LOADING...
Germany: జర్మనీలో జనంపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు
జర్మనీలో జనంపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

Germany: జర్మనీలో జనంపైకి దూసుకెళ్లిన కారు.. ఇద్దరు మృతి, పలువురికి గాయాలు

వ్రాసిన వారు Sirish Praharaju
May 05, 2026
09:47 am

ఈ వార్తాకథనం ఏంటి

జర్మనీ దేశంలోని లైప్‌జిగ్‌ నగరంలో సోమవారం మధ్యాహ్నం విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి కారు తో జనసమూహంపై దూసుకెళ్లడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం,ఈ ఘటనలో మొత్తం 22 మంది గాయపడగా,వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. నగర మేయర్ బుర్ఖార్డ్ జంగ్ వెల్లడించిన ప్రకారం, 33 ఏళ్ల జర్మన్ పౌరుడిని అనుమానితుడిగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, నగరంలోని గ్రిమ్మైష్ స్ట్రాసే ప్రాంతంలో కారు పలువురిని ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోయింది.

వివరాలు 

పోలీసుల అదుపులో డ్రైవర్ 

అగ్నిమాపక శాఖ అధికారి ఆక్సెల్ షూ ప్రకారం గాయపడిన వారిలో కొందరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సాక్సోని రాష్ట్ర ముఖ్యమంత్రి మైఖేల్ క్రెచ్‌మర్ మాట్లాడుతూ, నిందితుడు గతంలో మానసిక సమస్యలతో బాధపడినట్లు తెలిపారు. ఘటన సమయంలో భారీ శబ్దం వినిపించిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఒక మహిళ మాట్లాడుతూ, కారు చాలా వేగంగా వచ్చి జనాలను ఢీకొట్టిందని తెలిపారు. సంఘటన తరువాత గాయపడిన వారు రోడ్డుపై పడివున్న దృశ్యాలు కలచివేశాయి. కొందరు స్థానికులు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా, వెంటనే పోలీసులు చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

వివరాలు 

జర్మనీలో పెరుగుతున్న కారు దాడులు

ఈ ఘటనలో మృతి చెందిన వారిలో 63 ఏళ్ల మహిళ, 77 ఏళ్ల వ్యక్తి ఉన్నట్లు అధికారులు తెలిపారు. హత్య, హత్యాయత్నం కేసుల కింద విచారణ కొనసాగుతోందని, ఈ ఘటనకు మత లేదా రాజకీయ కారణాలు ఉన్నట్టు ప్రస్తుతానికి ఎలాంటి ఆధారాలు లేవని అధికారులు స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో జర్మనీలో ఇలాంటి కారు దాడులు పెరుగుతున్నాయి. 2024 డిసెంబరులో మాగ్డెబర్గ్ నగరంలో జరిగిన క్రిస్మస్ మార్కెట్ దాడిలో ఆరుగురు మృతి చెందగా, వందలాది మంది గాయపడ్డారు. అలాగే గత ఏడాది మ్యూనిక్‌లో జరిగిన ఘటనలో కూడా పలువురు గాయపడ్డారు.

Advertisement