US-Iran War: హర్మూజ్లో ఉద్రిక్త పరిస్థితి.. ఇరాన్ను చుట్టుముట్టిన అమెరికా
ఈ వార్తాకథనం ఏంటి
హర్మూజ్ జలసంధి పరిసరాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. ఇరాన్పై ఒత్తిడి పెంచే దిశగా ఆ దేశ ఓడరేవులపై పూర్తిస్థాయి దిగ్బంధనం అమలు చేయనున్నట్లు అమెరికా కేంద్ర సైనిక కమాండ్ ప్రకటించింది. ఈ దిగ్బంధనం ఏప్రిల్ 13 సోమవారం తూర్పు కాలమానం ప్రకారం ఉదయం 10గంటల నుంచి, భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7గంటల 30నిమిషాల నుంచి అమల్లోకి రానుందని వెల్లడించింది. అరేబియా గల్ఫ్,ఒమన్ గల్ఫ్ ప్రాంతాల్లోని ఇరాన్ తీర ప్రాంతాలు,ఓడరేవులకు వచ్చే లేదా అక్కడి నుంచి బయలుదేరే ఏ దేశానికి చెందిన నౌకలైనా అడ్డుకుంటామని తెలిపింది. అయితే హర్మూజ్ జలసంధి మార్గంగా ఇతర దేశాల ఓడరేవులకు వెళ్లే నౌకల ప్రయాణ స్వేచ్ఛను నిలిపివేయబోమని స్పష్టం చేసింది.
వివరాలు
అమెరికా చర్యల వల్ల ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం
అమెరికా విధించిన ఆంక్షలను తప్పించుకునేందుకు చైనా కరెన్సీ రూపంలో లావాదేవీలు జరుపుతున్న నౌకలను నియంత్రించడమే ఈ చర్య వెనుక ప్రధాన ఉద్దేశమని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నిర్ణయంపై ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహమ్మద్ బఘేర్ ఖలీబాఫ్ తీవ్రంగా స్పందించారు. అమెరికా చర్యల వల్ల అక్కడి వినియోగదారులపై భారం పడుతుందని, ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశముందని హెచ్చరించారు. "ప్రస్తుత పంపు ధరలను ఆస్వాదించండి. మా దిగ్బంధనంతో త్వరలోనే మీరు 4-5 డాలర్ల గ్యాస్ ధరలను గుర్తుచేసుకుని బాధపడతారు" అని ఆయన ఎక్స్లో వ్యంగ్యంగా పోస్ట్ చేశారు.
వివరాలు
హర్మూజ్ జలసంధిలో ఏ చిన్న అంతరాయం వచ్చినా..
ఇటీవల హర్మూజ్ జలసంధిలో ఇరాన్, అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. తమ హెచ్చరికలతో రెండు అమెరికా యుద్ధనౌకలను వెనక్కి పంపించామని ఇరాన్ విప్లవ గార్డులు ప్రకటించగా, ఈ వాదనను అమెరికా ఖండించింది. తమ యుద్ధనౌకలు ఎలాంటి ఆటంకాలు లేకుండా ప్రయాణం పూర్తి చేశాయని వెల్లడించింది. ఈ పరిణామాలతో ఇరాన్, చైనా దేశాలతో అమెరికా మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్నాయి. ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్మూజ్ జలసంధిలో ఏ చిన్న అంతరాయం వచ్చినా ముడి చమురు ధరలు పెరిగి, ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.