
US: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. అగ్నిమాపక సిబ్బందిపై కాల్పులు.. ఇద్దరు మృతి
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికాలోని వాయవ్య రాష్ట్రం ఇడాహోలో దారుణ ఘటన చోటుచేసుకుంది. అగ్నిమాపక చర్యలలో పాల్గొన్న సిబ్బందిపై గుర్తు తెలియని దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో ఇద్దరు అగ్నిమాపక సిబ్బంది అక్కడికక్కడే మరణించారు. అధికారిక సమాచారం ప్రకారం,కూటేనై కౌంటీలోని పర్వత ప్రాంతంలోని ఒక పార్క్లో భారీగా మంటలు అంటుకున్నట్లు సమాచారం అందడంతో అగ్నిమాపక బృందాలు వెంటనే అక్కడికి చేరుకున్నాయి. సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నాల్లో ఉన్న సమయంలో,దుండగుడు అధిక శక్తి సామర్థ్యం గల రైఫిల్స్తో వారికి పైపైగా కాల్పులు జరిపాడు. ఈఆకస్మిక దాడిలో అప్రమత్తమయ్యేలోపు ఇద్దరు సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇంకా మంటలు పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో అగ్నిమాపక సిబ్బంది తమ చర్యలను కొనసాగిస్తుండగా,పోలీసు విభాగాలు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి.
వివరాలు
దుండగుడితో పోలీసులకు ఎదురుకాల్పులు
దుండగుడితో పోలీసులకు ఎదురుకాల్పులు జరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. అతను ఇంకా లొంగిపోవడానికి సిద్ధంగా లేదని స్పష్టం చేశారు. ఆ ప్రాంతంలో పౌరులు కూడా ఉండటంతో మరణాల సంఖ్య పెరిగే అవకాశాన్ని కూడా ఖండించలేమని వారు పేర్కొన్నారు. నిందితుడిని కనిపించిన చోటే కాల్చివేయాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఒకదాని తర్వాత ఒకటిగా వస్తున్న కాల్పుల శబ్దాల వల్ల ఈ దాడిలో ఒక్క వ్యక్తి మాత్రమే పాల్గొన్నాడా? లేక మరెవరైనా ఉన్నారా? అనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ దుర్మార్గ ఘటనపై స్పందించిన ఎఫ్బీఐ డిప్యూటీ డైరెక్టర్ డాన్ బోంగినో మాట్లాడుతూ.. నిందితులను పట్టుకోవడంతో పాటు మంటలను ఆర్పేందుకు పెద్ద సంఖ్యలో భద్రతా బలగాలను ఆ ప్రాంతానికి పంపిస్తున్నట్లు తెలిపారు.
వివరాలు
ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని హెచ్చరికలు
ఇడాహోలోని ప్రజలు తమ ఇళ్లలోనే ఉండాలని, బయటకు రావద్దని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. ఏవైనా అనుమానాస్పద వ్యక్తులను గమనిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరింది. ఇడాహో గవర్నర్ బ్రాడ్ లిటిల్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి ఘోర చర్యలకు పాల్పడినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.