Iran-US war: పశ్చిమాసియాలో టెన్షన్ వాతావరణం.. ఇరాక్ లోని అమెరికా ఎంబసీపై దాడి
ఈ వార్తాకథనం ఏంటి
పశ్చిమాసియాలో పరిస్థితులు రోజురోజుకూ ఉద్రిక్తంగా మారుతున్నాయి. ఇటీవల ఇరాన్ కు చెందిన వ్యూహాత్మక ద్వీపంపై యూఎస్ వైమానిక దాడులు జరిపిన తర్వాత ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ దాడులకు ప్రతిగా టెహ్రాన్ ప్రతిదాడులకు దిగినట్లు సమాచారం. తాజాగా బాగ్దాద్ లోని అమెరికా రాయబార కార్యాలయ సముదాయంపై క్షిపణి దాడి జరిగింది. ఇరాక్ రాజధానిలో జరిగిన ఈ ఘటనలో ఎంబసీ సముదాయంలోని హెలిప్యాడ్ ధ్వంసమైనట్లు ఇరాక్ భద్రతా అధికారులు వెల్లడించారు. క్షిపణి పేలుడుతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కప్పుకుపోయిందని సమాచారం. అమెరికాకు చెందిన ప్రపంచంలోని అతిపెద్ద దౌత్య సముదాయాల్లో ఒకటైన బాగ్దాద్ ఎంబసీ కాంప్లెక్స్పై గతంలో కూడా రాకెట్లు, డ్రోన్లతో దాడులు జరిగినట్లు తెలుస్తోంది.
Details
24 గంటల వ్యవధిలో రెండోసారి దాడి
తాజా ఘటన వెనుక కూడా టెహ్రాన్ పాత్ర ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈదాడిపై ఇప్పటివరకు అమెరికా రాయబార కార్యాలయం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఇదిలా ఉండగా దుబాయిలో కూడా మరో దాడి జరిగినట్లు సమాచారం. ఆర్థిక కార్యకలాపాలకు కీలకంగా భావించే ఒక భవనాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి జరిగినట్లు స్థానిక మీడియా తెలిపింది. 24గంటల వ్యవధిలో ఈ ప్రాంతంలో రెండోసారి దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని, భవనం మాత్రమే కొంత మేర దెబ్బతిన్నట్లు దుబాయ్ మీడియా ఆఫీస్ తమ ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించింది. శుక్రవారం కూడా ఈ నగరంలోని మరో భవనంపై డ్రోన్ దాడి జరిగినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.