
Adani Wilmar: అదానీ గ్రూప్ కీలక నిర్ణయం.. విల్మర్తో భాగస్వామ్యానికి గుడ్బై!
ఈ వార్తాకథనం ఏంటి
సింగపూర్కు చెందిన విల్మర్ ఇంటర్నేషనల్తో భాగస్వామ్యంగా ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ 'అదానీ విల్మర్ లిమిటెడ్' నుంచి అదానీ గ్రూప్ నిష్క్రమించనుంది. ఈ మేరకు కంపెనీలోని తమ పూర్తి వాటాలను విక్రయించనున్నట్లు అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్ సోమవారం ప్రకటించింది. అదానీ విల్మర్లో తమకు ఉన్న 31.06% వాటాను విల్మర్ ఇంటర్నేషనల్కు విక్రయించనుండగా, మిగతా 13% వాటాను పబ్లిక్ షేర్ హోల్డింగ్ నిబంధనల మేరకు బహిరంగ మార్కెట్లో అమ్మనుంది. ఈ విక్రయం విలువ ఎంత ఉంటుందనే దానిపై వివరాలను స్పష్టంగా తెలపలేదు. ఇది దాదాపు 2 బిలియన్ డాలర్ల విలువ ఉండే అవకాశం ఉంది. 2025 మార్చి 31 నాటికి ఈ విక్రయ ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని కంపెనీ తెలిపింది.
Details
బోర్డు నుంచి డైరెక్టర్ల నిష్క్రమణ
అదానీ గ్రూప్ ఈ జాయింట్ వెంచర్ నుంచి పూర్తిగా నిష్క్రమిస్తుండటంతో, బోర్డులో నామినేట్ చేసిన డైరెక్టర్లు కూడా తమ పదవులు వదిలివేయనున్నారు. అదానీ గ్రూప్, సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న విల్మర్ ఇంటర్నేషనల్తో కలిసి 'అదానీ విల్మర్ లిమిటెడ్'ను ప్రారంభించింది. ఈ సంస్థలో ఇరువురికి 43.97% వాటాలున్నాయి. ఈ విక్రయ ప్రక్రియ కోసం గత ఏడాది నుంచి చర్చలు కొనసాగినట్లు తెలుస్తోంది. భారత వంట నూనెల మార్కెట్లో గణనీయ శాతం కలిగిన అదానీ విల్మర్, ఫార్చూన్ బ్రాండ్ పేరిట వంట నూనెలు, ప్యాకేజ్డ్ ఆహార ఉత్పత్తులను విక్రయిస్తోంది. ఈ నిర్ణయం ద్వారా గ్రూప్ ఎఫ్ఎంసీజీ రంగం నుంచి పూర్తిగా వైదొలగనుంది.