LOADING...
Adani Energy: అదానీ ఎనర్జీ ₹10,000 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం
అదానీ ఎనర్జీ ₹10,000 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం

Adani Energy: అదానీ ఎనర్జీ ₹10,000 కోట్ల నిధుల సమీకరణకు బోర్డు ఆమోదం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 02, 2026
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

అదానీ గ్రూప్‌కు చెందిన అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేరు గురువారం (జూలై 2) పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షించింది. కంపెనీ బోర్డు రూ.10,000 కోట్ల వరకు నిధులు సమీకరించేందుకు ఆమోదం తెలిపింది. ఈ నిధులను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ప్లేస్‌మెంట్ (QIP) లేదా చట్టపరంగా అనుమతించిన ఇతర మార్గాల ద్వారా సమీకరించనున్నట్లు వెల్లడించింది. ఈ నిర్ణయం జూలై 1, 2026న జరిగిన బోర్డు సమావేశంలో తీసుకున్నారు. కంపెనీ వివరాల ప్రకారం,ఒక్కో షేరుకు రూ.10 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్లు లేదా ఇతర అర్హత కలిగిన సెక్యూరిటీలను ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో జారీ చేసి నిధులు సమీకరించే అవకాశం ఉంది.

వివరాలు 

కంపెనీ బోర్డు సమావేశం జూలై 21, 2026

అయితే ఈ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదంతో పాటు అవసరమైన నియంత్రణ సంస్థలు, చట్టబద్ధ అధికారుల అనుమతులు కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇక 2026 జూన్ 30తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన ఆడిట్ చేయని ఆర్థిక ఫలితాలను పరిశీలించి ఆమోదించేందుకు కంపెనీ బోర్డు సమావేశాన్ని జూలై 21, 2026న నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

వివరాలు 

జూలై 25న ఈజీఎం

నిధుల సమీకరణ ప్రతిపాదనకు వాటాదారుల ఆమోదం పొందేందుకు జూలై 25, 2026 శనివారం రోజున వీడియో కాన్ఫరెన్స్ లేదా ఇతర ఆడియో-విజువల్ విధానంలో అసాధారణ సాధారణ సమావేశం (EGM) నిర్వహించేందుకు కూడా బోర్డు ఆమోదం తెలిపింది. స్టాక్ ఎక్స్చేంజ్‌కు సమర్పించిన వివరాల ప్రకారం, వర్తించే చట్టాల ప్రకారం QIP లేదా ఇతర అనుమతించబడిన మార్గాల ద్వారా ఈక్విటీ షేర్లు, ఇతర అర్హత కలిగిన సెక్యూరిటీలను జారీ చేసి రూ.10,000 కోట్ల వరకు నిధులు సమీకరించాలని కంపెనీ యోచిస్తోంది. ఇందులో సెక్యూరిటీలపై నిర్ణయించే ప్రీమియం కూడా కలిపి మొత్తం పరిమితి రూ.10,000 కోట్లుగానే ఉంటుంది.

Advertisement

వివరాలు 

జూలై 25న ఈజీఎం

అలాగే ఈ జారీ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ విడతల్లో చేపట్టవచ్చని, ధరతో పాటు ఇతర నిబంధనలను చట్టాల ప్రకారం బోర్డు నిర్ణయిస్తుందని తెలిపింది. అవసరమైతే రుణ పత్రాలు లేదా కన్వర్ట్ కాని సెక్యూరిటీలకు సంబంధించిన వివరాలను బోర్డు లేదా బోర్డు నియమించిన కమిటీ ఖరారు చేస్తుంది. ఇదిలా ఉండగా, కంపెనీ సెక్యూరిటీల ట్రేడింగ్ విండోను జూలై 1 నుంచి మూసివేసినట్లు తెలిపింది. జూన్ త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ప్రకటించిన 48 గంటల తర్వాత లేదా జూలై 24, 2026న ట్రేడింగ్ విండోను మళ్లీ తెరవనున్నట్లు వెల్లడించింది.

Advertisement

వివరాలు 

షేర్ పనితీరు

బీఎస్‌ఈలో అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ షేర్ గురువారం ట్రేడింగ్‌లో 1.1 శాతం పెరిగి రోజువారీ గరిష్ఠ స్థాయి రూ.1,538.75ను తాకింది. గత నెలలో ఈ షేరు 1.5 శాతం తగ్గినా, గత మూడు నెలల్లో 60 శాతం, ఆరు నెలల్లో 42 శాతం, ఏడాది కాలంలో 72 శాతం లాభపడింది. 2026 జూన్‌లో రూ.1,614 వద్ద 52 వారాల గరిష్ఠాన్ని నమోదు చేయగా, 2025 సెప్టెంబరులో రూ.745.45 వద్ద 52 వారాల కనిష్ఠ స్థాయిని తాకింది.

Advertisement