Vladimir Putin: భారత పర్యటనకు రష్యా అధ్యక్షుడు పుతిన్.. పూర్తి వివరాలివే
ఈ వార్తాకథనం ఏంటి
రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరోసారి భారత్ పర్యటనకు రానున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 12, 13 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించనున్న18వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనేందుకు ఆయన భారత్కు వస్తున్నట్లు రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్ అధికారికంగా వెల్లడించింది. భారత్-రష్యా మధ్య వ్యూహాత్మక, రక్షణ రంగ సంబంధాలు మరింత బలపడుతున్న సమయంలో పుతిన్ పర్యటన ఖరారవడం ప్రాధాన్యత సంతరించుకుంది. గత ఏడాది డిసెంబర్లో నిర్వహించిన 23వ భారత్-రష్యా వార్షిక సదస్సు కోసం పుతిన్ ఢిల్లీకి వచ్చారు. ఆ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమైన ఆయన.. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని మరింత విస్తరించే అంశాలపై చర్చలు జరిపారు. ఏడాది వ్యవధిలోపే పుతిన్ మరోసారి భారత్కు రావడం విశేషంగా మారింది.
వివరాలు
ఏడాది వ్యవధిలో రెండోసారి భారత్కు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం 2022లో ప్రారంభమైన తర్వాత పుతిన్ గతేడాది డిసెంబర్లోనే మొదటిసారి భారత్లో అడుగుపెట్టారు. అంతకుముందు ఆయన 2021లో భారత్ను సందర్శించారు. భారత్, రష్యా దేశాధినేతలు ప్రతి ఏడాది ఒకసారి సమావేశం కావడం సంప్రదాయంగా కొనసాగుతోంది. ఒకసారి భారత్లో సమావేశం జరిగితే, తదుపరి సమావేశాన్ని రష్యాలో నిర్వహిస్తుంటారు. ఈసారి భారత్ ఆతిథ్యమిస్తున్న బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో ప్రపంచ భద్రతకు సంబంధించిన సవాళ్లు, ఆర్థిక సహకార విస్తరణ, సభ్య దేశాల మధ్య పరస్పర భాగస్వామ్య బలోపేతం వంటి ప్రధాన అంశాలపై చర్చలు జరగనున్నాయి.