USA: హర్మూజ్ మార్గంలో టోల్ వసూలుపై.. ఒమన్కు అమెరికా హెచ్చరికలు
ఈ వార్తాకథనం ఏంటి
మిత్రదేశంగా భావించే ఒమన్కు అమెరికా కఠిన హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్తో కలిసి హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణించే నౌకల నుంచి రుసుములు వసూలు చేసే ప్రయత్నం చేస్తే ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. అలాంటి చర్యలు చేపడితే అమెరికా ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆ దేశ ఆర్థిక శాఖ మంత్రి స్కాట్ బెసెంట్ సామాజిక మాధ్యమ వేదిక ద్వారా హెచ్చరించారు. హర్మూజ్ జలసంధిలో నౌకలపై రుసుములు విధించే విధానాన్ని అమెరికా ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించదని బెసెంట్ పేర్కొన్నారు. ముఖ్యంగా ఒమన్ నేరుగా గానీ, పరోక్షంగా గానీ ఇరాన్తో కలిసి ఇలాంటి చర్యలకు పాల్పడితే అమెరికా ఆర్థిక శాఖ ప్రత్యేక ఆంక్షలు విధించే అవకాశం ఉందని తెలిపారు.
వివరాలు
ఒమన్ రాయబారితో ఫోన్లో మాట్లాడిన బెసెంట్
ఈ హెచ్చరికల అనంతరం ఒమన్ నుంచి స్పష్టమైన హామీ అందిందని ఆయన వెల్లడించారు. నౌకలపై రుసుములు విధించే ఎలాంటి ప్రణాళిక తమ వద్ద లేదని ఒమన్ స్పష్టం చేసినట్లు చెప్పారు. ఒమన్ రాయబారితో తాను ఫోన్లో మాట్లాడిన విషయాన్ని కూడా బెసెంట్ వెల్లడించారు. హర్మూజ్ జలసంధిలో రుసుముల వసూళ్లకు సంబంధించి ఎలాంటి ప్రతిపాదనలు లేదా కార్యాచరణ ప్రణాళికలు లేవని రాయబారి తనకు తెలియజేశారని చెప్పారు. అమెరికా-ఒమన్ మధ్య ఎన్నో సంవత్సరాలుగా కొనసాగుతున్న స్నేహపూర్వక సంబంధాలను భవిష్యత్తులోనూ అలాగే కొనసాగించాలని ఒమన్ ఆకాంక్షిస్తున్నట్లు వివరించారు.
వివరాలు
సైనిక, ఆర్థిక ఒత్తిడితోనే చర్చలకు వచ్చిన ఇరాన్
ఇరాన్ అణు కార్యక్రమంపై ప్రస్తుతం జరుగుతున్న చర్చలకు ఆ దేశం రావడానికి ప్రధాన కారణం సైనిక చర్యల భయం, ఆర్థిక ఒత్తిళ్లేనని స్కాట్ బెసెంట్ అభిప్రాయపడ్డారు. ఇరాన్తో కుదిరే ఏదైనా ఒప్పందంపై తుది నిర్ణయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేతుల్లోనే ఉంటుందని చెప్పారు. ఇరాన్ అణ్వాయుధాలను కలిగి ఉండకూడదనే విషయంలో ట్రంప్ వైఖరి మారదని స్పష్టం చేశారు. హర్మూజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత వాణిజ్య రవాణాకు ఇరాన్ అడ్డంకులు సృష్టించకపోవడం, తన వద్ద ఉన్న యురేనియం నిల్వలను అప్పగించడం, అణ్వాయుధాల అభివృద్ధికి దూరంగా ఉండడం వంటి అమెరికా డిమాండ్లను టెహ్రాన్ అంగీకరిస్తే ఒప్పందం సాధ్యమయ్యే అవకాశాలు ఉన్నాయని బెసెంట్ తెలిపారు.
వివరాలు
సైనిక, ఆర్థిక ఒత్తిడితోనే చర్చలకు వచ్చిన ఇరాన్
పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం ప్రపంచ చమురు మార్కెట్లపై పడుతున్న విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. గత మే నెలలో చమురు ధరలు సుమారు 10 శాతం మేర తగ్గాయని చెప్పారు. హర్మూజ్ జలసంధి పరిసరాల్లో దాదాపు రెండు వేల నౌకలు నిలిచిపోయినట్లు వెల్లడించారు. ప్రాంతీయ ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టిన తర్వాత చమురు ధరలు మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంటాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.