
SIAM: దేశీయంగా ప్రయాణికుల వాహన టోకు విక్రయాలు తగ్గాయ్: సియామ్
ఈ వార్తాకథనం ఏంటి
దేశీయంగా ప్రయాణికుల వాహనాల టోకు విక్రయాలు (కార్లు, వ్యాన్లు, ఎస్యూవీలు) ఈ సంవత్సరం మే నెలలో 3,44,656 యూనిట్లకు పరిమితమయ్యాయని భారత వాహన తయారీదారుల సమాఖ్య (సియామ్) వెల్లడించింది.
ఇది గత సంవత్సరం అంటే 2024 మే నెలలో నమోదైన 3,47,492 యూనిట్ల విక్రయాలతో పోలిస్తే సుమారు 0.8 శాతం తగ్గుదలగా పేర్కొంది.
అయినప్పటికీ,మే నెలలో ఇప్పటివరకు నమోదైన అత్యధిక టోకు విక్రయాలలో ఇది రెండో అత్యధిక స్థానం పొందిందని సియామ్ స్పష్టం చేసింది.
ఇక ద్విచక్ర వాహనాల తయారీదారుల నుంచి డీలర్లకు సరఫరా 2.2 శాతం పెరిగి 16,20,084 యూనిట్ల నుంచి 16,55,927 యూనిట్లకు చేరినట్లు గణాంకాలు సూచిస్తున్నాయి.
వివరాలు
పడిపోయిన హ్యుందాయ్ కంపెనీ విక్రయాలు
అన్ని వాహన విభాగాలను కలిపి చూస్తే, మొత్తం టోకు విక్రయాలు 1.8 శాతం పెరిగి 19,76,674 యూనిట్ల నుంచి 20,12,969 యూనిట్లకు చేరాయని సియామ్ డైరెక్టర్ జనరల్ రాజేశ్ మేనన్ తెలిపారు.
ప్రయాణికుల వాహనాల విభాగానికి వస్తే,మారుతీ సుజుకీ సంస్థకు చెందిన దేశీయ విక్రయాలు 1,44,002 యూనిట్ల నుంచి 1,35,962 యూనిట్లకు తగ్గాయి.
హ్యుందాయ్ కంపెనీ విక్రయాలు కూడా 49,151 నుంచి 43,861 యూనిట్లకు పడిపోయాయి.
అయితే మహీంద్రా కంపెనీ మాత్రం మెరుగైన ప్రదర్శనతో 43,218 యూనిట్ల నుంచి 52,431 యూనిట్లకు తన విక్రయాలను పెంచుకుంది.
వివరాలు
పెరిగిన స్కూటర్ల విక్రయాలు
ద్విచక్ర వాహనాల్లో మోటార్సైకిళ్ల టోకు విక్రయాలు గత ఏడాది మే నెలలో 10,38,824 యూనిట్లుగా ఉండగా, ఈసారి స్వల్పంగా పెరిగి 10,39,156 యూనిట్లను చేరాయి.
స్కూటర్ల విక్రయాలు 5,40,866 నుంచి 5,79,507 యూనిట్లకు పెరిగాయి.
త్రిచక్ర వాహనాల విక్రయాలు మాత్రం కొంత తగ్గుదలతో 55,763 యూనిట్ల నుంచి 53,942 యూనిట్లకు పరిమితమయ్యాయి.