Page Loader
Trump warns Russia: అదే జరిగితే మాస్కో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలి .. కాల్పుల విరమణపై రష్యాకు ట్రంప్‌ వార్నింగ్‌
కాల్పుల విరమణపై రష్యాకు ట్రంప్‌ వార్నింగ్‌

Trump warns Russia: అదే జరిగితే మాస్కో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాలి .. కాల్పుల విరమణపై రష్యాకు ట్రంప్‌ వార్నింగ్‌

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 13, 2025
10:42 am

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమ రష్యాలోని కర్క్స్‌ ప్రాంతాన్ని బుధవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ సందర్శించారు. ఉక్రెయిన్‌ దళాలు ఈ ప్రాంతంలోని కొంతభూభాగాన్ని స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో, ఈ పర్యటనకు విశేష ప్రాధాన్యం ఏర్పడింది. రష్యా దళాల కేంద్రాన్ని సందర్శించిన పుతిన్‌ కర్క్స్‌లోని రష్యా దళాల నియంత్రణ కేంద్రానికి పుతిన్‌ వెళ్లారు. ఆయన మిలిటరీ దుస్తుల్లో ఉన్న దృశ్యాలను మీడియాలో ప్రసారం చేశారు. యుద్ధ భూమిలోని పరిస్థితులను రష్యన్‌ జనరల్‌ స్టాఫ్‌ హెడ్‌ వలెరీ జెరసిమోవ్‌ పుతిన్‌కు వివరించారు. కొంతమంది ఉక్రెయిన్‌ సైనికులు లొంగిపోయినట్టు ఆయన తెలియజేశారు. ఈ ప్రాంతం నుంచి కీవ్‌ దళాలను తక్షణమే వెనక్కి తరిమికొట్టాలని పుతిన్‌ ఆదేశించినట్లు మీడియా నివేదికలు వెల్లడించాయి.

వివరాలు 

అడ్డుకుంటే రష్యాకే నష్టం: ట్రంప్‌ 

యుద్ధంలో 30 రోజుల కాల్పుల విరమణ ప్రతిపాదనను ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ అంగీకరించిన విషయం తెలిసిందే. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు అమెరికా ప్రతినిధులు రష్యాకు బయలుదేరారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ వద్ద జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. "మా ప్రతినిధులు రష్యాకు వెళ్ళారు. కాల్పుల విరమణకు పుతిన్‌ అంగీకరిస్తారని ఆశిస్తున్నాం. లేకపోతే యుద్ధం కొనసాగుతుంది. అది మాస్కోకు తీవ్ర ఆర్థిక నష్టం కలిగించే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితి రావడం నాకు ఇష్టమేమీ కాదు. నా లక్ష్యం శాంతిని స్థాపించడమే" అని ట్రంప్‌ వ్యాఖ్యానించారు.

వివరాలు 

జెడ్డా వేదికగా అమెరికా-ఉక్రెయిన్‌ చర్చలు 

ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పే లక్ష్యంతో సౌదీ అరేబియాలోని జెడ్డా వేదికగా అమెరికా మంత్రులు, అధికారులు, అలాగే ఉక్రెయిన్‌ ప్రతినిధుల మధ్య చర్చలు జరిగాయి. ఈ సమావేశంలో అమెరికా ప్రతిపాదించిన 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉక్రెయిన్‌ అంగీకరించింది. ఈ మేరకు ఇరుపక్షాలు ఉమ్మడిగా ప్రకటన విడుదల చేశాయి. సైనిక సహాయం, నిఘా భాగస్వామ్యానికి సంబంధించి తక్షణమే ఉక్రెయిన్‌పై విధించిన ఆంక్షలను ఎత్తివేస్తున్నట్లు అమెరికా ప్రకటించింది.