New York: న్యూయార్క్ ఏజీ ఎన్నికల బరిలో తెలుగు తేజం.. డెమొక్రాట్ లెటిటియా జేమ్స్కు సవాల్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా రాజకీయాల్లో తెలుగు మూలాలున్న వారి ప్రాతినిధ్యం క్రమంగా పెరుగుతోంది. ఈ క్రమంలో తెలంగాణకు చెందిన సరిత కోమటిరెడ్డి న్యూయార్క్ అటార్నీ జనరల్ (ఏజీ) పదవికి పోటీ చేయనున్నారు. ఆమె అభ్యర్థిత్వానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బహిరంగంగా మద్దతు ప్రకటించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సరిత కోమటిరెడ్డికి న్యాయ రంగంలో విశేష అనుభవం ఉంది. ఆమె గతంలో ఫెడరల్ ప్రాసిక్యూటర్గా విధులు నిర్వహించారు. అంతేకాకుండా డ్రగ్ ఎన్ఫోర్స్మెంట్ అడ్మినిస్ట్రేషన్ (DEA)లో చీఫ్ ఆఫ్ స్టాఫ్గా కూడా కీలక బాధ్యతలు చేపట్టారు. ఆమె కుటుంబం కొన్ని దశాబ్దాల క్రితమే తెలంగాణ నుంచి అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడింది.
వివరాలు
ట్రంప్ మద్దతుపై సరిత కోమటిరెడ్డి కృతజ్ఞతలు
న్యూయార్క్ అటార్నీ జనరల్ ఎన్నికలు ఈ ఏడాది నవంబర్లో జరగనున్నాయి.
ఈ ఎన్నికల్లో డెమొక్రాటిక్ పార్టీ తరఫున ప్రస్తుత అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ మరోసారి బరిలో ఉన్నారు.
ఇప్పటికే ఆమె రెండుసార్లు ఈ పదవిని గెలుచుకున్నారు. ఈ నేపథ్యంలో లెటిటియా జేమ్స్కు సరిత కోమటిరెడ్డి గట్టి పోటీ ఇవ్వగలరని ట్రంప్ పేర్కొన్నారు.
తన 'ట్రూత్ సోషల్' ఖాతాలో సరిత అభ్యర్థిత్వానికి పూర్తి మద్దతు ప్రకటించిన ఆయన.. ఆమెకు తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.
ట్రంప్ మద్దతుపై స్పందించిన సరిత కోమటిరెడ్డి 'ఎక్స్' వేదికగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.