UAE: యూఏఈ కీలక నిర్ణయం..ఇరాన్, లెబనాన్, ఇరాక్కు వెళ్లొద్దని సూచన
ఈ వార్తాకథనం ఏంటి
మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్, లెబనాన్, ఇరాక్ దేశాలకు తమ పౌరులు వెళ్లకుండా ప్రయాణ నిషేధాన్ని విధించినట్లు గురువారం ప్రకటించింది. ప్రస్తుతం ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయని, ముఖ్యంగా మధ్యప్రాచ్య ఘర్షణలకు సంబంధించిన పరిణామాలు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు యూఏఈ విదేశాంగ మంత్రిత్వ శాఖ (MoFA) తెలిపింది. విదేశాల్లో ఉన్న ఎమిరాటి పౌరుల భద్రత, సంక్షేమం కోసం ఈ పరిమితులు అవసరమని స్పష్టం చేసింది.
వివరాలు
ప్రమాద స్థాయి పెరిగినందుకే నిర్ణయం..
ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో, గల్ఫ్ ప్రాంతంలో పౌర ప్రాంతాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఇరాన్ క్షిపణి దాడులు జరిపినట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ప్రాంతంలో ప్రమాద స్థాయి పెరిగినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే తాత్కాలికంగా కాల్పుల విరమణ అమల్లో ఉన్నప్పటికీ పరిస్థితి ఇంకా సున్నితంగానే ఉందని పేర్కొన్నారు.
వివరాలు
భద్రతపై నిరంతరం నిఘా..
"ప్రస్తుత ప్రాంతీయ పరిణామాల దృష్ట్యా, యూఏఈ పౌరులు ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇరాన్, లెబనీస్ రిపబ్లిక్, రిపబ్లిక్ ఆఫ్ ఇరాక్ దేశాలకు ప్రయాణించకుండా నిషేధం విధిస్తున్నాము" అని వార్తా సంస్థ WAM వెల్లడించింది. ఇప్పటికే ఆ దేశాల్లో ఉన్న యూఏఈ పౌరులు వెంటనే స్వదేశానికి తిరిగి రావాలని విదేశాంగ శాఖ సూచించింది. విదేశాల్లో ఉన్న తమ పౌరుల భద్రతపై ప్రభుత్వం నిరంతరం నిఘా ఉంచుతుందని కూడా స్పష్టం చేసింది.