
H-1B Visa:లక్ష డాలర్ల హెచ్-1బీ వీసా ఫీజుపై కోర్టులో దావా..ట్రంప్ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేసిన యూఎస్ ఛాంబర్ ఆఫ్ కామర్స్
ఈ వార్తాకథనం ఏంటి
హెచ్-1బీ వీసా సంబంధిత అంశంలో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న ఓ ముఖ్య నిర్ణయం భారీ చర్చలకు కారణమైంది. హెచ్-1బీ వీసా దరఖాస్తు ఫీజును ఒక్కసారిగా లక్ష డాలర్లకు పెంచిన అంశాన్ని సవాల్ చేస్తూ, యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్ కోర్టును ఆశ్రయించింది. గురువారం వాషింగ్టన్లోని జిల్లా కోర్టులో చాంబర్ ఆఫ్ కామర్స్ ఈ ఫీజు నిర్ణయంపై ట్రంప్ ప్రభుత్వాన్ని ఫిర్యాదు చేసింది. ప్రభుత్వం ప్రతిపాదించిన ఫీజు పూర్తిగా చట్టవిరుద్ధంగా ఉంది. ఇది అమలవుతే అమెరికా కంపెనీలపై భారీ ఆర్థిక భారం పెరుగుతుందని చాంబర్ ఆఫ్ కామర్స్ తన పిటిషన్లో పేర్కొంది.
వివరాలు
అమెరికన్లకే ఉద్యోగాలంటూ ప్రభుత్వాన్ని సమర్థించిన ట్రంప్
"ఈ నిర్ణయం వల్ల కంపెనీలు తమ కార్మిక ఖర్చులను చాలా ఎక్కువగా చెల్లించాల్సి వస్తుంది, లేకపోతే అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగులను నియమించడం తగ్గించుకోవాల్సి ఉంటుంది" అని తెలిపారు. అంతేకాక, ఇది అమెరికా ఆర్థిక మార్కెట్లోని ప్రత్యర్థులకు లాభం కలిగించే ప్రమాదకర విధానమని చాంబర్ ఆఫ్ కామర్స్ అభిప్రాయపడింది. "ఈ ఫీజు కారణంగా అమెరికా కంపెనీలకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులను భర్తీ చేయడం ఖరీదైన పని అవుతుంది" అని చాంబర్ ఆఫ్ కామర్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ నీల్ బ్రాడ్లీ ఒక ప్రకటనలో చెప్పారు, మరోవైపు, ట్రంప్ ప్రభుత్వం ఈ నిర్ణయాన్నిగట్టిగా సమర్థిస్తోంది.అమెరికన్లకే ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశ్యంతోనే ఈ ఫీజు తీసుకువచ్చినట్లు ట్రంప్ గతంలో వెల్లడించారు.
వివరాలు
హెచ్-1బీ నిబంధనలపై ట్రంప్ సర్కారుకు ఇది రెండో పెద్ద న్యాయ సవాలు
ఈ విధానం వల్ల కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకోవడం తగ్గి, అమెరికన్ గ్రాడ్యుయేట్లకు శిక్షణ ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకోవడం జరుగుతుందని వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లుట్నిక్ వివరించారు. హెచ్-1బీ నిబంధనలపై ట్రంప్ సర్కారుకు ఇది రెండో పెద్ద న్యాయ సవాలుగా ఉంది. ఈ నెల 3న కొన్ని యూనియన్లు, విద్యాసంస్థలు కలిసీ కాలిఫోర్నియా కోర్టులో కూడా దావా వేశాయి. ఈ వివాదం వల్ల ఏర్పడిన గందరగోళం నేపథ్యంలో, వైట్హౌస్ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. లక్ష డాలర్ల ఫీజు కొత్తగా వీసా కోసం దరఖాస్తు చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుందని, ఇప్పటికే వీసా పొందినవారికి లేదా పునరుద్ధరణకు దీని ప్రభావం ఉండదని పేర్కొంది.
వివరాలు
నిర్ణయం అమలైతే కంపెనీలపై తీవ్ర ఆర్థిక భారం పడుతుందని ఆందోళన
2024 గణాంకాల ప్రకారం, మొత్తం హెచ్-1బీ వీసాలలో 70 శాతానికి పైగా భారతీయులే పొందినట్లు సమాచారం. ఈ పరిస్థితిలో, కొత్త ఫీజు నిబంధనలు భారతీయ నిపుణులపై గణనీయమైన ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.