Accenture: వేతన పెంపు విధానంలో యాక్సెంచర్ కీలక మార్పులు..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రముఖ ఐటీ సంస్థ యాక్సెంచర్ ఉద్యోగుల వేతన పెంపు విధానంలో కీలక మార్పులు తీసుకొచ్చింది. ఇకపై ఉద్యోగులకు మంజూరు చేసే జీతం పెంపును రెండు భాగాలుగా విభజించనుంది. పెంపులో సగం మొత్తాన్ని బేసిక్ శాలరీలో కలపగా, మిగిలిన సగాన్ని ఒకేసారి నగదు రూపంలో ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయనుంది. ఈ కొత్త విధానం జూన్ శాలరీ రివ్యూ నుంచి అమల్లోకి రానుండగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులతో పాటు భారత్లోని సుమారు 3.5 లక్షల మంది ఉద్యోగులకు ఇది వర్తించనుంది.
వివరాలు
పెంపు ఎలా అమలవుతుంది?
కొత్త విధానం ప్రకారం ఉద్యోగికి 3 శాతం వేతన పెంపు మంజూరైతే, అందులో 1.5శాతం మాత్రమే బేసిక్ శాలరీలో చేరుతుంది.
మిగిలిన 1.5 శాతానికి సమానమైన మొత్తాన్ని జూన్ నెలలో ఒకేసారి నగదు రూపంలో చెల్లిస్తారు.
ఈ విధానం వల్ల ఉద్యోగుల చేతికి వెంటనే అదనపు నగదు అందడమే కాకుండా, మరింత మంది ఉద్యోగులకు వేతన పెంపు ప్రయోజనం కల్పించే అవకాశం ఉంటుందని సంస్థ అంతర్గత మెమోలో పేర్కొంది.
అర్హుల సంఖ్య పెంచే ప్రయత్నం
గత ఏడాది ఒకే హోదాలో కొనసాగిన ఉద్యోగుల్లో కొంతమందికే వేతన పెంపు లభించింది.
అయితే ఈసారి పెంపును రెండు భాగాలుగా విభజించడం ద్వారా వేతన పెంపుకు అర్హులైన ఉద్యోగుల సంఖ్యను పెంచేలా నిర్ణయం తీసుకున్నట్లు యాక్సెంచర్ వెల్లడించింది.
వివరాలు
ప్రమోషన్ పెంపుపై మార్పుల్లేవు
ప్రమోషన్తో వచ్చే వేతన పెంపు విషయంలో మాత్రం ఎలాంటి మార్పు ఉండదని సంస్థ స్పష్టం చేసింది.
ప్రమోషన్ ద్వారా లభించే మొత్తం వేతన పెంపు యథావిధిగా పూర్తిగా బేసిక్ శాలరీలోనే కలుస్తుందని తెలిపింది.
అలాగే ప్రతి ఏడాది డిసెంబరులో ఇచ్చే వార్షిక బోనస్కు ఈ నగదు చెల్లింపుతో ఎలాంటి సంబంధం ఉండదని వెల్లడించింది.
వివరాలు
ఉద్యోగుల్లో మిశ్రమ స్పందన
ఉద్యోగుల నైపుణ్యం, పనితీరు, సంస్థపై చూపిన ప్రభావం, కార్యాలయ ప్రవర్తన వంటి ప్రమాణాల ఆధారంగానే వేతన పెంపు నిర్ణయాలు కొనసాగుతాయని యాక్సెంచర్ పేర్కొంది.
అయితే కొత్త విధానంపై ఉద్యోగుల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది.
ఈ విధానం ఈ ఏడాదికే పరిమితమా లేదా భవిష్యత్తులోనూ కొనసాగుతుందా? ఒకేసారి చెల్లించే నగదు మొత్తంపై పన్ను ఎలా విధిస్తారు? వంటి అంశాలపై ఉద్యోగులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.