US: వామ్మో.. ఇరాన్ యుద్ధానికి అమెరికా ఇంత ఖర్చు పెట్టిందా!
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్తో కొనసాగుతున్న సైనిక చర్యల కారణంగా అమెరికా ఇప్పటికే 37.5 బిలియన్ డాలర్లు (సుమారు రూ.3.6 లక్షల కోట్లు) ఖర్చు చేసినట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి పీట్ హెగ్సెత్ వెల్లడించారు. యుద్ధ కార్యకలాపాలను నిరంతరంగా కొనసాగించడంతో పాటు,వినియోగంలో తగ్గిన సైనిక వనరులను తిరిగి భర్తీ చేసేందుకు మరిన్ని అత్యవసర నిధులు అవసరమని ట్రంప్ ప్రభుత్వం కాంగ్రెస్ను కోరుతున్న నేపథ్యంలో ఆయన ఈ వివరాలను వెల్లడించారు. సెనేట్ అప్రాప్రియేషన్స్ కమిటీ ఎదుట జరిగిన విచారణలో హెగ్సెత్ తాజా వ్యయ అంచనాలను వెల్లడించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెప్టెంబర్ 30తో ముగియనున్న నేపథ్యంలో,అప్పటి వరకు అయ్యే మొత్తం ఖర్చును పరిగణనలోకి తీసుకుని ఈ లెక్కలను రూపొందించినట్లు తెలిపారు.
వివరాలు
మళ్లీ ముదిరిన ఘర్షణ
అంతకుముందు మే, జూన్ నెలల్లో ఈ వ్యయం 29 నుంచి 30 బిలియన్ డాలర్ల మధ్య ఉంటుందని అంచనా వేయగా, ఇప్పుడు అది 37.5 బిలియన్ డాలర్లకు చేరిందని పేర్కొన్నారు.
యుద్ధ కార్యకలాపాలను కొనసాగించేందుకు అదనంగా సుమారు 67 బిలియన్ డాలర్ల రక్షణ నిధులు మంజూరు చేయాలని జాయింట్ చీఫ్స్ ఆఫ్ స్టాఫ్ ఛైర్మన్ జనరల్ డాన్ కెయిన్తో కలిసి సెనేట్ను హెగ్సెత్ అభ్యర్థించారు.
ఈ ఏడాది ఫిబ్రవరి చివర్లో అమెరికా, ఇజ్రాయెల్ చేపట్టిన దాడులతో ప్రారంభమైన ఘర్షణ,ఈ నెల ఆరంభంలో కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ విఫలం కావడంతో మరోసారి తీవ్రరూపం దాల్చింది.
ప్రస్తుతం ఇరాన్,అమెరికా మధ్య దాడులు-ప్రతిదాడులు దాదాపు ప్రతిరోజూ కొనసాగుతున్నాయి.
వివరాలు
ప్రాణనష్టం.. రాజకీయ విమర్శలు
ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హార్ముజ్ జలసంధిపై ఇరాన్ ఆధిపత్యాన్ని బలహీనపర్చడమే అమెరికా ప్రధాన లక్ష్యంగా సైనిక చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే ఈ ప్రాంతంలో ఏర్పడిన అంతరాయాల ప్రభావంతో అమెరికాలో గ్యాస్ ధరలు పెరగడం కూడా ఆందోళన కలిగిస్తోంది.
ఇప్పటివరకు ఈ ఘర్షణలో 17 నుంచి 18 మంది అమెరికా సైనికులు మరణించగా,వంద మందికిపైగా గాయపడినట్లు పెంటగాన్ వెల్లడించింది.
గాయపడిన వారిలో చాలా మంది తిరిగి విధుల్లో చేరినట్లు అధికారులు తెలిపారు.
అయితే యుద్ధ వ్యూహం, దాని కాలపరిమితిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదని రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీలకు చెందిన పలువురు చట్టసభ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
వివరాలు
నిధులు రాకపోతే ప్రభావం
ముఖ్యంగా మధ్యంతర ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ యుద్ధం వల్ల పెరుగుతున్న ఆర్థిక భారం, ప్రాణనష్టాన్ని డెమొక్రాట్లు ప్రధాన అంశంగా ప్రస్తావిస్తున్నారు.
అత్యవసర నిధులు వెంటనే మంజూరు కాకపోతే సైనిక శిక్షణలో కోతలు విధించాల్సి వస్తుందని, ఆయుధాలు, ఇతర రక్షణ పరికరాల నిర్వహణ దెబ్బతింటుందని హెగ్సెత్ హెచ్చరించారు.
దీంతో దేశ రక్షణ సంసిద్ధతపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందన్నారు.
అలాగే 2027 ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదించిన 1.5 ట్రిలియన్ డాలర్ల రక్షణ బడ్జెట్ అమెరికా భద్రతకు అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.
వివరాలు
కాంగ్రెస్లో రాజకీయ పరీక్ష
కాంగ్రెస్లో రిపబ్లికన్ పార్టీకి స్వల్ప మెజారిటీ మాత్రమే ఉండటంతో, అదనపు రక్షణ నిధుల బిల్లు ఆమోదం పొందాలంటే డెమొక్రాట్ల మద్దతు కూడా అవసరం కానుంది.
ఇదే సమయంలో విచారణ జరుగుతున్న సమయంలో కొందరు నిరసనకారులు సభకు అంతరాయం కలిగించి యుద్ధానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని గణనీయంగా దెబ్బతీశామని అమెరికా ప్రభుత్వం చెబుతున్నప్పటికీ, అధ్యక్షుడు ట్రంప్ మరిన్ని సైనిక చర్యలకు సిద్ధమన్న సంకేతాలు ఇస్తున్నారు.
మొత్తం మీద ఇరాన్తో కొనసాగుతున్న ఈ యుద్ధం అమెరికా ఖజానాపై భారీ ఆర్థిక భారాన్ని మోపుతుండగా, అవసరమైన నిధుల సమీకరణ ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగానూ కీలక సవాలుగా మారుతోంది.