Trump: ఇరాన్పై రెండు మూడు వారాల్లో భారీ దాడులు.. ట్రంప్ కీలక ప్రకటన
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధ పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండు నుంచి మూడు వారాల్లో ఇరాన్పై మరింత తీవ్ర స్థాయి దాడులు చేపడతామని ఆయన స్పష్టం చేశారు. ఇప్పటికే ఇరాన్ కీలక నాయకత్వాన్ని బలహీనపరిచామని, వారి నౌకాదళం,వైమానిక దళాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని వెల్లడించారు. ఇరాన్ తప్పనిసరిగా అమెరికాతో ఒప్పందానికి రావాలని ట్రంప్ హెచ్చరించారు. లేదంటే ఆ దేశాన్ని పూర్తిగా వెనక్కి నెట్టే స్థాయిలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. ప్రస్తుతం కొనసాగుతున్న'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' కింద అన్ని లక్ష్యాలను సాధించే దిశగా అమెరికా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు. ఈ యుద్ధంలో ఇరాన్ భారీ నష్టాన్ని చవిచూసిందని, వారి సైనిక శక్తి దాదాపు కూలిపోయిందని తెలిపారు.
వివరాలు
అమెరికా భద్రతను కాపాడటమే 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' లక్ష్యం
ఇరాన్కు అణ్వాయుధాలు ఉండే అవకాశాన్ని పూర్తిగా అడ్డుకుంటామని ట్రంప్ మరోసారి స్పష్టం చేశారు. ఇప్పటివరకు ఇరాన్ చమురు వనరులను లక్ష్యంగా చేసుకోలేదని, కానీ అవసరమైతే ఆ చర్యకూ వెనుకాడబోమని హెచ్చరించారు. అమెరికా భద్రతను కాపాడటమే 'ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ' లక్ష్యమని ఆయన అన్నారు. అలాగే, అమెరికాను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఇరాన్ చర్యలు తీసుకుంటోందని ఆరోపించారు. ఈ సందర్భంగా యుద్ధం ఎక్కువ కాలం కొనసాగదని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. అమెరికా తన ముఖ్య లక్ష్యాలను సాధించిందని, త్వరలోనే ఈ పోరు ముగుస్తుందని పేర్కొన్నారు. యుద్ధ ప్రభావంతో పెరిగిన ఇంధన ధరలు తాత్కాలికమని కూడా ఆయన తెలిపారు.
వివరాలు
హర్మూజ్ అవసరం లేదు..
ఇంధన రవాణాలో కీలక పాత్ర పోషించే Strait of Hormuz గురించి కూడా ట్రంప్ మాట్లాడారు. ఆ మార్గం ద్వారా వచ్చే చమురుపై అమెరికా ఆధారపడటం లేదని, భవిష్యత్తులో కూడా అవసరం ఉండదని చెప్పారు. దీనిపై ఆధారపడే దేశాలే తమ భద్రతను చూసుకోవాలని సూచించారు. ఇరాన్ ప్రతీకార దాడులతో ఒత్తిడిని ఎదుర్కొంటున్న గల్ఫ్ దేశాలకు అమెరికా పూర్తి మద్దతు ఇస్తుందని ట్రంప్ హామీ ఇచ్చారు. తమ మిత్రదేశాలకు ఎలాంటి నష్టం జరగకుండా రక్షణ కల్పిస్తామని స్పష్టం చేశారు.