Trump: హోర్ముజ్లో అమెరికా రహస్య ఆపరేషన్.. 10 కోట్ల బ్యారెళ్ల చమురు తరలింపు!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలన ప్రకటన చేశారు. ఇరాన్తో ఉద్రిక్త పరిస్థితుల మధ్య హోర్ముజ్ జలసంధి గుండా 10 కోట్లకు పైగా బ్యారెళ్ల చమురును సురక్షితంగా తరలించేందుకు అమెరికా సైన్యం రహస్యంగా భారీ ఆపరేషన్ నిర్వహించిందని ఆయన వెల్లడించారు. వందలాది వాణిజ్య నౌకలకు అమెరికా సైన్యం సహకరించిందని, దీంతో ప్రపంచ ఇంధన సరఫరాకు అంతరాయం కలగకుండా చూసిందని తెలిపారు. బుధవారం ట్రూత్ సోషల్లో చేసిన పోస్టులో ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. "ఈ అద్భుత విజయానికి కారణం హోర్ముజ్ జలసంధిపై అమెరికా ఆధిపత్యం ఉండటమే. ఇరాన్ కాదు. వారి సైనిక శక్తి దెబ్బతింది.. ఆర్థిక వ్యవస్థ కూడా కుదేలైంది" అని పేర్కొన్నారు.
వివరాలు
బ్యారెల్ చమురు ధర 90డాలర్లు
అంతకుముందు వైట్ హౌస్లో మీడియాతో మాట్లాడిన ట్రంప్,ఈ రహస్య ఆపరేషన్ వల్ల అంతర్జాతీయ చమురు ధరలు భారీగా పెరగకుండా అడ్డుకోగలిగామని చెప్పారు. ప్రస్తుతం బ్యారెల్ చమురు ధర 90డాలర్ల వద్ద ఉండగా,ఈ చర్యలు లేకపోతే అది 200డాలర్లకు పైగా వెళ్లేదని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రపంచంలో అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గాల్లో హోర్ముజ్ జలసంధి ఒకటి. అమెరికా,ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై దాడులు ప్రారంభించక ముందు రోజుకు దాదాపు 2 కోట్ల బ్యారెళ్ల చమురు,పెట్రోలియం ఉత్పత్తులు ఈ మార్గం గుండా రవాణా అయ్యేవి. ఇది ప్రపంచ మొత్తం సరఫరాలో సుమారు 20శాతం. అయితే, దాడులకు ప్రతిగా ఇరాన్ నౌకలపై దాడులు చేయడం,సముద్రంలో మైన్లు ఏర్పాటు చేయడంతో ఈ మార్గంలో నౌకల రాకపోకలు గణనీయంగా తగ్గిపోయాయి.
వివరాలు
చరిత్రలోనే అతిపెద్ద సరఫరా అంతరాయం
దీంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ప్రభావం పడింది. ఆర్బీసీ క్యాపిటల్ మార్కెట్స్కు చెందిన కమోడిటీ వ్యూహ నిపుణురాలు హెలిమా క్రాఫ్ట్ మాట్లాడుతూ, ప్రస్తుతం హోర్ముజ్ జలసంధి గుండా రవాణా ఇంకా యుద్ధానికి ముందు స్థాయికి చేరుకోలేదని తెలిపారు. ప్రతి రోజూ ప్రపంచం గణనీయమైన పరిమాణంలో చమురు సరఫరాను కోల్పోతోందని ఆమె పేర్కొన్నారు. సీఎన్బీసీ పేర్కొన్న అంచనాల ప్రకారం, ఈ అంతరాయాల కారణంగా ఇప్పటివరకు 100 కోట్ల బ్యారెళ్లకు పైగా చమురు సరఫరా ప్రభావితమైందని, ఇది చరిత్రలోనే అతిపెద్ద సరఫరా అంతరాయంగా భావిస్తున్నారు.
వివరాలు
రోజుకు సుమారు 20 లక్షల బ్యారెళ్ల చమురు
మరోవైపు, జేపీ మోర్గాన్ విశ్లేషకులు ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. బహిరంగంగా కనిపిస్తున్న నౌకల కంటే ఎక్కువ మొత్తంలో చమురు రహస్యంగా తరలిపోతోందని అంచనా వేశారు. ట్రాన్స్పాండర్లను ఆఫ్ చేసి ప్రయాణించే ట్యాంకర్ల ద్వారా రోజుకు సుమారు 20 లక్షల బ్యారెళ్ల చమురు ఈ ప్రాంతం నుంచి బయటకు వెళ్తున్నట్లు వారు పేర్కొన్నారు. ఈ ఏడాది మేలో ట్రంప్ "ప్రాజెక్ట్ ఫ్రీడమ్" పేరుతో పర్షియన్ గల్ఫ్లో చిక్కుకుపోయిన చమురు ట్యాంకర్లకు భద్రత కల్పించే కార్యక్రమాన్ని ప్రకటించారు. అధికారికంగా ఆ కార్యక్రమాన్ని నిలిపివేసినా, అమెరికా సైన్యం ఇప్పటికీ నౌకలకు పరోక్ష సహాయం అందిస్తోందని అధికారులు సంకేతాలు ఇచ్చారు.
వివరాలు
వాణిజ్య నౌకలను రక్షించడమే తమ లక్ష్యం
అయితే,అమెరికా రక్షణ శాఖ అధికారి ఒకరు సీఎన్బీసీకి మాట్లాడుతూ,హోర్ముజ్ జలసంధి గుండా నౌకలకు ప్రత్యక్షంగా సైనిక ఎస్కార్ట్ ఇవ్వడం లేదని స్పష్టం చేశారు. బదులుగా, సురక్షితంగా ప్రయాణించేందుకు అవసరమైన సమాచారాన్ని అందిస్తూ సమన్వయం చేస్తున్నామని తెలిపారు. అమెరికా సెంట్రల్ కమాండ్ కూడా వాణిజ్య నౌకలను రక్షించడమే తమ లక్ష్యమని గతంలో వెల్లడించింది. ప్రాంతీయ జలాల్లో ప్రయాణిస్తున్న పౌర నౌకలపై ఇరాన్ డ్రోన్లను ప్రయోగించడంతోనే తాజా ఘర్షణలు ప్రారంభమయ్యాయని పేర్కొంది.
వివరాలు
భారీ పర్యావరణ విపత్తు సంభవించే అవకాశం
అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రుబియో కూడా ఇటీవల కాంగ్రెస్ సభ్యులకు ఇదే విషయాన్ని వివరించారు. ఇరాన్ డ్రోన్లు లక్ష్యాన్ని ఖచ్చితంగా ఛేదించే సామర్థ్యం లేకపోవడంతో ఏ వాణిజ్య నౌకనైనా తాకే ప్రమాదం ఉందని, దీంతో భారీ పర్యావరణ విపత్తు సంభవించే అవకాశం ఉందని హెచ్చరించారు. "వారు నౌకలపై దాడి చేయకపోతే మేము కాల్పులు జరపం. కానీ దాడులు జరిగితే ప్రతిస్పందించాల్సిన పరిస్థితి ఉంటుంది" అని రుబియో స్పష్టం చేశారు.