LOADING...
G7: జీ7లో సభ్యత్వం లేకున్నా భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం.. కారణాలివే!
జీ7లో సభ్యత్వం లేకున్నా భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం.. కారణాలివే!

G7: జీ7లో సభ్యత్వం లేకున్నా భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం.. కారణాలివే!

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 18, 2026
12:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఒకప్పుడు ప్రపంచ రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలపై పశ్చిమ దేశాలదే పూర్తి ఆధిపత్యం ఉండేది. కానీ కాలం మారుతోంది. ప్రపంచ శక్తి సమీకరణాలు కొత్త రూపు దాలుస్తున్నాయి. ఈ మార్పుల్లో భారత్‌ ప్రభావం గణనీయంగా పెరగడంతో జీ7 కూటమిలో సభ్యత్వం లేకపోయినా ప్రతి ఏడాది ప్రత్యేక ఆహ్వానం అందుకుంటోంది. ప్రపంచ సమస్యలకు పరిష్కారాలు వెతికే సమయంలో భారత్ అభిప్రాయాన్ని విస్మరించలేని పరిస్థితి ఏర్పడిందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అమెరికా,బ్రిటన్,కెనడా,ఫ్రాన్స్,జర్మనీ,ఇటలీ,జపాన్ దేశాలతో కూడిన జీ7 కూటమి ప్రపంచంలోని అత్యంత సంపన్న ఆర్థిక వ్యవస్థలకు ప్రతినిధిగా గుర్తింపు పొందింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ,వాణిజ్యం,భద్రత,వాతావరణ మార్పులు,ఇంధన భద్రత,సరఫరా వ్యవస్థల వంటి కీలక అంశాలపై ఈ దేశాలు విధానాలను రూపొందిస్తుంటాయి.

వివరాలు 

గ్లోబల్ సౌత్‌కు భారత్ బలమైన స్వరం

అయితే ఇటీవలి కాలంలో ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవాలంటే భారత్ వంటి కీలక దేశాల భాగస్వామ్యం అవసరమనే అభిప్రాయం బలపడుతోంది. ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికాలోని అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలు అంతర్జాతీయ వేదికలపై తగిన ప్రాధాన్యం పొందడం లేదనే అభిప్రాయం చాలాకాలంగా ఉంది. ఈ దేశాల తరఫున బలంగా మాట్లాడుతున్న దేశంగా భారత్ ఎదిగింది. అభివృద్ధి చెందిన దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య వారధిగా వ్యవహరిస్తోంది. ప్రపంచ స్థాయి నిర్ణయాలు ఫలవంతం కావాలంటే గ్లోబల్ సౌత్ అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని జీ7 దేశాలు భావిస్తున్నాయి.

వివరాలు 

భారీ మార్కెట్‌గా భారత్

140 కోట్లకు పైగా జనాభాతో భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్లలో ఒకటిగా నిలిచింది. డిజిటల్ ఆర్థిక వ్యవస్థ, తయారీ రంగం, సాంకేతిక రంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. ప్రపంచ సరఫరా వ్యవస్థలను విస్తరించాలనుకుంటున్న అనేక దేశాలకు భారత్ కీలక భాగస్వామిగా మారింది. ప్రపంచ ఆర్థిక స్థిరత్వంలోనూ భారత్ పాత్ర పెరుగుతుండటంతో జీ7 దేశాలు ఆర్థిక సహకారానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి.

Advertisement

వివరాలు 

చైనా ప్రభావానికి సమతుల్య శక్తిగా భారత్

ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రభావం పెరుగుతుండటం పలు దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిస్థితుల్లో భారత్‌ను వ్యూహాత్మక భాగస్వామిగా జీ7 దేశాలు చూస్తున్నాయి. భౌగోళిక స్థానం, సైనిక సామర్థ్యం, ఆర్థిక బలం కారణంగా ఆసియాలో శక్తి సమతుల్యతను కాపాడగల దేశంగా భారత్‌కు ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. వాతావరణ లక్ష్యాల్లో భారత్ కీలకం ప్రపంచ వాతావరణ మార్పుల ప్రభావాన్ని తగ్గించాలంటే భారత్ వంటి భారీ జనాభా కలిగిన దేశాల సహకారం తప్పనిసరి. పునరుత్పాదక ఇంధన రంగంలో భారత్ భారీ పెట్టుబడులు పెడుతోంది. అంతర్జాతీయ సౌర కూటమి వంటి కార్యక్రమాలకు నాయకత్వం వహిస్తోంది. దీంతో వాతావరణ మార్పులపై జరిగే ప్రతి కీలక సమావేశంలో భారత్‌కు ప్రత్యేక స్థానం లభిస్తోంది.

Advertisement

వివరాలు 

స్వతంత్ర విదేశాంగ విధానమే ప్రత్యేకత

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు వంటి అంశాల్లో భారత్ తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని కొనసాగిస్తోంది. ఏ ఒక్క కూటమికీ పూర్తిగా అనుకూలంగా కాకుండా చర్చలు, దౌత్యపరమైన పరిష్కారాలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ విధానం వల్ల ప్రపంచంలోని వివిధ దేశాలతో సమాన సంబంధాలను కొనసాగిస్తూ నమ్మకమైన భాగస్వామిగా గుర్తింపు పొందుతోంది. కేవలం ఆహ్వానిత దేశం కాదు జీ7 సమావేశాల్లో భారత్ పాల్గొనడం ఇప్పుడు కేవలం ఆహ్వానిత దేశం హోదాకు మాత్రమే పరిమితం కావడం లేదు. డిజిటల్ మౌలిక సదుపాయాలు,ఆహార భద్రత,సాంకేతికత, అభివృద్ధి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వంటి అంశాలపై తన ఆలోచనలు, అనుభవాలు, పరిష్కారాలను ప్రపంచ దేశాలకు సూచిస్తోంది. అంతర్జాతీయ సమస్యల పరిష్కారంలో కీలక భాగస్వామిగా భారత్ తన స్థానాన్ని మరింత బలపరుచుకుంటోంది.

వివరాలు 

పెరుగుతున్న భారత్ గ్లోబల్ ప్రభావం

ప్రపంచ రాజకీయ, ఆర్థిక సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ భారత్‌ను పక్కన పెట్టి కీలక నిర్ణయాలు తీసుకోవడం దాదాపు అసాధ్యంగా మారుతోంది. గ్లోబల్ సౌత్‌కు నాయకత్వం, భారీ మార్కెట్, చైనాకు ప్రత్యామ్నాయ వ్యూహాత్మక శక్తి, వాతావరణ లక్ష్యాల్లో కీలక పాత్ర, స్వతంత్ర విదేశాంగ విధానం వంటి అంశాలు జీ7 దేశాలను భారత్‌కు మరింత చేరువ చేస్తున్నాయి. అందుకే సభ్యదేశం కాకపోయినా ప్రతి ఏడాది భారత్‌కు ప్రత్యేక ఆహ్వానం లభిస్తుండగా, ప్రపంచ వేదికపై మన దేశ ప్రాధాన్యం రోజురోజుకూ పెరుగుతోంది.

Advertisement