White House: హోర్ముజ్ జలసంధిలో ట్యాంకర్కు ఎస్కార్ట్ ఇవ్వలేదన్న వైట్ హౌస్
ఈ వార్తాకథనం ఏంటి
అమెరికా నౌకాదళం హోర్ముజ్ జలసంధిలో ఒక ఆయిల్ ట్యాంకర్కు ఎస్కార్ట్ ఇచ్చిందన్న వార్తలను వైట్ హౌస్ ఖండించింది. హోర్ముజ్ జలసంధి ద్వారా వెళ్లిన ట్యాంకర్కు అమెరికా సైన్యం ఎలాంటి రక్షణ కల్పించలేదని స్పష్టం చేసింది. ముందుగా అమెరికా ఎనర్జీ సెక్రటరీ క్రిస్ రైట్ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ చేస్తూ, కీలకమైన ఈ జల మార్గంలో ఒక ఆయిల్ ట్యాంకర్కు అమెరికా నౌకాదళం ఎస్కార్ట్ ఇచ్చిందని పేర్కొన్నారు. అయితే కొద్దిసేపటికే ఆ పోస్టును ఆయన తొలగించారు. అనంతరం వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లీవిట్ స్పందిస్తూ, అలాంటి ఎలాంటి సైనిక ఎస్కార్ట్ జరగలేదని వెల్లడించారు.
వివరాలు
ఆయిల్ ట్యాంకర్కు అమెరికా నౌకాదళం ఎస్కార్ట్
ఇక క్రిస్ రైట్ చేసిన పోస్ట్లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వాన్ని ప్రస్తావించారు. ఇరాన్పై సైనిక చర్యల సమయంలో ప్రపంచ ఇంధన సరఫరా స్థిరంగా ఉండేలా ట్రంప్ చర్యలు తీసుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అలాగే ప్రపంచ మార్కెట్లకు చమురు సరఫరా ఆగకుండా ఉండేందుకు హోర్ముజ్ జలసంధిలో ఒక ఆయిల్ ట్యాంకర్కు అమెరికా నౌకాదళం విజయవంతంగా ఎస్కార్ట్ ఇచ్చిందని కూడా రాశారు. అయితే ఈ పోస్ట్ కొద్దిసేపటికే ఎలాంటి వివరణ లేకుండానే తొలగించారు.
వివరాలు
'అమెరికా నావికాదళం ట్యాంకర్ లేదా నౌకకు ఎస్కార్ట్ ఇవ్వలేదు'
ఈ అంశంపై మీడియా సమావేశంలో మాట్లాడిన కరోలైన్ లీవిట్ ఆ వార్తలను పూర్తిగా ఖండించారు. ప్రస్తుతం అమెరికా నౌకాదళం ఏ ట్యాంకర్కైనా లేదా ఇతర నౌకలకు ఎస్కార్ట్ ఇవ్వలేదని ఆమె తెలిపారు. అవసరమైతే సరైన సమయంలో అటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందని, అధ్యక్షుడు ముందుగా చెప్పినట్టుగా అవసరమైతే ఆ ఎంపికను ఉపయోగించవచ్చని కూడా ఆమె పేర్కొన్నారు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే చమురులో 20 శాతం కంటే ఎక్కువ భాగం ఇరాన్, ఒమాన్, యూఏఈలను కలుపుతున్న చిన్న సముద్ర మార్గమైన హోర్ముజ్ జలసంధి ద్వారా రవాణా అవుతుంది.
వివరాలు
అమెరికా నకిలీ వార్తలను వ్యాప్తి చేస్తోందని ఆరోపించిన ఇరాన్
అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఫిబ్రవరి 28న ఇరాన్పై దాడులు ప్రారంభించిన తర్వాత పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ ప్రతీకార దాడులు చేసే అవకాశం ఉందన్న భయంతో హోర్ముజ్ మార్గంలో నౌకా రవాణా దాదాపు నిలిచిపోయింది. ఈ నేపథ్యంలో అమెరికా అధికారులు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ ప్రపంచ చమురు మార్కెట్లను ప్రభావితం చేయాలని చూస్తున్నారని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఖ్చీ ఆరోపించారు. సోషల్ మీడియాలో ఆయన స్పందిస్తూ, మార్కెట్లను మాయచేయడానికి అమెరికా అధికారులు ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని చెప్పారు. ఇది అమెరికన్లపై పడుతున్న ద్రవ్యోల్బణ ప్రభావాన్ని తగ్గించదని కూడా ఆయన వ్యాఖ్యానించారు.
వివరాలు
ప్రపంచ షిప్పింగ్ కార్యకలాపాలకు సహాయం చేస్తా: ట్రంప్ హామీ
ఇక ఈ ఘర్షణల ప్రభావంతో అంతర్జాతీయ నౌకా రవాణాకు ఇబ్బందులు ఏర్పడిన నేపథ్యంలో ప్రపంచ షిప్పింగ్ కార్యకలాపాలకు సహాయం చేస్తామని ట్రంప్ ప్రభుత్వం ముందుగా ప్రకటించింది. మార్చి 3న మాట్లాడిన ట్రంప్, హోర్ముజ్ జలసంధి ద్వారా ప్రయాణించే నౌకలకు అమెరికా డెవలప్మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా రాజకీయ ప్రమాద బీమా,హామీలు అందిస్తామని చెప్పారు. అవసరమైతే అమెరికా నౌకాదళం ట్యాంకర్లకు ఎస్కార్ట్ కూడా ఇవ్వవచ్చని ఆయన సంకేతాలు ఇచ్చారు. అయితే ఈ సముద్ర మార్గం ఇరాన్కు చాలా దగ్గరగా ఉండటం,దాన్ని మూసివేస్తామని తేహ్రాన్ హెచ్చరించడం వల్ల ఆ చర్య ఎంతవరకు ప్రభావవంతంగా ఉంటుంది అన్నది స్పష్టంగా లేదు.
వివరాలు
చమురు ధరలు పెరగడంతో ఇరాన్పై సైనిక చర్యను వ్యతిరేకిస్తున్న అమెరికన్లు
ఇదిలా ఉండగా హోర్ముజ్ జలసంధి ద్వారా చమురు రవాణా నిలిచిపోవడంతో అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరిగాయి. అమెరికన్ ఆటోమొబైల్ అసోసియేషన్ నివేదిక ప్రకారం అమెరికాలో పెట్రోలు ధరలు ఒక్కసారిగా పెరిగి గ్యాలన్కు సగటు ధర 3.54 డాలర్లకు చేరింది. ఇరాన్తో జరుగుతున్న ఈ ఘర్షణకు అమెరికాలో ప్రజల మద్దతు కూడా తక్కువగా ఉందని తాజా సర్వేలు వెల్లడిస్తున్నాయి. క్విన్నిపియాక్ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో 53 శాతం అమెరికా ఓటర్లు ఇరాన్పై సైనిక చర్యలకు వ్యతిరేకంగా ఉన్నట్లు తేలింది. అలాగే రాయిటర్స్-ఇప్సోస్ సర్వేలో ఈ వ్యతిరేకత 60 శాతానికి చేరినట్లు వెల్లడైంది.