Loading...
Iran War: అమెరికా ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల నిల్వలు క్షీణిస్తున్నాయా?.. ట్రంప్‌లో పెరుగుతున్న ఆందోళన
అమెరికా ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల నిల్వలు క్షీణిస్తున్నాయా?.. ట్రంప్‌లో పెరుగుతున్న ఆందోళన

Iran War: అమెరికా ఎయిర్ డిఫెన్స్ క్షిపణుల నిల్వలు క్షీణిస్తున్నాయా?.. ట్రంప్‌లో పెరుగుతున్న ఆందోళన

వ్రాసిన వారు Moogati Shabari
Jul 26, 2026
01:35 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఇరాన్‌పై సైనిక చర్యలను మరింత విస్తరించే విషయంలో అమెరికా ప్రస్తుతం కొంత వెనక్కి తగ్గినట్లు అంతర్జాతీయ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఉన్న ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలకు అవసరమైన క్షిపణుల నిల్వలు తగ్గుముఖం పడుతున్నాయనే ఆందోళనలే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో ఇరాన్‌పై దాడులను తీవ్రతరం చేసే ప్రణాళికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేసినట్లు సమాచారం. సీనియర్ భద్రతా, సైనిక సలహాదారులతో జరిగిన కీలక సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అమెరికా దళాలు, విదేశీ సైనిక స్థావరాల రక్షణ కోసం యుద్ధ చర్యలు కొనసాగితే క్షిపణుల నిల్వలు వేగంగా తగ్గిపోయే ప్రమాదం ఉందని సైనికాధికారులు హెచ్చరించినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

వివరాలు

అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడులు..

ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధంలో ఇరాన్ తక్కువ ఖర్చుతో తయారయ్యే డ్రోన్లను భారీ సంఖ్యలో వినియోగిస్తోంది.

ఒక్కో డ్రోన్ ధర సుమారు 20 వేల నుంచి 50 వేల డాలర్ల మధ్య మాత్రమే ఉండగా, వాటిని కూల్చివేయడానికి అమెరికా ఉపయోగిస్తున్న ఒక్కో ఇంటర్‌సెప్టర్ క్షిపణి ధర 1.5 మిలియన్ డాలర్లకు పైగానే ఉంటోంది.

ఈ భారీ వ్యయ వ్యత్యాసం దీర్ఘకాలిక యుద్ధంలో అమెరికాపై ఆర్థికపరమైన ఒత్తిడిని పెంచే అవకాశముందని రక్షణ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఇదిలా ఉండగా, గల్ఫ్ ప్రాంతంలోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ దాడుల తీవ్రత పెరగడంతో పలు స్థావరాలు నష్టపోయినట్లు సమాచారం.

వివరాలు

ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు మరింత క్షీణించే ప్రమాదం..

వాటి రక్షణ కోసం అమెరికా పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్‌సెప్టర్ క్షిపణులతో పాటు ఇతర రక్షణ ఆయుధాలను కూడా పెద్ద ఎత్తున వినియోగించింది.

దీంతో ఆయుధాల నిల్వలు గణనీయంగా తగ్గిపోయినట్లు తెలుస్తోంది.

ఇదే పరిస్థితి కొనసాగితే పశ్చిమాసియా ప్రాంతంలో కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న యూఎస్ సెంట్రల్ కమాండ్‌కు అందుబాటులో ఉన్న ఇంటర్‌సెప్టర్ క్షిపణుల నిల్వలు మరింత క్షీణించే ప్రమాదం ఉందని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్ హెచ్చరించినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది.

ADVERTISEMENT

వివరాలు

యుద్ధానికి ముగింపు పలికే ప్రయత్నం..

ఇక తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ స్టీవెన్ చెంగ్ స్పందిస్తూ, యుద్ధాన్ని దీర్ఘకాలం కొనసాగించడం కంటే దౌత్యపరమైన పరిష్కారానికే అధ్యక్షుడు ట్రంప్ ప్రాధాన్యం ఇస్తారని వెల్లడించారు.

అయితే గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు కొనసాగితే అమెరికా పరిస్థితులకు అనుగుణంగా తగిన చర్యలు తీసుకోవడంలో వెనుకాడదని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో యుద్ధానికి ముగింపు పలికే ప్రయత్నాల్లో భాగంగా మధ్యవర్తిత్వం వహించాలని ఖతార్, పాకిస్థాన్ దేశాలను అమెరికా అధ్యక్షుడు ట్రంప్ శనివారం కోరినట్లు సమాచారం.

ADVERTISEMENT