Mojtaba Khamenei: మొజ్తాబా ఖమేనీ ఆచూకీ చెప్తే రూ.93 కోట్లు.. అమెరికా భారీ బహుమతి ప్రకటన!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్ కొత్త సుప్రీం లీడర్గా బాధ్యతలు చేపట్టిన మోజ్తాబా ఖమేనీ ఆచూకీ కోసం అమెరికా భారీ బహుమతిని ప్రకటించింది. ఆయన ఎక్కడ ఉన్నారన్న సమాచారాన్ని అందించిన వారికి 10 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో దాదాపు రూ.93 కోట్లు) ఇస్తామని యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ స్టేట్ వెల్లడించింది. ఈ విషయాన్ని అమెరికా విదేశాంగ శాఖ తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించింది. మొజ్తాబా ఖమేనీతో పాటు ఆయన కార్యాలయ డిప్యూటీ చీఫ్ అలీ అస్గర్ హెజాజీ, అలాగే ఇరాన్కు చెందిన భద్రతా అధికారి అలీ లారిజని పేర్లను కూడా అమెరికా విదేశాంగ శాఖ ప్రస్తావించింది.
Details
ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారు
వీరు ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారని ఆరోపించింది. ఈ వ్యక్తులకు సంబంధించిన సమాచారం ఉన్నవారు ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్ లేదా టోర్ నెట్వర్క్ ద్వారా వివరాలు అందించాలని అమెరికా పేర్కొంది. విశ్వసనీయ సమాచారం అందించిన వారికి భారీ బహుమతి ఇవ్వడమే కాకుండా అవసరమైతే పునరావాసం కల్పించే ఏర్పాట్లు కూడా చేస్తామని తెలిపింది. ఇదిలా ఉండగా అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల మొదటి రోజే ఇరాన్ సుప్రీం నేత అలీ ఖమేనీ మరణించిన విషయం తెలిసిందే. ఆ తరువాత ఆయన వారసుడిగా మొజ్తాబా ఖమేనీని ఎంపిక చేశారు. ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల్లో మొజ్తాబా ఇప్పటివరకు బహిరంగంగా కనిపించలేదు. ఆయన ఎక్కడ ఉన్నారనే విషయంలో స్పష్టత లేకపోవడం గమనార్హం.