LOADING...
Trump: ఇరాన్ అణు పదార్థాలను ధ్వంసం చేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఇరాన్ అణు పదార్థాలను ధ్వంసం చేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

Trump: ఇరాన్ అణు పదార్థాలను ధ్వంసం చేస్తాం.. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

వ్రాసిన వారు Moogati Shabari
May 29, 2026
10:02 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం కీలక ప్రకటన చేశారు. ఇరాన్‌తో యుద్ధం ముగిసేలా ఒప్పందానికి తుది నిర్ణయం తీసుకునే ముందు తాను 'సిట్యుయేషన్ రూమ్'లో సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అదే సమయంలో ఒప్పందానికి ఇరాన్ తప్పనిసరిగా అంగీకరించాల్సిన షరతులను కూడా ట్రంప్ వెల్లడించారు. ట్రూత్ సోషల్‌లో చేసిన పోస్టులో ట్రంప్ మాట్లాడుతూ.. ఇరాన్ ఎప్పటికీ అణ్వస్త్రాలు తయారు చేయకూడదని అంగీకరించాలని స్పష్టం చేశారు. అలాగే హోర్ముజ్ జలసంధి ద్వారా ఎలాంటి ఆంక్షలు లేకుండా నౌకాయాన రాకపోకలు వెంటనే ప్రారంభం కావాలని డిమాండ్ చేశారు. ఒమాన్ గల్ఫ్ ప్రాంతంలో ఇరాన్‌పై అమెరికా అమలు చేస్తున్న నౌకాదళ దిగ్బంధాన్ని ఎత్తివేస్తామని కూడా ట్రంప్ తెలిపారు.

వివరాలు

మరొక ప్రకటన వచ్చే వరకు ఎలాంటి డబ్బు చెల్లింపులు ఉండవు..

గత ఏడాది ఇరాన్ అణు కేంద్రాలపై జరిగిన దాడుల తర్వాత అక్కడ భూగర్భంలో దాచిన సమృద్ధి చెందిన అణు పదార్థాలను అమెరికా వెలికితీసి ధ్వంసం చేస్తుందని ట్రంప్ చెప్పారు. ఈ ప్రక్రియను ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌తో పాటు అంతర్జాతీయ అణుశక్తి సంస్థ సహకారంతో నిర్వహిస్తామని పేర్కొన్నారు. "మరొక ప్రకటన వచ్చే వరకు ఎలాంటి డబ్బు చెల్లింపులు ఉండవు. అంత ముఖ్యంకాని మరికొన్ని అంశాలపై ఇప్పటికే అంగీకారం కుదిరింది" అని ట్రంప్ తెలిపారు. తుది నిర్ణయం తీసుకునేందుకు ఇప్పుడు సిట్యుయేషన్ రూమ్‌లో సమావేశమవుతున్నానని ఆయన వెల్లడించారు.

వివరాలు

సీరియస్‌గా సాగనున్న అణు చర్చలు..

ప్రస్తుతం అమెరికా-ఇరాన్ మధ్య చర్చల్లో ఉన్న ఒప్పందం పూర్తి వివరాలు ఇంకా బయటకు రాలేదు. అయితే అమెరికా, ఇరాన్ ప్రతినిధి బృందాలు 60 రోజుల అవగాహన ఒప్పందానికి చేరుకున్నాయని వైట్ హౌస్ అధికారి ఒకరు ధృవీకరించారు. ఈ ఒప్పందం ద్వారా మూడు నెలలుగా కొనసాగుతున్న కాల్పుల విరమణను పొడిగించి, అణు చర్చలకు మార్గం సుగమం చేయనున్నట్లు సమాచారం. ఈ అవగాహన ఒప్పందంలో భాగంగా హోర్ముజ్ జలసంధిలో ఉన్న అన్ని మైన్స్‌ను 30 రోజుల్లోగా ఇరాన్ తొలగించాల్సి ఉంటుందని, దానికి అనుగుణంగా అమెరికా తన దిగ్బంధాన్ని ఎత్తివేస్తుందని తెలుస్తోంది.

Advertisement

వివరాలు

అమెరికాపై ఇరాన్ విమర్శలు..

ఇరాన్ వద్ద ఉన్న అధిక శుద్ధి చేసిన యురేనియం నిల్వలు, అణు శుద్ధి లక్ష్యాల అంశాలు ఈ 60 రోజుల చర్చల్లో ప్రధాన ప్రాధాన్యంగా ఉండనున్నాయని నివేదికలు చెబుతున్నాయి. అలాగే ఇరాన్‌పై ఉన్న ఆంక్షల సడలింపు, నిలిపివేసిన నిధుల విడుదల అంశాలపై కూడా చర్చలు జరగనున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఇటీవల నెలకొన్న ఆర్థిక, సైనిక ఉద్రిక్తతల మధ్య ట్రంప్ చేసిన ఈ ప్రకటన ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు ఇరాన్ అధికారులు, ప్రభుత్వ మీడియా అమెరికాపై విమర్శనాత్మక వైఖరినే కొనసాగిస్తున్నాయి.

Advertisement

వివరాలు

జలసంధి ప్రాంతాల్లో భారీగా డ్రోన్లు మోహరింపు..

పెంటగాన్ గురువారం తెలిపిన వివరాల ప్రకారం, ఇరాన్ కువైట్ వైపు బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించడంతో పాటు హోర్ముజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో దాడి డ్రోన్లను మోహరించింది. అదే సమయంలో ఇరాన్ మీడియా కూడా తమ సాయుధ దళాలు గుర్తు తెలియని లక్ష్యాలపై క్షిపణి దాడులు నిర్వహించాయని వెల్లడించింది. ఇక అమెరికా ట్రెజరీ శాఖ బుధ, గురువారాల్లో ఇరాన్‌పై కొత్త ఆంక్షలను ప్రకటించింది. హోర్ముజ్ జలసంధి రవాణాపై నియంత్రణ సాధించేందుకు టెహ్రాన్ చేస్తున్న తాజా ప్రయత్నాలను లక్ష్యంగా చేసుకుని ఈ ఆంక్షలు విధించినట్లు సమాచారం. ట్రంప్ ప్రకటనకు ముందు ఇరాన్ అధికారులు ఎక్స్‌లో చేసిన పోస్టుల్లో అమెరికాపై ధిక్కార స్వరమే వినిపించింది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

వైరల్ అవుతున్న పోస్ట్ ఇదే..

Advertisement