Page Loader
ISIS Chief: క్షిపణి ప్రయోగంతో ఐసిస్ అగ్రనేత హతం (వీడియో)
క్షిపణి ప్రయోగంతో ఐసిస్ అగ్రనేత హతం

ISIS Chief: క్షిపణి ప్రయోగంతో ఐసిస్ అగ్రనేత హతం (వీడియో)

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 15, 2025
01:57 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఉగ్రవాదంపై పోరులో అమెరికాకు మరో కీలక విజయం లభించింది. ఇస్లామిక్ స్టేట్ (ISIS) గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ అబ్దుల్లా మక్కీ ముస్లిహ్ అల్ రిఫాయ్ అలియాస్ అబు ఖదీజాను అగ్రరాజ్యం మట్టుబెట్టింది. ఇరాకీ ఇంటెలిజెన్స్, భద్రతా దళాల సహకారంతో అమెరికా సైన్యం ఇరాక్‌లో గల ఓ ప్రాంతంలో అతడిపై క్షిపణి ప్రయోగించి హతమార్చింది. ఈ ఆపరేషన్‌కు సంబంధించిన వీడియోను యూఎస్ సెంట్రల్ కమాండ్ విడుదల చేసింది.

Details

క్షిపణి దాడిలో ఖదీజా హతం

ఈ మిలిటరీ ఆపరేషన్ మార్చి 13న జరిగింది, అయితే దీని వివరాలు తాజాగా వెలుగు చూశాయి. అబు ఖదీజా కారులో ప్రయాణిస్తున్న సమయంలో అమెరికా దళాలు అతడిపై క్షిపణి ప్రయోగించాయి. ఘటనాస్థలంలోనే అతడు మరణించాడని, అతడితో పాటు మరో ఐసిస్ ఉగ్రవాది కూడా మృతి చెందినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ వెల్లడించింది. దాడి అనంతరం భద్రతా దళాలు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. వీరిద్దరి శరీరాలకు సూసైడ్ బాంబులు అమర్చివున్నాయని, వారి వద్ద మరిన్ని ఆయుధాలు కూడా ఉన్నట్లు గుర్తించారు.

Details

డీఎన్‌ఏ ద్వారా గుర్తింపు 

ఇది తొలి ప్రయత్నం కాదు. గతంలో ఓ ఆపరేషన్‌లో అబు ఖదీజా తప్పించుకోగా, అప్పట్లో భద్రతా బలగాలు అతడి డీఎన్‌ఏ నమూనాను సేకరించాయి. తాజా ఆపరేషన్ తర్వాత అతడి మృతదేహంపై డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించడంతో ఖదీజా మరణాన్ని ధృవీకరించారు. అతడి దుర్భర జీవితం ముగిసింది ఈ విజయాన్ని తొలుత ఇరాక్ ప్రధాని ప్రకటించగా, అనంతరం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా స్పందించారు. 'ఇరాక్‌లో ఐసిస్ అగ్రనేతను హతమార్చాం. మా ధైర్యవంతమైన యుద్ధయోధులు అతడిని తుదముట్టించేందుకు ఎంతో శ్రమించారు. చివరకు అతడి దుర్భర జీవితం ముగిసింది. బలంతోనే శాంతిని సాధించగలమని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ప్లాట్‌ఫామ్‌లో రాశారు.

Details

అబు ఖదీజా.. ఐసిస్‌లో రెండో శక్తిమంతమైన నేత

అబు ఖదీజా ఐసిస్ ముఠాలో అత్యంత కీలకమైన నాయకుల్లో ఒకడిగా, ఈ సంస్థ గ్లోబల్ ఆపరేషన్లను పర్యవేక్షించే వ్యక్తిగా ఉన్నాడు. అతడు ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రమాదకర ఉగ్రవాదుల్లో ఒకడిగా గుర్తించారు. 2023లో అతడిపై అమెరికా ఆంక్షలు విధించింది. అమెరికా నేతృత్వంలోని సంకీర్ణ భద్రతా దళాలు ఐసిస్‌ను నిర్వీర్యం చేసేందుకు కొన్నేళ్లుగా కీలక మిలిటరీ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. 2017 నాటికి ఇరాక్‌లో, 2019 నాటికి సిరియాలో ఈ సంస్థ ప్రభావాన్ని తగ్గించగలిగారు. అయినా ఈ రెండు దేశాల్లో మారుమూల ప్రాంతాల్లో ఐసిస్ గ్రూప్ సభ్యులు ఇంకా తమ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారు. ఈ తాజా ఆపరేషన్ ద్వారా అమెరికా మరోసారి ఉగ్రవాదంపై తన పోరాటాన్ని రుజువు చేసింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వీడియో రిలీజ్ చేసిన అమెరికా