Project Freedom: హార్ముజ్లో చిక్కుకున్న ఓడలకు రక్షణ.. 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' ప్రకటించిన ట్రంప్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదివారం 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్' పేరుతో కొత్త కార్యాచరణను ప్రకటించారు. Strait of Hormuz ప్రాంతంలో ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం కారణంగా చిక్కుకుపోయిన నిష్పాక్షిక దేశాల ఓడలను సురక్షితంగా బయటకు తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం. ఈ కార్యక్రమం సోమవారం (మే 4, 2026) నుంచి అమల్లోకి వస్తుందని ఆయన వెల్లడించారు. ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికలో స్పందిస్తూ.. యుద్ధంలో పాల్గొనని అనేక దేశాలు తమ ఓడలు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తీసుకురావాలని అమెరికాను అభ్యర్థించాయని తెలిపారు. వాటిని భద్రంగా మార్గనిర్దేశం చేస్తామని, ఈ ప్రక్రియకు ఎవరైనా అడ్డుపడితే బలంగా ఎదుర్కొంటామని ఇరాన్కు గట్టిగా హెచ్చరించారు.
వివరాలు
ఎందుకు ఈ కార్యాచరణ?
ప్రపంచ చమురు సరఫరాకు కీలక మార్గమైన హార్ముజ్ సముద్రద్వారం యుద్ధం మొదలైనప్పటి నుంచి మూసుకుపోయింది. దీనివల్ల వందలాది వాణిజ్య ఓడలు, దాదాపు 20 వేల మంది సముద్రయానులు అక్కడే నిలిచిపోయారు. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని, యుద్ధంలో పాల్గొనని దేశాల ఓడలకు మాత్రమే సహాయం అందిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ చర్యను మానవతా దృక్పథంతో చేపట్టినదిగా పేర్కొన్నారు. United States Central Command ప్రకారం, ఈ కార్యక్రమానికి గైడెడ్ క్షిపణి యుద్ధ నౌకలు, వందకు పైగా విమానాలు, డ్రోన్లు, 15 వేల మంది సైనికులు సహకరించనున్నారు. అయితే ఇది పూర్తి రక్షణ మిషన్ కాదని, మార్గనిర్దేశం,సమన్వయం ఆధారంగా సాగుతుందని అధికారులు వెల్లడించారు.
వివరాలు
ఇరాన్కు గట్టి హెచ్చరిక
ఈ కార్యాచరణలో ఎవరైనా అడ్డంకులు సృష్టిస్తే కఠినంగా ప్రతిస్పందిస్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్ నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు. అయితే కొందరు విశ్లేషకులు దీన్ని యుద్ధ విరమణ నిబంధనలకు విరుద్ధంగా భావించే అవకాశముందని అంటున్నారు. ఈప్రకటనతో అంతర్జాతీయ మార్కెట్లు, ముఖ్యంగా చమురు ధరలు అప్రమత్త స్థితిలోకి వెళ్లాయి. హార్ముజ్ మార్గం మళ్లీ తెరుచుకోవడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కీలకమని నిపుణులు చెబుతున్నారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధం మూడోనెలలోకి చేరుతోంది.ఇదే సమయంలో ట్రంప్ ఇరాన్తో శాంతి చర్చలకు కూడా సంకేతాలు ఇచ్చారు. ఈనేపథ్యంలో 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'ను యుద్ధ పరిస్థితుల్లో మానవతా సహాయం అందించే చర్యగా అమెరికా వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ పరిణామాలు మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలను మరింత పెంచే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.