LOADING...
Iran: చమురు ఉత్పత్తి లేకుండా చేస్తాం.. గల్ఫ్ దేశాలకు ఇరాన్‌ హెచ్చరిక
చమురు ఉత్పత్తి లేకుండా చేస్తాం.. గల్ఫ్ దేశాలకు ఇరాన్‌ హెచ్చరిక

Iran: చమురు ఉత్పత్తి లేకుండా చేస్తాం.. గల్ఫ్ దేశాలకు ఇరాన్‌ హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 22, 2026
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం ఇరాన్‌తో శాంతి చర్చలు జరిపేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. యుద్ధాన్ని ప్రారంభించిన ఆయన, ఎలాగైనా దాన్ని ముగించాలనే దిశగా చర్యలు వేగవంతం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరాన్ మరోసారి కాల్పుల విరమణను పొడిగిస్తూ ప్రకటన చేసింది. ఇరాన్‌తో సమగ్ర ఒప్పందం కుదిరే వరకు ఈ విరమణ కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇదే సమయంలో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ గల్ఫ్ దేశాలకు మరోసారి కఠిన హెచ్చరిక జారీ చేసింది. తమపై దాడులకు అమెరికాకు సహకరిస్తే, ఆయా దేశాల్లో చమురు ఉత్పత్తిని పూర్తిగా అడ్డుకుంటామని హెచ్చరించింది. ఇరాన్-అమెరికా మధ్య యుద్ధం ప్రారంభమై దాదాపు యాభై రోజులు గడిచాయి.

వివరాలు 

కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తున్న రెండు దేశాలు

ప్రస్తుతం రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని పాటిస్తున్నాయి. అయితే ఈ యుద్ధ ప్రభావం గల్ఫ్ దేశాలపై తీవ్రంగా పడింది. అమెరికా వైమానిక స్థావరాలకు సహకరిస్తున్నారనే ఆరోపణలతో ఇరాన్ ఆ దేశాలపై దాడులు చేసింది. ఇప్పటికీ విరమణ కొనసాగుతున్నా, అమెరికా గల్ఫ్ దేశాల్లో తన స్థావరాలను మరింత బలపరచే అవకాశముందని ఇరాన్ అనుమానిస్తోంది. దీంతో ఆ దేశాలకు నేరుగా హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ విప్లవ రక్షక దళాల ప్రకటనలో, తమ దేశంపై దాడులకు శత్రువులకు సహకరిస్తూ భూభాగం, వసతులు అందిస్తే దక్షిణ పొరుగు దేశాలు చమురు ఉత్పత్తికి వీడ్కోలు చెప్పాల్సి వస్తుందని స్పష్టం చేశారు.

వివరాలు 

గల్ఫ్ దేశాల్లో ఆందోళన..

ఈ విషయాన్ని గగనతల దళాధికారి మజీద్ మౌసావి పేర్కొన్నట్లు ఇరాన్ మీడియా తెలిపింది. ఇప్పటి వరకు జరిగిన యుద్ధంలో ఇరాన్ ప్రధానంగా గల్ఫ్ దేశాల్లోని చమురు కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుంది. సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, కువైట్, బహ్రెయిన్, ఖతార్ దేశాల్లోని చమురు నిల్వ కేంద్రాలు, శుద్ధి కేంద్రాలు, వాయు వసతులపై క్షిపణులు, మనవరహిత వైమానిక యంత్రాలతో దాడులు జరిపింది. ఈ నేపథ్యంలో మరోసారి హెచ్చరికలు వెలువరించడం గల్ఫ్ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది.

Advertisement