Loading...
Peter Navarro: 100 శాతం టారిఫ్‌ల అంశాన్నిమోదీ, ట్రంప్‌ చర్చలతో పరిష్కరిస్తారు: నవారో
100 శాతం టారిఫ్‌ల అంశాన్నిమోదీ, ట్రంప్‌ చర్చలతో పరిష్కరిస్తారు: నవారో

Peter Navarro: 100 శాతం టారిఫ్‌ల అంశాన్నిమోదీ, ట్రంప్‌ చర్చలతో పరిష్కరిస్తారు: నవారో

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 12, 2026
12:36 pm

ఈ వార్తాకథనం ఏంటి

రష్యా నుంచి భారత్‌ చమురు కొనుగోలు చేస్తున్న అంశంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, భారత ప్రధాని నరేంద్ర మోదీ చర్చించి సమస్యను పరిష్కరించుకుంటారని ట్రంప్‌ సలహాదారు పీటర్‌ నవారో తెలిపారు. ఇరువురు నేతల మధ్య మంచి సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో ఇతరులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌పై రష్యా దాడి ప్రారంభమైన తర్వాత భారత్‌.. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను భారీగా పెంచిందని నవారో తెలిపారు. యుద్ధానికి ముందు రష్యా చమురు వ్యాపారంలో భారత్‌ పెద్దగా భాగస్వామిగా లేదని చెప్పారు. అయితే యుద్ధం తర్వాత రష్యా నుంచి భారత్‌ కొనుగోలు చేస్తున్న చమురు పరిమాణం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.

వివరాలు 

రష్యాకు పరోక్షంగా ప్రయోజనం

రష్యా నుంచి కొనుగోలు చేసిన చమురు ఉత్పత్తులను భారత్‌ విక్రయించడం ద్వారా రష్యాకు పరోక్షంగా ప్రయోజనం కలుగుతోందని తాను గతంలో వ్యాఖ్యానించిన విషయాన్ని నవారో గుర్తుచేశారు.

అయితే ఆ వ్యాఖ్యలపై భారత్‌లో సామాజిక మాధ్యమాల వేదికగా తనపై తీవ్ర విమర్శలు వచ్చాయని తెలిపారు.

ఇలాంటి స్పందనలు సమస్యలను పరిష్కరించడానికి ఏమాత్రం ఉపయోగపడవని ఆయన అభిప్రాయపడ్డారు.

వివరాలు 

100 శాతం వరకు సుంకాల ప్రతిపాదన

రష్యా నుంచి చమురు, సహజవాయువు కొనుగోలు చేసే దేశాలపై భారీ సుంకాలు విధించేలా అమెరికాలో సెనేటర్‌ లిండ్సే గ్రాహమ్‌ బిల్లును ప్రతిపాదించారు.

ఈ బిల్లుకు ఆమోదం లభిస్తే.. రష్యా నుంచి ఇంధనం కొనుగోలు చేసే దేశాల ఉత్పత్తులపై 100 శాతం వరకు సుంకం విధించే అధికారం ట్రంప్‌కు లభించే అవకాశం ఉంది.

రష్యా నుంచి భారత్‌ పెద్దఎత్తున ముడిచమురు కొనుగోలు చేస్తున్న నేపథ్యంలో ఈ ప్రతిపాదనపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.

ఈ పరిణామాలు భారత్‌-అమెరికా వాణిజ్య సంబంధాలపై ప్రభావం చూపుతాయనే చర్చ జరుగుతోంది.

అయితే మోదీ, ట్రంప్‌ నేరుగా చర్చించుకోవడం ద్వారా ఈ వివాదానికి పరిష్కారం లభిస్తుందని పీటర్‌ నవారో విశ్వాసం వ్యక్తం చేశారు.

ADVERTISEMENT