Shamso Bibi: 13 లక్షల మంది ఫాలోవర్లున్న టిక్టాక్ స్టార్ షమ్సో బీబీ దారుణ హత్య
ఈ వార్తాకథనం ఏంటి
పాకిస్థాన్లో మహిళలు సోషల్ మీడియాలో పబ్లిక్ ప్రొఫైల్ పెట్టుకోవడంపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది. 13లక్షల మంది ఫాలోవర్లున్న టిక్ టాక్ క్రియేటర్ షమ్సో బీబీ దారుణ హత్యకు గురికావడం కలకలం రేపింది. ఆన్లైన్లో 'ఆయేషా గిలమానా' పేరుతో ఆమె గుర్తింపు పొందారు. ఆగస్టు 14న ట్యాక్సిలాలో తన సోదరులు, సోదరితో కలిసి కారులో వెళ్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 ఏళ్ల షమ్సో బీబీ అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె సోదరి తీవ్రంగా గాయపడ్డారు. గత మూడు, నాలుగేళ్లుగా షమ్సో బీబీ సోషల్ మీడియాలో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఆమె టిక్టాక్ ఖాతాకు సుమారు 13 లక్షల మంది ఫాలోవర్లు ఉండగా, 3 కోట్లకు పైగా లైక్స్ వచ్చాయి.
వివరాలు
కారులో వెళ్తుండగా కాల్పులు
ఆమె మరణం తర్వాత ఆ ఖాతాను డీయాక్టివేట్ చేశారు.యూట్యూబ్లోనూ ఆమెకు సుమారు 1.76 లక్షల మంది సబ్స్క్రైబర్లు ఉన్నారు.
ఆమె లైవ్స్ట్రీమింగ్ వీడియోలకు సంబంధించిన కంటెంట్ను అక్కడ పంచుకునేవారు.
పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. ఆగస్టు 14న కాశిఫ్ అలియాస్ 'కాశీ' అనే వ్యక్తి షమ్సో బీబీకి ఫోన్ చేసి ఇంటి బయటకు రావాలని కోరాడు.
దీంతో ఆమె 15ఏళ్ల సోదరి అసీమా,సోదరుడు నైమతుల్లాతో కలిసి కారులో బయటకు వెళ్లారు.
వారు కారులో ప్రయాణిస్తుండగా పెట్రోల్ బంక్ సమీపంలో బైక్పై వచ్చిన ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపినట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ కాల్పుల్లో ఒక బుల్లెట్ షమ్సో బీబీ మెడలోకి దూసుకెళ్లింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
వివరాలు
డబ్బు వివాదమే కారణమని కుటుంబం ఆరోపణ
కాల్పుల కారణంగా కారు అదుపుతప్పి మరో కారును ఢీకొనడంతో ఆమె సోదరి తీవ్రంగా గాయపడ్డారు.
పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాల్లో 30 నుంచి 35 ఏళ్ల వయసున్న ఇద్దరు వ్యక్తులు బైక్పై అక్కడి నుంచి పారిపోతున్నట్లు కనిపించింది.
అయితే హత్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా తెలియరాలేదు.
షమ్సో బీబీ హత్యకు డబ్బు వివాదమే కారణమని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.
కౌసర్, జావెద్ అలియాస్ షాహీన్ అనే ఇద్దరితో ఆమెకు ఆర్థిక వివాదాలు ఉన్నాయని తెలిపారు.
తనకు రావాల్సిన డబ్బును తిరిగి ఇవ్వాలని షమ్సో బీబీ కోరారని, ఆ తర్వాత ఆమెకు పలుమార్లు హత్య బెదిరింపులు వచ్చినట్లు తండ్రి ఫజల్ సాహిబ్జాదా వెల్లడించారు.
వివరాలు
సనా యూసఫ్ హత్య తర్వాత మరో ఘటన
ఈ విషయంపై ఇస్లామాబాద్లో ఆమె ఫిర్యాదు కూడా చేసినట్లు కుటుంబం తెలిపింది.
