LOADING...
Donald Trump: గాజా శాంతి సంఘంలోకి భారత్‌కు ట్రంప్ ఆహ్వానం!
గాజా శాంతి సంఘంలోకి భారత్‌కు ట్రంప్ ఆహ్వానం!

Donald Trump: గాజా శాంతి సంఘంలోకి భారత్‌కు ట్రంప్ ఆహ్వానం!

వ్రాసిన వారు Sirish Praharaju
Jan 19, 2026
10:34 am

ఈ వార్తాకథనం ఏంటి

ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా తీవ్ర నష్టపోయిన గాజా ప్రాంతంలో పాలన, పునర్నిర్మాణ చర్యలను పర్యవేక్షించడానికి ఏర్పాటు చేసిన 'బోర్డ్ ఆఫ్ పీస్'లో భాగస్వామ్యానికి భారతదేశాన్ని ఆహ్వానించారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ బోర్డు ఏర్పాటును గాజా శాంతి కోసం రూపొందించిన 20-పాయింట్ల ప్రణాళికలో భాగంగా జనవరి 15న ప్రకటించారు. బోర్డుకు ట్రంప్ స్వయంగా అధ్యక్షత వహిస్తుండగా, గాజా ప్రాంత పాలన బాధ్యతలను పాలస్తీనా టెక్నోక్రాట్ కమిటీ చేపడుతుంది. అలాగే, పాలసీ సూచనలు, సలహాలు అందించేందుకు ఒక ఎగ్జిక్యూటివ్ బోర్డు కూడా ఏర్పాటు చేశారు.

వివరాలు 

పాకిస్థాన్ ఎలాంటి పాత్ర పోషించినా అది తమకు ఆమోదయోగ్యం కాదన్న ఇజ్రాయిల్

భారతదేశానికి ఇజ్రాయిల్ మరియు పాలస్తీనా రెండింటితో సుస్థిర స్నేహ సంబంధాలు ఉండటంతో పాటు, ఇజ్రాయిల్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగుతున్న విషయం ఈ ఆహ్వానానికి ప్రత్యేక ప్రాధాన్యతను ఇస్తుంది. గాజా యుద్ధం అనంతరం మానవతా సహాయం పంపిన దేశాలలో భారత్ ముందుండడం కూడా దీనికి తోడ్పడింది. ఇదే సమయంలో, గాజా 'బోర్డ్ ఆఫ్ పీస్'లో చేరేందుకు పాకిస్తాన్ కూడా ట్రంప్ నుంచి ఆహ్వానం అందిందని ప్రకటించింది. అయితే, భారత్‌లోని ఇజ్రాయిల్ రాయబారి రూవెన్ అజార్ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో, గాజా భవిష్యత్తు విషయంలో పాకిస్తాన్ ఏ విధమైన పాత్రను పోషించినా, అది ఇజ్రాయిల్‌కి ఆమోదయోగ్యం కాదని స్పష్టత ఇచ్చారు. ట్రంప్ ప్రతిపాదనపై ప్రపంచ దేశాలు మిశ్రమ స్పందన కనబరుస్తున్నాయి.

వివరాలు 

బోర్డులో చోటు సంపాదించుకున్న ఇజ్రాయిల్-సైప్రస్ వ్యాపారవేత్త యాకిర్ గాబే

సుమారు 60 దేశాలకు ఆహ్వానాలు పంపినట్లు తెలిసినప్పటికీ, ఇప్పటివరకు కేవలం హంగేరీ మాత్రమే బోర్డులో చేరడానికి అంగీకరించింది. ఈ బోర్డు ఏర్పాటుతో ఐక్యరాజ్యసమితి పాత్రపై ప్రభావం పడవచ్చని ఐరోపా దేశాల డిప్లమాట్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు, గాజా ఎగ్జిక్యూటివ్ బోర్డులో టర్కీ విదేశాంగ మంత్రి హకాన్ ఫిదాన్, ఐక్యరాజ్య సమితి మధ్యప్రాచ్య శాంతి సమన్వయకర్త సిగ్రిడ్ కాంగ్, యూఏఈ మంత్రి రీమ్ అల్ హషిమీ,అలాగే ఖతార్, యూఏఈ ఉన్నతాధికారులు సభ్యులుగా ఉన్నారు. ఇజ్రాయిల్-సైప్రస్ వ్యాపారవేత్త యాకిర్ గాబే కూడా బోర్డులో చోటు సంపాదించుకున్నారు. అయితే, బోర్డు నిర్మాణంపై ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రత్యేకంగా, టర్కీ, ఖతార్ ప్రతినిధుల స్థానమున్నందుకు ఇజ్రాయిల్ తీవ్ర వ్యతిరేకత చూపుతోంది.

Advertisement