LOADING...
AMRAAM: పాకిస్థాన్‌కు AMRAAM క్షిపణుల అమ్మకానికి అమెరికా ఆమోదం.. భారత్‌కు కొత్త సవాల్‌?
భారత్‌కు కొత్త సవాల్‌?

AMRAAM: పాకిస్థాన్‌కు AMRAAM క్షిపణుల అమ్మకానికి అమెరికా ఆమోదం.. భారత్‌కు కొత్త సవాల్‌?

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 08, 2025
02:23 pm

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికా-పాకిస్థాన్ మధ్య స్నేహ బంధం మరింత బలపడుతోంది. అరేబియా సముద్ర తీరంలో పోర్ట్‌ నిర్మాణానికి అవకాశం కల్పించడం, రెయర్ ఎర్త్ ఒప్పందం తర్వాత, ఇప్పుడు వాషింగ్టన్‌ పాకిస్థాన్‌కు అత్యాధునిక గగనతల క్షిపణుల అమ్మకానికి గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చింది. అమెరికా రక్షణ శాఖ (ఇప్పుడు Department of War - DoW‌గా పిలుస్తున్నారు) తాజాగా ప్రకటించిన ఆయుధ ఒప్పందంలో పాకిస్థాన్‌ 35 దేశాల జాబితాలో ఉంది. ఈ ఒప్పందం ప్రకారం, పాకిస్థాన్‌ వైమానిక దళం (PAF) 2030 నాటికి 120 AMRAAM 120D-3 తరహా ఎయిర్‌ టు ఎయిర్‌ క్షిపణులను పొందనుంది.

వివరాలు 

F-16 విమానాల అప్‌గ్రేడ్‌ ఊహాగానాలు

ఈ నిర్ణయం పాకిస్థాన్‌ F-16 యుద్ధవిమానాల అప్‌గ్రేడ్‌పై ఊహాగానాలకు దారితీసింది. ఎందుకంటే AMRAAM క్షిపణులు F-16లకే అనుకూలంగా ఉంటాయి. 2019లో జరిగిన భారత-పాక్ వైమానిక యుద్ధంలో, పాకిస్థాన్‌ ఈ క్షిపణిని వాడి భారత వైమానిక దళానికి చెందిన మిగ్-21 విమానాన్ని కూల్చిందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఆ విమానం నడిపిన వింగ్ కమాండర్ అభినందన్ వర్థమాన్‌ను పాకిస్థాన్‌ బంధించి తరువాత భారత్‌కు అప్పగించింది.

వివరాలు 

AMRAAM క్షిపణి సామర్థ్యం

AIM-120 AMRAAM అమెరికా రక్షణ దిగ్గజం రేథియన్‌ రూపొందించిన అత్యాధునిక గగనతల క్షిపణి. ఇది AIM-7 స్పారో సిరీస్‌ తరువాత రూపొందించిన ఆధునిక మోడల్‌. తక్కువ ఎత్తులో ఉన్న లక్ష్యాలను కూడా సులభంగా చేరుకునే సామర్థ్యం కలిగి ఉంటుంది. చిన్న పరిమాణం,తక్కువ బరువు,వేగవంతమైన ప్రదర్శనతో పాటు,రాడార్ వ్యవస్థ,సూక్ష్మ కంప్యూటర్‌ సాంకేతికత కలిగిన ఈ క్షిపణి, విమాన ఫైర్‌ కంట్రోల్‌పై ఎక్కువ ఆధారపడదు. ఒకసారి క్షిపణి లక్ష్యాన్ని గుర్తించిన తర్వాత, దాని రాడార్‌ స్వయంగా దిశ చూపిస్తుంది. దీంతో పైలట్‌ ఒకేసారి అనేక లక్ష్యాలపై అనేక క్షిపణులను ప్రయోగించగలడు. అదే సమయంలో పైలట్‌ తప్పించుకునే మానవర్‌లు చేయగల సామర్థ్యం కూడా ఉంటుంది.

వివరాలు 

పాకిస్థాన్‌కు అమెరికా సరఫరా చేయనున్న కొత్త వెర్షన్

ఈ క్షిపణి F-15,F-16,F/A-18,F-22, యూరోఫైటర్ టైఫూన్‌, గ్రిపెన్‌,టోర్నడో వంటి అనేక యుద్ధవిమానాలకు సరిపోతుంది. తాజా AMRAAM వెర్షన్‌ అన్ని రకాల F-35 జాయింట్‌ స్ట్రైక్‌ ఫైటర్‌లలో కూడా వినియోగంలో ఉంది. రక్షణ పత్రిక "క్వా"(Quwa) సమాచారం ప్రకారం,అమెరికా పాకిస్థాన్‌కు AIM-120C8 వెర్షన్‌ క్షిపణులను అందించనుంది. ఇది అమెరికా సైన్యంలో వాడుతున్న D మోడల్‌కు ఎగుమతి వెర్షన్‌. ప్రస్తుతం పాకిస్థాన్‌ వద్ద 2010లో F-16 బ్లాక్ 52 విమానాలతో పాటు కొనుగోలు చేసిన C5 మోడల్‌ క్షిపణులు ఉన్నాయి. కొత్త మోడల్‌ కోసం పాకిస్థాన్‌ చాలా కాలంగా లాబీయింగ్‌ చేస్తోందని సైనిక వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా భారత్‌ రఫేల్‌ విమానాలతో మెటియోర్‌ క్షిపణులను వినియోగంలోకి తెచ్చిన తర్వాత ఈ ప్రయత్నం మరింత వేగం పుంజుకుంది.

