Page Loader
toll plazas collection: 5 ఏళ్లలో రూ.13,988 కోట్లు టోల్‌ ట్యాక్స్‌ : ప్రభుత్వ డేటా
5 ఏళ్లలో రూ.13,988 కోట్లు టోల్‌ ట్యాక్స్‌ : ప్రభుత్వ డేటా

toll plazas collection: 5 ఏళ్లలో రూ.13,988 కోట్లు టోల్‌ ట్యాక్స్‌ : ప్రభుత్వ డేటా

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 24, 2025
04:42 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశంలోని అన్ని జాతీయ రహదారులపై ఉన్న టోల్ ప్లాజాల నుంచి గత ఐదేళ్లలో ప్రభుత్వం ఎంత టోల్ వసూలు చేసిందో తెలుసుకుంటే ఆశ్చర్యపడతారు. అక్షరాలా రూ.1.93 లక్షల కోట్లు టోల్‌ ట్యాక్స్‌ రూపంలో ప్రభుత్వ ఖజానాకు చేరాయి. ఈ వివరాలను రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (MoRTH) లోక్‌సభలో వెల్లడించింది. ప్రభుత్వం అందించిన సమాచారం ప్రకారం,దేశంలోనే అత్యధిక టోల్ ట్యాక్స్ వసూలు చేసిన ప్లాజా గుజరాత్‌లోని ఎన్‌హెచ్‌-48లో వడోదర-భరూచ్ విభాగంలో ఉంది. 2019-20 నుంచి 2023-24 వరకు ఐదేళ్లలో ఈ ప్లాజా రూ.2,043.81 కోట్ల టోల్ వసూలు చేసింది. టోల్ ఆదాయాల జాబితాలో రెండో స్థానంలో రాజస్థాన్‌లోని షాజహాన్‌పూర్ టోల్ ప్లాజా నిలిచింది.

వివరాలు 

నాలుగో స్థానంలోబారజోధ టోల్ ప్లాజా

ఇది ఎన్‌హెచ్‌-48లో గుర్గావ్-కోట్‌పుట్లి-జైపూర్ మార్గంలో ఉంది. ఈ ప్లాజా గత ఐదేళ్లలో రూ.1,884.46 కోట్ల టోల్ వసూలు చేసినట్లు మంత్రిత్వ శాఖ డేటా వెల్లడించింది. మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్‌లోని జల్ధులగోరి టోల్ ప్లాజా ఉంది. 2019-20 నుండి 2023-24 వరకు ఈ ప్లాజా రూ.1,538.91 కోట్ల టోల్ వసూలు చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని బారజోధ టోల్ ప్లాజా ఐదేళ్లలో రూ.1,480.75 కోట్ల టోల్ వసూలు చేసి నాలుగో స్థానంలో నిలిచింది.

వివరాలు 

దేశవ్యాప్తంగా 1,063 టోల్ ప్లాజాలు

దేశవ్యాప్తంగా అత్యధిక ఆదాయం తెచ్చిన టాప్-10 టోల్ ప్లాజాల జాబితాలో గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌ల నుంచి రెండు ప్లాజాలు ఉండగా, హర్యానా, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, బీహార్‌ల నుంచి ఒక్కో ప్లాజా చొప్పున ఉన్నాయి. ఈ టాప్-10 టోల్ ప్లాజాలు కలిపి గత ఐదేళ్లలో రూ.13,988.51 కోట్ల టోల్ వసూలు చేశాయి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 1,063 టోల్ ప్లాజాలు ఉన్నాయి. ఇందులో 457 టోల్ ప్లాజాలను గత ఐదేళ్లలో ఏర్పాటు చేశారు.