Loading...
US Student Visa: భారతీయ విద్యార్థులకు యూఎస్ స్టూడెంట్ వీసాల్లో 62% కోత.. సీఐఎస్ నివేదిక వెల్లడి
సీఐఎస్ నివేదిక వెల్లడి

US Student Visa: భారతీయ విద్యార్థులకు యూఎస్ స్టూడెంట్ వీసాల్లో 62% కోత.. సీఐఎస్ నివేదిక వెల్లడి

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 07, 2026
10:10 am

ఈ వార్తాకథనం ఏంటి

అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే భారతీయ విద్యార్థులకు స్టూడెంట్ వీసాల జారీలో భారీ తగ్గుదల నమోదైంది. యూఎస్ మేధోమథన సంస్థ సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్ (సీఐఎస్) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, వీసా ఆంక్షల ప్రభావం భారతీయ విద్యార్థులపై అత్యధికంగా పడింది. ఈ జాబితాలో చైనా రెండో స్థానంలో నిలిచింది. సీఐఎస్ వెల్లడించిన గణాంకాల ప్రకారం, 2025లో భారతీయులకు జారీ చేసిన స్టూడెంట్ వీసాల సంఖ్య గత ఏడాదితో పోలిస్తే 62 శాతం తగ్గింది. 2024లో భారతీయ విద్యార్థులకు 58,694 స్టూడెంట్ వీసాలు జారీ కాగా, 2025లో ఆ సంఖ్య 22,149కు పరిమితమైంది.

వివరాలు 

చైనా విద్యార్థుల వీసాల జారీలో 34 శాతం తగ్గుదల

చైనా విద్యార్థుల విషయంలో కూడా వీసాల జారీ గణనీయంగా తగ్గింది.

2024లో 61,075 స్టూడెంట్ వీసాలు మంజూరు చేయగా, 2025లో అవి 40,034కు తగ్గాయి.

దీంతో చైనా విద్యార్థుల వీసాల జారీలో 34 శాతం తగ్గుదల నమోదైనట్లు నివేదిక పేర్కొంది.

అయితే, వీసాల జారీలో తగ్గుదల కనిపించినప్పటికీ అమెరికాలో చదువుతున్న అంతర్జాతీయ విద్యార్థుల్లో భారతీయులు,చైనీయులే ఇప్పటికీ అధిక సంఖ్యలో ఉన్నారని సీఐఎస్ వెల్లడించింది.

2024-25 విద్యా సంవత్సరంలో అమెరికాలో 3,63,019 మంది భారతీయ విద్యార్థులు, 2,65,919 మంది చైనా విద్యార్థులు ఉన్నారు.

మొత్తం పోస్ట్-సెకండరీ స్థాయిలో చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో ఈ రెండు దేశాల విద్యార్థుల వాటా కలిపి దాదాపు 53 శాతంగా ఉందని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) తెలిపింది.

వివరాలు 

ఓపీటీ విధానంపై సీఐఎస్ అభ్యంతరం

సీఐఎస్ నివేదికలో ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) విధానంపై కూడా కీలక వ్యాఖ్యలు చేసింది.

2024-25లో దాదాపు మూడు లక్షల మంది విదేశీ విద్యార్థులు తమ చదువులు పూర్తయ్యాక ఓపీటీ ద్వారా అమెరికాలో తాత్కాలిక ఉద్యోగాలు పొందినట్లు తెలిపింది.

ఓపీటీ కింద ఉపాధి పొందిన మొత్తం 2,94,253 మంది విదేశీ విద్యార్థుల్లో 49 శాతం మంది భారతీయులు, 21 శాతం మంది చైనీయులు ఉన్నారని సీఐఎస్ వెల్లడించింది.

ఈ విధానం అమెరికా విద్యార్థులు, స్థానిక ఉద్యోగార్థుల ఉపాధి అవకాశాలపై ప్రభావం చూపుతోందని పేర్కొంటూ, ఓపీటీ కార్యక్రమాన్ని పూర్తిగా నిలిపివేయాలని తన నివేదికలో సూచించింది.

ADVERTISEMENT