LOADING...
Trump: ఇరాన్‌పై దాడులకు అమెరికా హెచ్చరికలు.. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత
ఇరాన్‌పై దాడులకు అమెరికా హెచ్చరికలు.. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత

Trump: ఇరాన్‌పై దాడులకు అమెరికా హెచ్చరికలు.. పశ్చిమాసియాలో పెరుగుతున్న ఉద్రిక్తత

వ్రాసిన వారు Sirish Praharaju
May 20, 2026
08:47 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం మరింత ఉద్రిక్తంగా మారుతోంది. ఇరాన్‌కు సంబంధించిన అంశంలో కీలక పరిణామాలు వేగంగా చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం తెరవెనక సాగుతున్న చర్చలు ఫలించకపోతే రెండు నుంచి మూడు రోజుల్లోనే, లేదంటే వచ్చే వారం ప్రారంభంలో ఇరాన్‌పై భారీ దాడులు ప్రారంభిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్‌తో తీవ్రస్థాయిలో చర్చలు కొనసాగుతున్నాయని, అవి సానుకూల ఫలితాన్నిస్తాయని ఆశిస్తున్నట్లు ఆయన తెలిపారు. టెహ్రాన్‌కు అణ్వాయుధాలు దక్కకుండా ఉండేలా ఒప్పందం కుదిరితే అమెరికా అంగీకరిస్తుందని పేర్కొన్నారు.

వివరాలు 

అరబ్ దేశాల నాయకుల విజ్ఞప్తితో యుద్ధంకి బ్రేక్ 

శ్వేతసౌధంలో విలేకరులతో మాట్లాడిన ట్రంప్.. ఒకవేళ చర్చలు విఫలమైతే ఇరాన్‌పై వెంటనే భారీ దాడులు చేపట్టేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చినట్లు వెల్లడించారు. మంగళవారం నుంచే దాడులు ప్రారంభించాలని భావించినప్పటికీ, అరబ్ దేశాల నాయకుల విజ్ఞప్తితో ఆ నిర్ణయాన్ని చివరి నిమిషంలో తాత్కాలికంగా నిలిపివేసినట్లు చెప్పారు. చర్చలు గంభీరంగా సాగుతున్నందున అందరికీ ఆమోదయోగ్యమైన ఒప్పందం కుదిరే అవకాశం కనిపిస్తోందని, అందుకే ప్రస్తుతానికి దాడి నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నామని వివరించారు.

వివరాలు 

మమ్మల్ని ఓడించడం ఎవరికీ సాధ్యం కాదు: ఇరాన్

అమెరికా, ఇజ్రాయెల్ మరోసారి దాడులకు దిగితే తాము కొత్త ఆయుధాలు, కొత్త వ్యూహాలతో ప్రతిస్పందిస్తామని ఇరాన్ హెచ్చరించింది. తమ దేశాన్ని దిగ్బంధించడం లేదా ఓడించడం ఎవరికీ సాధ్యం కాదని స్పష్టం చేసింది. టెహ్రాన్‌లోని వాలియాస్ స్క్వేర్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ఆ దేశ సైన్యాధికారి బ్రిగేడియర్ జనరల్ మహమ్మద్ అక్రమీనియా ఈ వ్యాఖ్యలు చేశారు. గతంతో పోలిస్తే తమ సాయుధ దళాలు ఇప్పుడు మరింత బలంగా, అత్యంత అప్రమత్తంగా ఉన్నాయని చెప్పారు. సైన్యం ఎప్పుడైనా చర్యలకు సిద్ధంగా ఉందని హెచ్చరించారు.

Advertisement

వివరాలు 

ట్రంప్, నెతన్యాహులను హతమారిస్తే రూ.560 కోట్లు!

అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌,ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును హతమారిస్తే భారీ నగదు బహుమతి ప్రకటించే దిశగా ఇరాన్ అడుగులు వేస్తున్నట్లు సమాచారం. సుమారు 58 మిలియన్ డాలర్లు,అంటే దాదాపు రూ.560 కోట్ల బహుమతి ఇవ్వాలని ప్రతిపాదిస్తూ ఒక బిల్లును సిద్ధం చేస్తున్నట్లు ఇరాన్ జాతీయ భద్రతా మండలి అధ్యక్షుడు ఇబ్రహీమ్ అజీజ్ తెలిపారు. 'ఇస్లామిక్ రిపబ్లిక్ భద్రతా దళాల ప్రతిచర్య'పేరుతో రూపొందించిన ఈ బిల్లుపై త్వరలో పార్లమెంటులో ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉందన్నారు. ఇదిలా ఉండగా,తమ దేశంలోని బరకాహ్ అణు విద్యుత్ కేంద్రంపై ఇటీవల జరిగిన డ్రోన్ దాడులకు సంబంధించిన వివరాలను యూఏఈ రక్షణ శాఖ వెల్లడించింది. ఆ డ్రోన్లు ఇరాక్ భూభాగం నుంచి వచ్చినట్లు గుర్తించినట్లు తెలిపింది.

Advertisement

వివరాలు 

యుద్ధంతో జీవ వైవిధ్యానికి దెబ్బ

ఇరాన్ మద్దతుతో పనిచేస్తున్న షియా మిలీషియా వర్గాలే వాటిని ప్రయోగించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన దాడులు పర్యావరణంపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా జీవ వైవిధ్యానికి ముప్పు పెరుగుతోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇరాన్‌లోని ఒక చమురు శుద్ధి కేంద్రంపై జరిగిన దాడి కారణంగా సముద్రంలోకి చమురు భారీగా చేరింది. అలలతో ఆ చమురు పర్షియన్ గల్ఫ్‌లో ఉన్న శిద్వార్ దీవికి చేరినట్లు సమాచారం. జనావాసాలు లేని ఈ దీవిలో అనేక అడవి జీవులు నివసిస్తున్నాయి. చమురు వ్యాప్తితో వాటి జీవన వ్యవస్థకు తీవ్ర ప్రమాదం ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తమవుతోంది.

Advertisement