Iran: 800 ఉరిశిక్షలు తానే ఆపానన్న ట్రంప్.. ఖండించిన ఇరాన్!
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ న్యాయవ్యవస్థ తీవ్రంగా స్పందించింది. తన జోక్యంతోనే ఇరాన్లో 800 మందికిపైగా నిరసనకారుల ఉరిశిక్షలు ఆగిపోయాయని ట్రంప్ చెప్పడం పూర్తిగా అవాస్తవమని ఇరాన్ టాప్ ప్రాసిక్యూటర్ మొహమ్మద్ మొవాహెది స్పష్టం చేశారు. అలాంటి నిర్ణయమే తమ ప్రభుత్వం ఎప్పుడూ తీసుకోలేదని ఆయన తేల్చిచెప్పారు. నిరసనకారులకు సామూహికంగా మరణశిక్షలు విధించాలన్న ప్రతిపాదన అసలు లేదని మొహమ్మద్ మొవాహెది పేర్కొన్నారు. ఇప్పటివరకు ఎవరికీ ఉరిశిక్షలు అమలు చేయలేదని, అరెస్టు చేసిన వారి సంఖ్య కూడా ట్రంప్ చెబుతున్నంత ఎక్కువగా లేదని తెలిపారు. ఈ అంశంపై తప్పుడు వార్తలు, తప్పుదోవ పట్టించే ప్రకటనలు ప్రచారం చేయవద్దని అంతర్జాతీయ మీడియాను ఆయన కోరారు.
Details
ఒత్తిడి కారణంగానే అధికారులు రద్దు చేశారు
గురువారం మీడియాతో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్.. ఇరాన్లో వందల మంది నిరసనకారులకు విధించనున్న ఉరిశిక్షలను అమెరికా ఒత్తిడి కారణంగానే అక్కడి అధికారులు రద్దు చేశారని వ్యాఖ్యానించారు. తాను జోక్యం చేసుకోకపోయి ఉంటే 800 మందికిపైగా ప్రాణాలు కోల్పోయేవని, వారి మరణశిక్షలను తానే ఆపానని ట్రంప్ అన్నారు. కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించడంతోనే ఇరాన్ పాలకవర్గం వెనక్కి తగ్గిందని కూడా ఆయన పేర్కొన్నారు. ట్రంప్ వ్యాఖ్యలను ఇరాన్ న్యాయవ్యవస్థ ఖండించడంతో ఈ అంశం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది.