని ఇరాన్ విదేశాంగ మంత్రి సయ్యద్ అబ్బాస్ అరాఘ్చీ స్పష్టం చేశారు. అయితే, గత కొన్ని రోజులుగా మధ్యవర్తుల ద్వారా రెండు దేశాల మధ్య సందేశాలు మాత్రం మార్పిడి అవుతున్నాయని వెల్లడించారు. ఈ ప్రక్రియను చర్చలు లేదా సంప్రదింపులుగా భావించరాదని ఆయన తేల్చిచెప్పారు. బుధవారం స్థానిక మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను వెల్లడించారు. గత కొద్దిరోజులుగా అమెరికా నుంచి పలు స్నేహపూర్వక దేశాల ద్వారా తమకు సందేశాలు వస్తున్నాయని అరాఘ్చీ తెలిపారు. ఆ సందేశాలకు తమ వైఖరిని స్పష్టంగా తెలియజేస్తూ, అవసరమైన హెచ్చరికలు కూడా పంపుతున్నామని చెప్పారు.

వివరాలు 

ఘర్షణను ప్రారంభించింది మేము కాదు: అరాఘ్చీ

"ఇది చర్చలు కాదు... కేవలం సందేశాల మార్పిడి మాత్రమే" అని ఆయన వివరించారు. తమ దేశ మౌలిక సదుపాయాలపై దాడులు చేయవద్దని అమెరికాకు కఠిన హెచ్చరికలు పంపినట్లు పేర్కొన్నారు. ఆ హెచ్చరికల తర్వాత, 48 గంటల్లో ఇరాన్ విద్యుత్ ప్లాంట్లపై దాడి చేస్తామన్న తన వ్యాఖ్యలను వాషింగ్టన్ వెనక్కి తీసుకుందని ఆయన తెలిపారు. తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని, ఈ ఘర్షణను ప్రారంభించింది కూడా తాము కాదని అరాఘ్చీ మళ్లీ స్పష్టం చేశారు. అయితే కేవలం కాల్పుల విరమణకు అంగీకరించే ఉద్దేశ్యం లేదని వెల్లడించారు. అలా చేస్తే మళ్లీ చర్చలు, యుద్ధం, తాత్కాలిక సంధి అనే చక్రం తిరుగుతూనే ఉంటుందని అభిప్రాయపడ్డారు.

వివరాలు 

హర్మూజ్ జలసంధి ఇరాన్, ఒమన్ ప్రాంతీయ జలాల్లో భాగం 

తమ షరతుల ప్రకారమే ఈ యుద్ధానికి శాశ్వత పరిష్కారం కావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. దేశ రక్షణే తమ ప్రధాన లక్ష్యమని, ప్రస్తుతం చర్చలకు ఎలాంటి ప్రణాళిక లేదని స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధి ఇరాన్, ఒమన్ ప్రాంతీయ జలాల్లో భాగమని ఆయన తెలిపారు. ఈ మార్గంలో సురక్షిత రవాణా కోసం "కొత్త ఏర్పాట్లు"పై పరిశీలన కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఇదిలా ఉండగా, ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా కలిసి టెహ్రాన్‌తో పాటు పలు ఇరాన్ నగరాలపై దాడులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడుల్లో అప్పటి సుప్రీం లీడర్ అలీ ఖమేనీతో పాటు పలువురు సీనియర్ సైనికాధికారులు, పౌరులు మరణించారు.

Advertisement

వివరాలు 

డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన అరాఘ్చీ

దీనికి ప్రతిగా ఇరాన్, ఇజ్రాయెల్,మధ్యప్రాచ్యంలో ఉన్న అమెరికా స్థావరాలపై క్షిపణులు, డ్రోన్లతో దాడులు కొనసాగిస్తూ, హర్మూజ్ జలసంధిపై తన నియంత్రణను మరింత బలపరిచింది. ఈ నేపథ్యంలో, ఇరాన్ తమతో చర్చలు జరుపుతోందని, యుద్ధాన్ని ముగించేందుకు ఒప్పందం కోరుకుంటోందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలను అరాఘ్చీ తాజా ప్రకటనతో ఖండించినట్లైంది.

Advertisement