Page Loader
సంక్షిప్తం చేయు
Telegram CEO: 'నా వీర్యదానంతో జన్మించిన 100 మందికి సంపద పంచేస్తా'.. మరో సంచలన ప్రకటన చేసిన టెలిగ్రామ్‌ సీఈఓ.. 
నా వీర్యదానంతో జన్మించిన 100 మందికి సంపద పంచేస్తా'..

Telegram CEO: 'నా వీర్యదానంతో జన్మించిన 100 మందికి సంపద పంచేస్తా'.. మరో సంచలన ప్రకటన చేసిన టెలిగ్రామ్‌ సీఈఓ.. 

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 20, 2025
09:17 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన మెసేజింగ్‌ యాప్‌లలో ఒకటైన టెలిగ్రామ్‌కు వ్యవస్థాపకుడిగా, సీఈఓగా ఉన్న పావెల్‌ దురోవ్‌ మరోసారి వార్తల్లో నిలిచారు.

గతంలో తనకు బయోలాజికల్‌గా 100 మందికి పైగా సంతానం ఉన్నట్లు చెప్పిన ఆయన తాజాగా ఈ పిల్లలపై సంచలనాత్మక ప్రకటన చేశారు.

ఈ పిల్లలందరికీ తన సంపదను సమానంగా పంచుతానని స్పష్టం చేశారు. తన భవిష్యత్తు ప్రణాళికను ఇందులో భాగంగా వెల్లడించారు.

గత సంవత్సరం జులైలో పావెల్‌ ఒక ప్రకటన ద్వారా గత 15 సంవత్సరాలలో చేసిన వీర్యదానాల ద్వారా 12 దేశాల్లో 100 మందికి పైగా పిల్లలు జన్మించారని తెలిపారు.

తాజాగా ఆయన ఓ ప్రముఖ మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ అంశాన్ని ప్రస్తావిస్తూ మరిన్ని వివరాలు వెల్లడించారు.

వివరాలు 

పిల్లలందరికీ సమానంగా 20 బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తి

ఇటీవలే తాను ఒక వీలునామా (విల్‌) రాసినట్లు చెబుతూ, అందులో తన సహజ సంతానం నుంచీ, వీర్యదానం ద్వారా జన్మించిన పిల్లల వరకు అందరికీ తన ఆస్తిపై సమాన హక్కు కల్పించానని చెప్పారు.

తనకి ఉన్న సుమారు 20 బిలియన్‌ డాలర్ల విలువైన ఆస్తిని ఈ పిల్లలందరికీ సమానంగా పంచుతానని వెల్లడించారు.

అయితే,ఈ సంపదను ఆ పిల్లలు తాము 30 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పొందలేరని ఆయన చెప్పారు.

వారి జీవితాల్లో ఆర్థిక స్వావలంబన సాధించాలనే ఉద్దేశంతో తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.

పావెల్‌ వివాహం చేసుకోకపోయినా,తనకు ముగ్గురు సహజీవన భాగస్వాములు ఉన్నారని,వారికి కలిపి ఆరుగురు పిల్లలు ఉన్నారని పేర్కొన్నారు.

వివరాలు 

40 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే వీలునామా

తన జీవితం ఎంతో సంక్లిష్టంగా,సవాళ్లతో నిండినదిగా ఉన్నదని చెప్పిన ఆయన,తనకు శత్రువులు కూడా ఉన్నారన్న విషయం వెల్లడించారు.

అందుకే తాను ఇంకా 40 సంవత్సరాలు కూడా పూర్తి కాకముందే వీలునామా రాయాల్సి వచ్చిందని చెప్పారు.

ప్రస్తుతం ఈ కథనం నెట్టింట వైరల్‌గా మారింది.

తన వీర్యదానాల గురించి గత ఏడాది పావెల్‌ ఒక సోషల్‌మీడియా పోస్ట్‌ ద్వారా వివరించారు.

వివరాలు 

12 దేశాల్లో వందల కొద్దీ జంటలకు పిల్లలు

"నాకు 100 మందికి పైగా పిల్లలు ఉన్నారు.పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితానికి ఇష్టపడుతున్న ఓ వ్యక్తికి ఇదెలా సాధ్యమైందని అనుకుంటున్నారా?సరిగ్గా 15సంవత్సరాల క్రితం,నా స్నేహితుడు నన్ను ఒక సహాయం కోరాడు.అతనికి,అతని భార్యకు సంతానం కలగని పరిస్థితి ఉండడంతో, నా వీర్యాన్ని దానం చేయమని నన్ను అడిగాడు.మొదట నేను నవ్వుకున్నాను.కానీ ఆ సమస్య ఎంత తీవ్రమైందో అర్థమయ్యాక స్పెర్మ్‌ డొనేషన్‌ కోసం నమోదు చేసుకున్నాను.అప్పటినుండి ఇప్పటి వరకు 12 దేశాల్లో వందల కొద్దీ జంటలకు పిల్లలు పుట్టేందుకు కారణమయ్యాను.నేను ఈ ప్రక్రియను చాలా ఏళ్ల క్రితమే ఆపినప్పటికీ,అప్పట్లో ఫ్రీజ్‌ చేసిన నా వీర్యంతో ఇంకా కొన్ని కుటుంబాలకు సంతానం కలుగుతున్నట్లు నాకు తెలిసింది"అని వివరించారు.