Trump: అమెరికాలో ఆర్థిక మాంద్యం వార్తలు.. తోసిపుచ్చిన డొనాల్డ్ ట్రంప్..!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) అధికారంలోకి వచ్చీ రాగానే పలు దేశాలపై సుంకాలతో విరుచుకుపడ్డారు.
వాణిజ్య భాగస్వాములపై ఇలాంటి టారిఫ్ల విధింపు కారణంగా ఆర్థిక అనిశ్చితి నెలకొనే అవకాశం ఉందని వ్యాపార వర్గాల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగే అవకాశముండడంతోపాటు, ఇది ఆర్థిక మాంద్యానికి (Recession In US) దారితీయవచ్చనే భయాలు వ్యక్తమవుతున్నాయి.
అయితే, ఈ వార్తలను ట్రంప్ కొట్టిపారేశారు. ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశమే లేదని, ఇలాంటి అంచనాలు తనకు నచ్చవని స్పష్టం చేశారు.
వివరాలు
2025లో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశముందా?
ఫాక్స్ న్యూస్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ సుంకాల అంశంపై స్పందించారు.
''ఏప్రిల్ 2 నుంచి అన్నీ పరస్పర సుంకాల విధింపులే. మనపై ఎంత టారిఫ్లు విధిస్తే, మనమూ వారి నుంచి అంతే వసూలు చేస్తాం'' అని తెలిపారు.
ఇక, 2025లో ఆర్థిక మాంద్యం వచ్చే అవకాశముందా? అనే ప్రశ్నకు ట్రంప్ స్పందిస్తూ.. ''ఇలాంటి అంచనాలను నేను ఇష్టపడను. ఇది మార్పుల కాలం.. ఎన్నో సంస్కరణలు అమలు చేస్తున్నాం. అమెరికాలోకి సంపదను తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నాం. అయితే, ఇది చాలా పెద్ద అంశం కావడంతో, దానికి కొంత సమయం పడుతుంది'' అని వివరణ ఇచ్చారు.