Donald Trump : ఇరాన్ నౌకలను నేరుగా ముంచేస్తున్నాం : డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇరాన్తో జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికా దాడులు భారీ స్థాయిలో కొనసాగుతున్నాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సుమారు 5 వేల లక్ష్యాలను అమెరికా సైన్యం ఛేదించిందని ఆయన వెల్లడించారు. ఈ దాడుల కారణంగా ఇరాన్ క్షిపణి సామర్థ్యం గణనీయంగా దెబ్బతిని ప్రస్తుతం దాదాపు 10 శాతానికి పడిపోయిందని పేర్కొన్నారు. అంతేకాకుండా కేవలం మూడున్నర రోజుల్లోనే ఇరాన్కు చెందిన 46 అగ్రశ్రేణి నౌకలను అమెరికా సైన్యం ముంచివేసిందని ట్రంప్ వెల్లడించారు. ఈ విషయాన్ని సైనికాధికారులతో జరిగిన తన సంభాషణ సందర్భంగా ప్రస్తావించారు.
Details
46 నౌకలను ముంచినట్లు సమాచారం
ఇరాన్ డ్రోన్లు, క్షిపణి సామర్థ్యాన్ని పూర్తిగా ధ్వంసం చేస్తున్నామని ట్రంప్ చెప్పారు. 46 నౌకలను ముంచివేశామనే సమాచారం మొదట వినగానే తాను ఆశ్చర్యపోయానని తెలిపారు. దీంతో వెంటనే సైనికాధికారులను సంప్రదించి ఆ నౌకల స్వభావం గురించి అడిగినట్లు వివరించారు. సైనికాధికారులు అవి అగ్రశ్రేణి యుద్ధ నౌకలని చెప్పారని ట్రంప్ పేర్కొన్నారు. అప్పుడు తాను "అలాంటివి అయితే స్వాధీనం చేసుకుని మనం ఉపయోగించుకోవచ్చు కదా, ఎందుకు ముంచివేశారని ప్రశ్నించినట్లు చెప్పారు. దీనికి స్పందించిన అధికారులు ఆ నౌకలను ముంచేయడం సురక్షితమని, యుద్ధ పరిస్థితుల్లో అదే సరైన నిర్ణయమని వివరించారని తెలిపారు. చివరికి ఆ వివరణ తనకూ సరైనదిగా అనిపించిందని ట్రంప్ అన్నారు.
Details
శత్రువును పూర్తిగా ఓడించే వరకు అమెరికా సైన్యం వెనుకడుగు వేయదు
ప్రస్తుతం అమెరికా సైన్యం పశ్చిమాసియాలో విస్తృత స్థాయిలో ఆపరేషన్లు నిర్వహిస్తున్నదని ట్రంప్ చెప్పారు. అక్కడ జరుగుతున్న చర్యలను విహారయాత్రలా అభివర్ణిస్తూ, ఈ ఆపరేషన్ ద్వారా కొంత చెడును తొలగిస్తున్నామని వ్యాఖ్యానించారు. అయితే ఈ ఆపరేషన్ ఎక్కువ కాలం కొనసాగదని, త్వరలోనే దాని ఫలితాలు కనిపిస్తాయని తెలిపారు. శత్రువును పూర్తిగా ఓడించే వరకు అమెరికా సైన్యం వెనుకడుగు వేయదని ట్రంప్ స్పష్టం చేశారు. యుద్ధంలో తుది విజయాన్ని సాధించే వరకు చర్యలు కొనసాగుతాయని ఆయన వెల్లడించారు.