
Donald Trump: రష్యా చమురును భారత్ కొనుగోలు చేయదని మోదీ హామీ: ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి ఇకపై భారత్ చమురు కొనుగోలు చేయదని ప్రధాని నరేంద్ర మోదీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్ వెల్లడించారు. ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి రష్యాను అంతర్జాతీయంగా ఒంటరిచేయడానికి ఇది ఒక ముఖ్యమైన ముందడుగు అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. వైట్హౌస్లో జర్నలిస్టులతో మాట్లాడిన ట్రంప్ మాట్లాడుతూ, రష్యా నుంచి భారత్ చమురు దిగుమతులు కొనసాగించడం పట్ల తాను ఆందోళన వ్యక్తం చేశానని చెప్పారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయడం వల్ల పుతిన్ యుద్ధాన్ని కొనసాగించడానికి ఆ నిధులు ఉపయోగపడుతున్నాయని అమెరికా భావిస్తోందని ఆయన వివరించారు.
వివరాలు
యూఎస్కు భారత్ సన్నిహిత భాగస్వామి: ట్రంప్
మాస్కో నుంచి భారత్ చమురు దిగుమతులు చేస్తున్న విషయం తనకు అసంతృప్తిని కలిగించిందని ట్రంప్ అన్నారు. అయితే,ఇకపై రష్యా నుంచి చమురు కొనుగోలు చేయబోమని ప్రధాని మోదీ హామీ ఇచ్చారని, ఇది అత్యంత కీలకమైన పరిణామమని ఆయన పేర్కొన్నారు. అదే విధంగా,చైనా కూడా రష్యా చమురును కొనడం ఆపేలా చేయడం ఇప్పుడు మిగిలి ఉందని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇంధన విధానాల విషయంలో భారత్,అమెరికా మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నప్పటికీ,భారత్ యునైటెడ్ స్టేట్స్కు విశ్వసనీయ భాగస్వామి అని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రధాని మోదీ తన స్నేహితుడని,తమ మధ్య గొప్ప అనుబంధం ఉన్నట్లు తెలిపారు. అయితే చమురు కొనుగోలు విషయంపై ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి భారత్ అధికారికంగా ఎటువంటి స్పందన ఇవ్వలేదు.