Trump: హర్మూజ్పై పూర్తి నియంత్రణ అమెరికాదే: ఇరాన్కు ట్రంప్ తీవ్ర హెచ్చరిక
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు మరోసారి తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇరాన్తో కొనసాగుతున్న చర్చలపై తమకు నమ్మకం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ దేశం ఎప్పుడూ తనతో అబద్ధాలే చెబుతుందని ఆరోపించారు. హర్మూజ్ జలసంధిపై పూర్తి నియంత్రణ ప్రస్తుతం అమెరికా చేతుల్లోనే ఉందని ట్రంప్ పేర్కొన్నారు. జలసంధి తమ అధీనంలోనే ఉందని తెలిపారు. చర్చల నుంచి మరోసారి వెనక్కి తగ్గినా, దుందుడుకు చర్యలకు పాల్పడినా ఇరాన్ తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
వివరాలు
హర్మూజ్లో నౌకపై అమెరికా దాడి
హర్మూజ్ జలసంధిలోని ఒమన్ సమీపంలో ఓ నౌకపై అమెరికా దాడి చేసింది.
ఇరాన్ రేవులపై అమెరికా విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘించినందుకే ఈ చర్య తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
పనామా జెండాతో ప్రయాణిస్తున్న 'వేలా నోవా' అనే కార్గో నౌకపై అమెరికా నేవీకి చెందిన హెలికాప్టర్ రెండు హెల్ఫైర్ క్షిపణులను ప్రయోగించినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ (CENTCOM) తెలిపింది.
అయితే ఈ దాడిలో నౌకలోని సిబ్బందికి ఎవరైనా గాయపడ్డారా లేదా అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.
వివరాలు
పనామా కాల్వపై పెరిగిన ఒత్తిడి
హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పనామా కాల్వలో నౌకల రద్దీ మరింత పెరిగినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి.
మరోవైపు ఎల్నినో ప్రభావంతో పనామా కాల్వలో నీటి మట్టం తగ్గుతున్నట్లు పేర్కొన్నాయి.
ఈ పరిస్థితుల కారణంగా కాల్వ గుండా ప్రయాణించే ప్రతి వాణిజ్య నౌక నుంచి పనామా కాల్వ అథారిటీ సుమారు 4 మిలియన్ డాలర్లు వసూలు చేస్తున్నట్లు తెలిపాయి.
భారీ నౌకలు పనామా కాల్వను దాటేందుకు దాదాపు 10 రోజుల పాటు వేచి ఉండాల్సి వస్తున్నట్లు సమాచారం.