US: ఇరాన్ రాడార్, డ్రోన్ కేంద్రాలపై అమెరికా 'ఆత్మరక్షణ దాడులు'
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా ఇరాన్లోని గొరుక్ ప్రాంతం, ఖెష్మ్ దీవిలో ఉన్న రాడార్ వ్యవస్థలు, డ్రోన్ కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలపై "ఆత్మరక్షణ దాడులు" నిర్వహించినట్లు ప్రకటించింది. ఈ ఆపరేషన్ను అమెరికా సెంట్రల్ కమాండ్ (CENTCOM) గత వారాంతంలో చేపట్టినట్లు తెలిపింది. అంతర్జాతీయ జలాల్లో విధులు నిర్వహిస్తున్న అమెరికాకు చెందిన MQ-1 డ్రోన్ను ఇరాన్ కూల్చివేయడంతో పాటు చేపట్టిన దూకుడు చర్యలకు ప్రతిస్పందనగా ఈ దాడులు జరిగినట్లు CENTCOM వెల్లడించింది. శనివారం, ఆదివారం రోజుల్లో అత్యంత ప్రణాళికాబద్ధంగా, పరిమిత లక్ష్యాలతో ఈ దాడులు నిర్వహించినట్లు పేర్కొంది.
వివరాలు
అమెరికా వైమానిక స్థావరంపై బాంబు దాడి
అమెరికా యుద్ధ విమానాలు వేగంగా స్పందించి ఇరాన్కు చెందిన వైమానిక రక్షణ వ్యవస్థలు, ఒక గ్రౌండ్ కంట్రోల్ స్టేషన్, అలాగే ఆత్మాహుతి తరహా రెండు దాడి డ్రోన్లను ధ్వంసం చేసినట్లు CENTCOM తెలిపింది. ఇవి ప్రాంతీయ జలాల్లో ప్రయాణిస్తున్న నౌకలకు స్పష్టమైన ముప్పుగా గుర్తించబడినట్లు వెల్లడించింది. ఈ దాడుల్లో అమెరికా సైనికులకు ఎలాంటి హాని జరగలేదని పేర్కొంది. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో, ప్రాంతంలో తమ ఆస్తులు, ప్రయోజనాలను రక్షించేందుకు కట్టుబడి ఉన్నామని CENTCOM స్పష్టం చేసింది. ఇదే సమయంలో సోమవారం ఇరాన్కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC),దక్షిణ ఇరాన్పై జరిగిన దాడిలో పాల్గొన్న అమెరికా వైమానిక స్థావరంపై బాంబు దాడి చేసినట్లు ప్రకటించింది.
వివరాలు
కువైట్లో క్షిపణులు,డ్రోన్ల దాడులు
అయితే ఏ స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నదీ వెల్లడించలేదు. మరోవైపు, అమెరికా భారీ సైనిక స్థావరం ఉన్న కువైట్లో సోమవారం క్షిపణులు, డ్రోన్ల దాడులను వైమానిక రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నట్లు ప్రభుత్వ వార్తా సంస్థ KUNA తెలిపింది. దేశవ్యాప్తంగా హెచ్చరిక సైరన్లు మోగినప్పటికీ, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించలేదు. అమెరికా దాడులకు ప్రతీకారంగా హోర్మోజ్గాన్ ప్రావిన్స్లోని సిరిక్ దీవిలో ఉన్న కమ్యూనికేషన్ టవర్పై జరిగిన దాడికి కారణమైన వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని ఇరాన్ వార్తా సంస్థ ఫార్స్ వెల్లడించింది. IRGC ఏరోస్పేస్ దళాలు నిర్వహించిన ఈ దాడిలో లక్ష్యాలను విజయవంతంగా ధ్వంసం చేసినట్లు ఆ సంస్థ పేర్కొంది.