తనను నిశ్శబ్దం చేయడంతో పాటు డబ్బు తీసుకునేందుకే ఈ దాడి చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అయితే ఈ ఆరోపణలను పోలీసులు ఇంకా ధ్రువీకరించలేదు. హత్యకు గల కారణంపై దర్యాప్తు కొనసాగుతోంది.
షమ్సో బీబీ హత్యకు కొన్ని వారాల ముందే 17ఏళ్ల సోషల్ మీడియా క్రియేటర్ సనా యూసఫ్ ఇస్లామాబాద్లో హత్యకు గురయ్యారు.
చిత్త్రాల్కు చెందిన సనా తన ఇంట్లోనే కాల్పులకు బలయ్యారు. ఈ కేసులో ఉమర్ హయత్ను పోలీసులు అరెస్టు చేశారు.
అనంతరం హత్య కేసులో అతడికి 21ఏళ్ల జైలు శిక్ష విధించారు.
సనాను సంప్రదించేందుకు హయత్ పలుమార్లు ప్రయత్నించాడని,ఆమె స్పందించకపోవడంతోనే హత్య చేసినట్లు కేసు వివరాల్లో వెల్లడైంది.
వివరాలు
'పరువు' పేరుతో మహిళలపై దాడులు
సనా హత్య తర్వాత సోషల్ మీడియాలో వచ్చిన కొన్ని స్పందనలు కూడా తీవ్ర విమర్శలకు దారితీశాయి.
ఆమె మరణానికి ఆమెనే కారణమన్నట్లుగా కొందరు వ్యాఖ్యలు చేశారు.
'చేసుకున్న దానికి ఫలితం అనుభవించాలి', 'ఆమెకు ఇదే జరగాలి.. ఇస్లాంను చెడుగా చూపించింది' అంటూ కొందరు చేసిన వ్యాఖ్యలు మహిళలపై ఉన్న వివక్షను మరోసారి బయటపెట్టాయి.
పాకిస్థాన్లో మహిళలు టిక్టాక్లో వీడియోలు చేయడం కుటుంబ 'గౌరవానికి' భంగం కలిగిస్తోందన్న కారణాలతో దాడులకు గురైన ఘటనలు గతంలోనూ ఉన్నాయి.
2025 జనవరిలో క్వెట్టాలో ఓ యువతి తన టిక్టాక్ ఖాతాను తొలగించేందుకు నిరాకరించడంతో ఆమె తండ్రి కాల్చి చంపినట్లు సమాచారం.
ఆమె వీడియోలు కుటుంబ పరువుకి భంగం కలిగిస్తున్నాయని తండ్రి భావించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.
వివరాలు
'గౌరవం' పేరుతో మహిళలపై దాడులు
మరో ఘటనలో 'అసభ్యకరమైన' టిక్టాక్ వీడియోలు చేశారన్న కారణంతో నలుగురు మహిళలను హత్య చేశాడన్న ఆరోపణలపై ఓ వ్యక్తిని కరాచీ పోలీసులు అరెస్టు చేశారు.
ఇలాంటి ఘటనలు సోషల్ మీడియా, పురుషాధిక్య భావజాలం, మహిళలపై నియంత్రణ, హింస మధ్య ఉన్న సంబంధాన్ని స్పష్టం చేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
దాదాపు 3 లక్షల మంది మహిళలున్న ప్రైవేట్ ఫేస్బుక్ గ్రూప్ను నిర్వహించే కన్వల్ అహ్మద్ ప్రకారం.. ఇది ఒక్క వ్యక్తి చేసిన పని కాదని, సమాజంలో వేళ్లూనుకున్న భయమని పేర్కొన్నారు.
టిక్టాక్ ఉపయోగించినా, కేవలం 50 మంది ఫాలోవర్లున్న ప్రైవేట్ ఇన్స్టాగ్రామ్ ఖాతా ఉన్నా మహిళలను పురుషులు ఆన్లైన్లోనూ, వీధుల్లోనూ వేధిస్తున్నారని ఆమె అన్నారు.
