Trump: ఇరాన్తో చర్చలు కొనసాగుతున్నాయి.. ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్తో శాంతి చర్చలు నిరంతరంగా కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇరు దేశాల మధ్య ప్రతిరోజూ సందేశాల మార్పిడి జరుగుతోందని ఆయన తెలిపారు. అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు ఆగిపోయాయంటూ కొన్ని ఇరాన్ మీడియా సంస్థలు ప్రచారం చేయడంతో ట్రంప్ స్పందించారు. మంగళవారం 'ట్రూత్ సోషల్' వేదికగా ఆయన చేసిన వ్యాఖ్యల్లో, ''నాలుగు రోజుల క్రితం, మూడు రోజుల క్రితం, రెండు రోజుల క్రితం, నిన్న, నేడు కూడా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరు దేశాల మధ్య సంప్రదింపులు ఎప్పుడూ ఆగలేదు'' అని పేర్కొన్నారు. అయితే ఈ చర్చలు ఎలాంటి ఫలితానికి దారితీస్తాయన్నది ఇప్పుడే చెప్పలేమని స్పష్టం చేశారు.
వివరాలు
లెబనాన్ అంశం అత్యంత కీలకం : మహమ్మద్ బఘేర్ ఘాలిబఫ్
ఇదిలా ఉండగా, యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికాతో జరుగుతున్న చర్చల్లో లెబనాన్ అంశం అత్యంత కీలకమని ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఘాలిబఫ్ పేర్కొన్నారు. ఈ విషయాన్ని ఆయన 'ఎక్స్' వేదికగా వెల్లడించారు. భవిష్యత్తులో కుదిరే ఏ ఒప్పందంలోనైనా లెబనాన్కు సంబంధించిన అంశాలు ప్రధానంగా ఉండనున్నాయని తెలిపారు. మరోవైపు, లెబనాన్ విషయంలో ఇరాన్ తీవ్రంగా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ, అక్కడ ఇజ్రాయెల్ సైనిక చర్యలు కొనసాగుతున్నాయి. దక్షిణ లెబనాన్లో మంగళవారం ఇజ్రాయెల్ నిర్వహించిన డ్రోన్ దాడుల్లో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయినట్లు సమాచారం.