
USA: భారత ఐటీ రంగం రక్షణకు చర్యలు.. అమెరికాతో కలిసి ముందుకెళ్తామన్న అశ్వినీ వైష్ణవ్
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఐటీ పరిశ్రమ (Indian IT Sector) దాదాపు 300 బిలియన్ డాలర్ల విలువను చేరుకుంది. ఈ వృద్ధిని కాపాడేందుకు అమెరికాతో (USA) కలిసి పనిచేస్తున్నామని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ (Ashwini Vaishnaw) వెల్లడించారు. ఒక ఆంగ్ల వెబ్సైట్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వంతో భారత ఐటీ ఔట్సోర్సింగ్ సంస్థలకు ముప్పు తలెత్తొచ్చనే భయాలు వ్యాప్తి చెందుతున్న వేళ ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఈ విషయంలో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (GCCs), ఇతర సర్వీస్ ఆపరేషన్లను భారత్లో నడిపిస్తున్న బహుళజాతి సంస్థలతో క్రమంగా సంప్రదింపులు జరుగుతున్నాయని తెలిపారు.
Details
ఆసియా దేశాల ప్రభుత్వాలతో చర్చలు
అలాగే అమెరికా, యూరప్, జపాన్, ఆసియా దేశాల ప్రభుత్వాలతో కూడా చర్చలు సాగుతున్నాయని చెప్పారు. కేవలం ఐటీ రంగంపైనే ఆధారపడకుండా, ప్రభుత్వం ఎలక్ట్రానిక్స్, తయారీ రంగాలను బలోపేతం చేయడానికి వేగంగా చర్యలు తీసుకుంటోందని చెప్పారు. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ మార్కెట్లో భారత్ వాటా గణనీయంగా పెరిగిందని వివరించారు. భారత ఐటీ సేవల రంగంలో సుమారు 5.67 మిలియన్ల ఉద్యోగులు పనిచేస్తున్నారు. దేశానికి ముఖ్యమైన ఎగుమతి ఆదాయాన్ని కూడా ఈ రంగమే అందిస్తోంది. అయితే, భారత్కు ఐటీ ఔట్సోర్సింగ్ చేసే సంస్థలపై ట్రంప్ ప్రభుత్వం ఆంక్షలు విధించే అవకాశం ఉందన్న ప్రచారం పరిశ్రమలో ఆందోళన కలిగిస్తోంది.
Details
నాస్కామ్ నివేదిక
ఈ ఏడాదిలో భారత్లో టెక్నాలజీ రంగం అత్యధిక వృద్ధి రేటు నమోదు చేయనుందని నాస్కామ్ పేర్కొంది. ఇంజినీరింగ్ రీసెర్చ్ & డెవలప్మెంట్, గ్లోబల్ కెపాసిటీ సెంటర్ల పెరుగుదల దీనికి ప్రధాన కారణమని నివేదికలో పేర్కొంది.
Details
కాల్ సెంటర్లకు ట్రంప్ ముప్పు
అమెరికాలోని ట్రంప్ (Donald Trump) కార్యవర్గం భారత్ ఐటీ ఎగుమతులు, కాల్సెంటర్లపై టారిఫ్లు విధించే అవకాశంపై ఊహాగానాలు పెరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అస్థిరతల కారణంగా ఐటీ రంగం ఇప్పటికే ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ట్రంప్ సలహాదారు పీటర్ నవారో ఇటీవల ఒక పోస్టును షేర్ చేసి, విదేశీ ఔట్సోర్సింగ్పై భారీ టారిఫ్లు విధించాలని డిమాండ్ చేశారు. అమెరికా ఐటీ రంగానికి కీలక మార్కెట్ కావడంతో, అక్కడ ఎలాంటి టారిఫ్లు విధించినా భారత్ ఐటీ ఆపరేషన్లపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ట్రంప్ కార్యవర్గం ఈ విషయంపై తుది నిర్ణయం ప్రకటించలేదు. అదేవిధంగా రాజకీయ వ్యాఖ్యాత లారా లూమర్ కూడా ఐటీ కాల్ సెంటర్లను లక్ష్యంగా చేసుకుని తరచుగా విమర్శలు చేస్తున్నారు.
Details
భారత్ ఐటీ రంగం ఆందోళన
టారిఫ్లు అమలులోకి వస్తే భారత కంపెనీలకు ఇబ్బందులు తప్పవు. ఇప్పటికే అమెరికాలో భారీ పన్నులు చెల్లిస్తున్నారు. దీనికి తోడు అదనపు టారిఫ్లు వస్తే 'డబుల్ టాక్స్' బారిన పడతారు. అలాగే వీసా పరిమితులు, స్థానికులను నియమించుకోవడం వంటి కారణాలతో అక్కడ కార్యకలాపాలు మరింత ఖరీదైనవిగా మారుతాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత ఔట్సోర్సింగ్ రంగం విలువ 283 బిలియన్ డాలర్లకు పైగా ఉంది. ఇందులో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్సీఎల్ టెక్, విప్రో** వంటి దిగ్గజ సంస్థలు ఉన్నాయి. వీటి ఆదాయంలో దాదాపు 60 శాతం అమెరికా నుంచే వస్తోంది.
Details
అంత ఈజీ కాదు
అయితే సరుకుల దిగుమతులపై టారిఫ్లు విధించినంత తేలిగ్గా ఐటీ సేవలపై టారిఫ్లు విధించడం కష్టం అని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఈ రంగంలోని CEOలు ట్రంప్ పాలనతో బలమైన సంబంధాలు కలిగి ఉన్నారు. వారిలో చాలామంది భారత్కు అనుకూలులు కూడా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారాలు సజావుగా సాగాలంటే భారత్ నుంచి నిపుణులను H-1B వీసాలు ద్వారా అమెరికాకు రప్పించుకోవాలి లేదా రిమోట్గా పనిచేయించుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ట్రంప్ ఈ విధమైన నిర్ణయం తీసుకున్నా, అది ఒక పాలసీ నిర్ణయం కంటే రాజకీయ సందేశంగా మాత్రమే భావించాల్సి ఉంటుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.