వివరాలు
కందీల్ బలోచ్ హత్య
మహిళా కంటెంట్ క్రియేటర్ల హత్యలు 2016లో జరిగిన పాకిస్థాన్ సోషల్ మీడియా సెలబ్రిటీ కందీల్ బలోచ్ హత్యను కూడా గుర్తుచేస్తున్నాయి.
ఆమెను సొంత సోదరుడే హత్య చేశాడు. మహిళలు తమకు నచ్చిన నిర్ణయాలు తీసుకోవడం లేదా పురుషుల నియంత్రణ నుంచి బయటపడేందుకు ప్రయత్నించినప్పుడు హింసకు గురయ్యే ప్రమాదం ఉంటుందని లింగ హక్కుల కార్యకర్త ఫర్జానా బారీ పేర్కొన్నారు.
పాకిస్థాన్లో మహిళలపై జరుగుతున్న హింస విస్తృతంగా ఉందని ఆ దేశ మానవ హక్కుల కమిషన్ నివేదికలు చెబుతున్నాయి.
2025 తొలి ఆరు నెలల్లో 700 మందికి పైగా మహిళలు హత్యకు గురైనట్లు సమాచారం.
వీటిలో సుమారు నాలుగో వంతు కేసులు కుటుంబ పరువు పేరుతో జరిగిన హత్యలుగా వర్గీకరించారు
వివరాలు
ఆన్లైన్ వేధింపులు మరో సమస్య
ఇదే సమయంలో 600 మందికి పైగా మహిళలు లైంగిక హింసకు గురైనట్లు, 500 మందికి పైగా మహిళలు కిడ్నాప్కు గురైనట్లు నివేదికలు వెల్లడించాయి.
మహిళలపై కాల్చడం, నిప్పంటించడం, యాసిడ్ దాడులు వంటి ఘటనలు కూడా నమోదయ్యాయి.
మహిళలకు ఎదురయ్యే ప్రమాదాలు భౌతిక దాడులతోనే ఆగిపోవడం లేదు.
సోషల్ మీడియాలోనూ వేధింపులు, దూషణలు, బాధితులనే తప్పుబట్టే ధోరణి పెరుగుతోంది.
సనా యూసఫ్ హత్య తర్వాత డిజిటల్ రైట్స్ ఫౌండేషన్ ఆన్లైన్ స్పందనలను పరిశీలించింది.
హంతకుడిని సమర్థించేలా, ఆమె సోషల్ మీడియాలో ఉండటమే హత్యకు కారణమన్నట్లుగా వ్యాఖ్యలు చేసినట్లు గుర్తించింది.
వివరాలు
ఆన్లైన్ వేధింపులు మరో సమస్య
షమ్సో బీబీ హత్య తర్వాత కూడా ఇలాంటి స్పందనలు కనిపించాయి.
ఆమె హత్యపై వచ్చిన వార్తల్లో మహిళల పట్ల వివక్ష, అవమానకరమైన వ్యాఖ్యలు కనిపిస్తున్నాయని స్వతంత్ర జర్నలిస్ట్ అమ్మారా అహ్మద్ విమర్శించారు.
మరణించిన తర్వాత కూడా పాకిస్థాన్ మహిళలకు కనీస గౌరవం దక్కడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
షమ్సో బీబీ హత్యపై ప్రస్తుతం పాకిస్థాన్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
హత్యకు అసలు కారణం ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. అయితే ఈ ఘటనతో సోషల్ మీడియాలో ప్రజాదరణ పొందిన మహిళల భద్రత మరోసారి ప్రశ్నార్థకంగా మారింది.
ఆన్లైన్ వేధింపులు, బెదిరింపులు, మహిళలపై హింస, 'పరువు' పేరుతో జరిగే దాడులు పాకిస్థాన్లో మహిళలకు ఎలాంటి ముప్పును తెచ్చిపెడుతున్నాయన్న చర్చ మళ్లీ మొదలైంది.