USA: హూతీలపై అమెరికా వైమానిక దాడులు.. 31 మంది మృతి
ఈ వార్తాకథనం ఏంటి
యెమెన్లో హూతీలపై అమెరికా సైనిక చర్య ప్రారంభమైంది. యెమెన్ రాజధాని సనా, సదా, అల్ బైదా, రాడా ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడులు నిర్వహించారు.
ఈ దాడుల్లో ఇప్పటి వరకు 31 మంది మృతి చెందగా, 101 మంది గాయపడ్డారని హూతీ ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. మృతుల్లో మహిళలు, చిన్నారులే ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.
అమెరికా నౌకలు, విమానాలపై హూతీల దాడులను సహించబోమని యూఎస్ 'సెంట్రల్ కమాండ్' స్పష్టం చేసింది. అగ్రరాజ్య దాడులను హూతీ పొలిటికల్ బ్యూరో యుద్ధ నేరంగా పేర్కొంది.
యెమెన్ దళాలు ప్రతిస్పందించేందుకు సిద్ధంగా ఉన్నాయని హెచ్చరించింది.
Details
ఇరాన్ బాధ్యత వహించాల్సి ఉంటుంది
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తిరుగుబాటుదారులను తీవ్రంగా హెచ్చరించారు. 'హూతీలు... మీ సమయం ఆసన్నమైంది. మీ దాడులు వెంటనే ఆపేయాలి. లేకపోతే ఊహించని పరిణామాలను ఎదుర్కొవాల్సి ఉంటుందని ఆయన ట్రూత్ సోషల్ వేదికగా వ్యాఖ్యానించారు.
ప్రపంచ జలమార్గాల్లో అమెరికా వాణిజ్య, యుద్ధ నౌకలు స్వేచ్ఛగా కదలకుండా ఏ ఉగ్రశక్తీ అడ్డుకోలేదని పేర్కొన్నారు.
హూతీలకు మద్దతు అందిస్తున్న ఇరాన్ను ట్రంప్ హెచ్చరిస్తూ, వారి చర్యలకు పూర్తి బాధ్యత ఇరానే వహించాల్సి ఉంటుందని తేల్చి చెప్పారు.