German Chancellor: ఇరాన్ చేతిలో అమెరికాకు అవమానం..? జర్మన్ చాన్స్లర్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్తో కొనసాగుతున్న యుద్ధంలో అమెరికా తీసుకుంటున్న వ్యూహంపై జర్మనీ చాన్స్లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్ తీవ్ర సందేహాలు వ్యక్తం చేశారు. నార్త్ రైన్ వెస్ట్ఫేలియాలో సోమవారం మాట్లాడిన ఆయన.. ఈ యుద్ధంలో అమెరికా ఎలాంటి ఎగ్జిట్ ప్లాన్ తీసుకుంటుందో స్పష్టంగా కనిపించడం లేదని అన్నారు. పరిస్థితి రోజు రోజుకు క్లిష్టంగా మారుతోందని వ్యాఖ్యానించారు. మరోవైపు ఇరాన్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు చేసిన మెర్జ్.. అక్కడి ప్రభుత్వం ప్రజలను అవమానానికి గురిచేస్తోందని, ముఖ్యంగా విప్లవ గార్డ్స్ పాత్రపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
వివరాలు
చాకచక్యంగా వ్యవహరిస్తున్న ఇరాన్
ఇదిలా ఉంటే, ఈ యుద్ధంలో ఇరాన్ బలం ముందుగా అంచనా వేసినదానికంటే ఎక్కువగా ఉందని చెప్పారు. చర్చల్లో కూడా ఇరాన్ చాకచక్యంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. ఇదే సమయంలో హార్ముజ్ జలసంధి పరిసరాల్లో మైన్లు పెట్టిన పరిస్థితి ఉందని, ఇది ప్రపంచ చమురు సరఫరాపై ప్రభావం చూపే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ పరిస్థితులు కొనసాగితే గ్లోబల్ ట్రేడ్కే దెబ్బ తగిలే అవకాశం ఉందన్నారు. వెంటనే ఈ యుద్ధాన్ని ముగించాల్సిన అవసరం ఉందని, లేకపోతే జర్మనీ ఆర్థిక వ్యవస్థపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందని మెర్జ్ స్పష్టం చేశారు.