వివరాలు 

ట్రంప్‌ పాలనలో అమెరికా-పాక్‌ సాన్నిహిత్యం

జూలైలో పాకిస్థాన్‌ వైమానిక దళాధిపతి జహీర్ అహ్మద్ బాబర్ సిద్దూ అమెరికా అధికారులతో వాషింగ్టన్‌లో సమావేశమైన తర్వాత ఈ ఒప్పందం ఫైనల్‌ అయిందని సమాచారం. పాకిస్థాన్‌ 2007లోనే 700 AMRAAM క్షిపణులు కొనుగోలు చేసి, ఆ సమయంలోనే ఈ ఆయుధానికి ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్డర్‌ ఇచ్చింది. 2019లో ఇదే క్షిపణిని ఉపయోగించి పాక్‌ భారత సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడంతో భారత్‌ తీవ్రంగా స్పందించింది. అప్పట్లో భారత్‌ అమెరికాకు పాకిస్థాన్‌ F-16లు, AMRAAM క్షిపణులు వాడినట్లు ఆధారాలు చూపించింది. ఇది అమెరికా విధించిన వినియోగ నిబంధనలకు వ్యతిరేకమని అప్పట్లో భారత్‌ తెలిపింది. అమెరికా ఈ నిర్ణయం భారత్‌కు ఆందోళనకరంగా మారింది. ఎందుకంటే ఇది అమెరికా-పాక్‌ స్నేహం బలపడుతున్న సంకేతంగా కనిపిస్తోంది.

వివరాలు 

భారత్‌ ఆందోళనలో పడాల్సిన సమయం?

డొనాల్డ్‌ ట్రంప్‌ మళ్లీ వైట్‌హౌస్‌లోకి వచ్చిన తర్వాత పాకిస్థాన్‌తో సంబంధాలను బలపరుస్తున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. మేలో భారత్‌ చేపట్టిన "ఆపరేషన్‌ సిందూర్‌" తర్వాత ఈ అనుబంధం మరింత బలపడిందని సమాచారం. పాకిస్థాన్‌ సీఫైర్‌ ఏర్పాటుకు ట్రంప్‌ కృషి చేశారని అక్కడి ప్రభుత్వం ఆయనను నోబెల్‌ బహుమతికి సిఫార్సు చేసింది. మరోవైపు, భారత్‌ మాత్రం ఈ కాల్పుల విరమణ నిర్ణయం రెండు దేశాల సైన్యాధిపతుల(DGMOs) మధ్య నేరుగా జరిగిన చర్చల ఫలితమని స్పష్టం చేసింది. ఇటీవల సెప్టెంబర్‌లో ట్రంప్‌, పాకిస్థాన్‌ ప్రధాన మంత్రి షహ్‌బాజ్‌ షరీఫ్‌,ఆర్మీ చీఫ్‌ ఆసిం మునీర్‌లను వైట్‌హౌస్‌లో కలిశారు. ఈ సమావేశంలో ఒకరిపైకొకరు ప్రశంసలు కురిపించారు. అయితే మరోవైపు, ట్రంప్‌ భారత్‌పై 50 శాతం దిగుమతి సుంకాలు విధించడం గమనార్హం.

వివరాలు 

చైనా-పాక్‌ ఆయుధ సహకారం కూడా పెరుగుతోంది

ఈ ఒప్పందం తో పాటు, పాకిస్థాన్‌ ఇప్పటికే చైనా నుండి భారీ ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. ఇటీవల జరిగిన ఆపరేషన్‌ సిందూర్‌లో పాక్‌ PL-15 క్షిపణులు, HQ-9 రక్షణ వ్యవస్థ వంటి చైనా ఆయుధాలను వాడింది. SIPRI నివేదిక ప్రకారం, గత ఐదేళ్లలో పాకిస్థాన్‌ దిగుమతులలో 81 శాతం చైనా ఆయుధాలే. దీంతో పాకిస్థాన్‌ తన రక్షణ శక్తిని విస్తరిస్తూ, మరిన్ని దేశాలతో ఆయుధ సంబంధాలను బలపరుస్తోందని నిపుణులు చెబుతున్నారు. అమెరికా-పాకిస్థాన్‌ స్నేహం కొత్త దశలోకి అడుగుపెడుతుండగా, భారత్‌ పరిస్థితిని జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇరుదేశాల మధ్య ఏవైనా ఉద్రిక్తతలు ఏర్పడితే, ఈ కొత్త క్షిపణులు పాక్‌కు అదనపు బలాన్ని ఇవ్వవచ్చని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు.