Donald Trump: మేం సముద్రపు దొంగల్లా వ్యవహరిస్తున్నాం.. దిగ్బంధనంపై ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
హర్ముజ్ జలసంధిలో ఇరాన్ ఓడరేవులపై అమెరికా అమలు చేస్తున్న దిగ్బంధనం కొనసాగుతోంది. ఇటీవల ఇరాన్కు చెందిన పలు నౌకలను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పరిణామాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దిగ్బంధనాన్ని అమలు చేసే క్రమంలో అమెరికా నౌకాదళం సముద్రపు దొంగల్లా వ్యవహరించిందని ఆయన వ్యాఖ్యానించారు. ఇరాన్పై కొనసాగుతున్న ఈ దిగ్బంధనం తమ ప్రభుత్వానికి లాభదాయకంగా మారిందని ట్రంప్ తెలిపారు. "మేము నౌకలను స్వాధీనం చేసుకున్నాం. వాటిలోని సరుకు, చమురును కూడా పట్టుకున్నాం. ఇది అత్యంత లాభదాయకమైన వ్యాపారం. మేము సముద్రపు దొంగల్లా ఉన్నాం. ఈ విషయంలో సరదాగా వ్యవహరించడం లేదు, చాలా సీరియస్గా ఉన్నామంటూ ఆయన పేర్కొన్నారు.
వివరాలు
ఇరాన్ కు 45వేల కోట్లకు పైగా నష్టం
ఇదిలా ఉండగా, అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ అంచనా ప్రకారం, ఈ దిగ్బంధనం కారణంగా ఇరాన్కు దాదాపు 4.8 బిలియన్ డాలర్లు (సుమారు రూ.45 వేల కోట్లకు పైగా) నష్టం వాటిల్లింది. దిగ్బంధనం అమలులోకి వచ్చినప్పటి నుంచి చమురు సహా నిషేధిత సరుకులను తరలించేందుకు ప్రయత్నించిన 40కి పైగా నౌకలను అమెరికా దళాలు అడ్డుకుని దారి మళ్లించాయని తెలిపింది. దీంతో సుమారు 53 మిలియన్ బ్యారెళ్ల ఇరాన్ ముడి చమురును మోసుకెళ్తున్న 31 ట్యాంకర్లు గల్ఫ్ ప్రాంతంలోనే నిలిచిపోయాయని కూడా పెంటగాన్ వెల్లడించింది.