US: భారత్ సహా 40 దేశాలపై అమెరికా ఆరోపణలు.. చైనా కోసం షాడో నెట్వర్క్?
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా విధిస్తున్న సుంకాలను తప్పించుకునేందుకు చైనాకు భారత్ సహకరిస్తోందని అగ్రరాజ్యం ఆరోపించింది. చైనా ఉత్పత్తులను ఇతర దేశాల మీదుగా అమెరికా మార్కెట్కు తరలించే 'షాడో నెట్వర్క్'లో భారత్ కూడా భాగమని పేర్కొంది. భారత్తో పాటు మొత్తం 40కి పైగా దేశాలు ఈ వ్యవస్థకు సహకరిస్తున్నాయని అమెరికా ఆరోపించింది.
వివరాలు
'ది గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్' పేరుతో నివేదిక
'ది గ్రేట్ ట్రాన్స్షిప్మెంట్ స్కామ్' పేరుతో అమెరికా ప్రభుత్వం విడుదల చేసిన నివేదికలో ఈ ఆరోపణలు చేసింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాణిజ్య సలహాదారు పీటర్ నవారో ఈ నివేదికను విడుదల చేశారు.
చైనా నుంచి నేరుగా అమెరికాకు సరుకులు పంపితే అధిక సుంకాలు చెల్లించాల్సి వస్తుండటంతో.. వాటిని ఇతర దేశాల మీదుగా పంపించి అసలు తయారీ దేశాన్ని దాచే విధానం పెరిగిందని నివేదిక పేర్కొంది.
2018 నుంచి పెరిగిన అక్రమ రవాణా
అన్యాయమైన వాణిజ్య విధానాలను అనుసరిస్తున్నాయని భావించిన దేశాలపై అమెరికా 'సెక్షన్ 301' కింద సుంకాలు విధిస్తుంది.
ఈ నిబంధన కింద 2018లో చైనాపై అమెరికా ఆంక్షలు, అదనపు సుంకాలు విధించింది.
వివరాలు
303 బిలియన్ డాలర్ల వరకు..
అప్పటి నుంచి చైనా ఉత్పత్తులను మూడో దేశాల మీదుగా అమెరికాకు పంపించే 'ట్రాన్స్షిప్మెంట్' కార్యకలాపాలు గణనీయంగా పెరిగాయని తాజా నివేదిక వెల్లడించింది.
చైనా ఉత్పత్తులను మూడో దేశాల మీదుగా తరలించే ఈ విధానం ద్వారా జరుగుతున్న వాణిజ్యం భారీ స్థాయిలో ఉందని అమెరికా పేర్కొంది.
వివిధ ప్రభుత్వ, ప్రైవేటు రంగ అంచనాలను ప్రస్తావించిన నివేదిక.. ఈ తరహా సరకు రవాణా విలువ ఏడాదికి సుమారు 34.2 బిలియన్ డాలర్ల నుంచి 303 బిలియన్ డాలర్ల వరకు ఉండొచ్చని అంచనా వేసింది.
అమెరికా వాదన ప్రకారం.. చైనా తన ఉత్పత్తులను భారత్, మెక్సికో, మలేషియా, వియత్నాం తదితర దేశాల మీదుగా తరలించడం ద్వారా అమెరికా సుంకాల నుంచి తప్పించుకునే అవకాశాన్ని పొందుతోంది.
వివరాలు
303 బిలియన్ డాలర్ల వరకు..
ఈ విధానం వల్ల చైనా నుంచి నేరుగా దిగుమతులు తగ్గినట్లు కనిపించినప్పటికీ.. చైనా తయారీ రంగం మాత్రం కొనసాగుతోందని అమెరికా పేర్కొంది.
పీటర్ నవారో మాట్లాడుతూ.. చైనా తన ఎగుమతులను 40కి పైగా దేశాల ద్వారా మళ్లిస్తోందని ఆరోపించారు.
భారత్ సహా పలు దేశాలు భవిష్యత్తులో అధిక అమెరికా సుంకాలను తప్పించుకునేందుకు ఇలాంటి ట్రాన్స్షిప్మెంట్ విధానాలను అనుసరించే అవకాశం ఉందని కూడా ఆయన హెచ్చరించారు.
వివరాలు
సుంకాల ఎగవేతను అడ్డుకునేందుకు ఏఐ
చైనా సహా ఇతర దేశాల నుంచి వచ్చే సరుకుల అసలు తయారీ ప్రదేశాన్ని గుర్తించేందుకు అమెరికా కస్టమ్స్ అధికారులు కృత్రిమ మేధ ఆధారిత వ్యవస్థను ఉపయోగించడం ప్రారంభించారు.
'డిటెక్టివ్ బోర్డర్'గా పిలుస్తున్న ఈ వ్యవస్థ సరుకుల మూలం, రవాణా మార్గాలు, వాటిలోని భాగాల వివరాలను పరిశీలించి అనుమానాస్పద వ్యత్యాసాలను గుర్తించనుంది.
తప్పుడు మూల దేశ వివరాలతో దిగుమతి చేసుకున్నట్లు తేలితే.. గతంలో వచ్చిన సరుకులపైనా సుంకాలు విధించే అవకాశం ఉందని అమెరికా తెలిపింది.