LOADING...
UN: 2030 నాటికి భూమి మరింత వేడెక్కడం ఖాయం.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక
2030 నాటికి భూమి మరింత వేడెక్కడం ఖాయం.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

UN: 2030 నాటికి భూమి మరింత వేడెక్కడం ఖాయం.. ఐక్యరాజ్యసమితి హెచ్చరిక

వ్రాసిన వారు Sirish Praharaju
May 28, 2026
02:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ వాతావరణ సంక్షోభం మరింత తీవ్రమవుతోందని, 2030 నాటికి రికార్డు స్థాయి వేడి సంవత్సరం నమోదయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని ఐక్యరాజ్య సమితికి చెందిన ప్రపంచ వాతావరణ సంస్థ (WMO) హెచ్చరించింది. ఈ ఏడాది చివర్లో ఎల్‌నినో ప్రభావం ప్రారంభమయ్యే అవకాశం ఉండటంతో.. 2027 నాటికే ప్రపంచ ఉష్ణోగ్రతల రికార్డులు బద్దలయ్యే ప్రమాదం ఉందని తెలిపింది. శిలాజ ఇంధనాల వినియోగం కారణంగా కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయని, దీంతో భూమి మరింత వేడెక్కుతోందని నిపుణులు చెబుతున్నారు. ఈ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా తీవ్ర వాతావరణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే యూకే, యూరప్ దేశాలను తీవ్ర హీట్‌వేవ్‌ వణికిస్తోంది.

వివరాలు 

పెరుగుతున్న వాతావరణ ముప్పు

ప్రస్తుతం గ్లోబల్ వార్మింగ్ కారణంగా ప్రతి నిమిషానికి ఒకరు ప్రాణాలు కోల్పోతున్నారని అంచనా. ఉద్గారాలను వేగంగా తగ్గించకపోతే పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. బ్రిటన్‌కు చెందిన మెటాఫీస్ తయారు చేసిన ఈ నివేదిక ప్రకారం.. 2026 నుంచి 2030 మధ్య కనీసం ఒక సంవత్సరం 2024 కంటే అత్యధిక వేడి సంవత్సరంగా నమోదయ్యే అవకాశం 86 శాతం ఉందని తెలిపింది. అలాగే 2026-2030 మధ్య ఐదేళ్ల సగటు ఉష్ణోగ్రత పారిశ్రామిక యుగానికి ముందు స్థాయిల కంటే 1.5 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా ఉండే అవకాశం 75 శాతం ఉందని వెల్లడించింది.

వివరాలు 

యూరప్‌లో హీట్‌వేవ్‌.. భారత్‌పైనా ప్రభావం

ఐరాస వాతావరణ విభాగం అధిపతి సైమన్ స్టీల్ మాట్లాడుతూ.. "యూరప్‌లో కొనసాగుతున్న హీట్‌వేవ్‌ వాతావరణ సంక్షోభం ఎంత తీవ్రమైందో చూపిస్తోంది. భారత్‌తో పాటు ఆసియాలోని అనేక ప్రాంతాలు కూడా తీవ్ర ప్రభావాన్ని ఎదుర్కొంటున్నాయి" అని తెలిపారు. అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల మానవ ప్రాణాలు, వ్యాపారాలు, దేశ ఆర్థిక వ్యవస్థలకు భారీ నష్టం జరుగుతోందని ఆయన చెప్పారు. శిలాజ ఇంధనాలపై ఆధారాన్ని వీలైనంత త్వరగా తగ్గించి.. స్వచ్ఛమైన విద్యుత్‌ ఉత్పత్తిపై దృష్టి పెట్టాలని సూచించారు.

Advertisement

వివరాలు 

1.5 డిగ్రీల లక్ష్యం దాదాపు అసాధ్యం

ప్రపంచ ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్‌ దాటితే తీవ్రమైన హీట్‌వేవ్‌లు, కరువు, తుఫాన్లు, వరదలు మరింత పెరిగే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు పలుమార్లు హెచ్చరించారు. వాతావరణ మార్పులకు ప్రజలు తట్టుకోవడం కూడా కష్టమవుతుందని పేర్కొన్నారు. పారిస్‌ ఒప్పందం ప్రకారం ప్రపంచ ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీలలోపే నియంత్రించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ.. అది సాధ్యమయ్యే అవకాశాలు తగ్గుతున్నాయని నిపుణులు అంటున్నారు. అయితే 2 డిగ్రీల లక్ష్యాన్ని మాత్రం అత్యవసర చర్యలతో సాధించే అవకాశం ఉందని చెబుతున్నారు.

Advertisement

వివరాలు 

ఎల్‌నినోతో మరింత వేడి

ఈ ఏడాది చివర్లో ఎల్‌నినో ప్రభావం ప్రారంభమయ్యే అవకాశాలు 96 శాతం ఉన్నాయని అమెరికా వాతావరణ సంస్థ NOAA వెల్లడించింది. సూపర్‌ ఎల్‌నినో వచ్చే అవకాశం కూడా 35 శాతం ఉందని తెలిపింది. పసిఫిక్‌ మహాసముద్రంలో గాలుల మార్పుల కారణంగా సముద్రంలో నిల్వ ఉన్న వేడి వాతావరణంలోకి విడుదల కావడమే ఎల్‌నినోకు కారణమని నిపుణులు వివరించారు. 2026 చివర్లో ఎల్‌నినో ప్రభావం మొదలైతే.. 2027లో రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని డబ్ల్యూఎంఓ నివేదిక ప్రధాన రచయిత డాక్టర్ లియోన్ హెర్మాన్సన్ తెలిపారు.

వివరాలు 

ఆర్కిటిక్‌లో ప్రమాదకర పరిస్థితులు

వచ్చే ఐదేళ్లలో ఆర్కిటిక్ ప్రాంతంలో శీతాకాల ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిల కంటే 2.8 డిగ్రీల సెల్సియస్‌ ఎక్కువగా ఉండే అవకాశం ఉందని నివేదిక పేర్కొంది. అంటే ప్రపంచ సగటుతో పోలిస్తే ఆ ప్రాంతం మూడు రెట్లు వేగంగా వేడెక్కుతోందని అర్థం. అలాగే ఉత్తర యూరప్‌, సాహెల్‌, అలాస్కా, సైబీరియా ప్రాంతాల్లో వచ్చే ఐదేళ్లలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు అమెజాన్‌ ప్రాంతంలో వర్షపాతం తగ్గే ప్రమాదం ఉందని హెచ్చరించింది.

Advertisement