Bharat Coking Coal IPO:భారత్ కోకింగ్ కోల్ ఐపీవో బంపర్ లిస్టింగ్.. ఇన్వెస్టర్లకు 96.5శాతం లాభాలు..
ఈ వార్తాకథనం ఏంటి
భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) ఐపీఓలో షేర్లు పొందిన ఇన్వెస్టర్లకు అదృష్టం కలిసి వచ్చింది. సోమవారం జరిగిన లిస్టింగ్లో ఈ ఐపీఓ అంచనాలను మించి భారీ లాభాలతో స్టాక్ మార్కెట్లోకి అడుగుపెట్టింది. ఇష్యూ ధర రూ.23తో పోలిస్తే, బీసీసీఎల్ షేరు దాదాపు 96.5 శాతం ప్రీమియంతో లిస్ట్ కావడం విశేషం. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ (బీఎస్ఈ)లో షేరు రూ.45.20 వద్ద ట్రేడింగ్ ప్రారంభించగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (ఎన్ఎస్ఈ)లో రూ.45 వద్ద లిస్ట్ అయింది. ఐపీఓ సబ్స్క్రిప్షన్ సమయంలో కనిపించిన ఇన్వెస్టర్ల ఉత్సాహం, లిస్టింగ్ రోజున కూడా అలాగే కొనసాగింది. ఫలితంగా, మొదటి రోజే పెట్టుబడిదారులకు గణనీయమైన లాభాలు దక్కాయి.
వివరాలు
బీసీసీఎల్ ఐపీఓ వివరాలు
ఈ ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి అసాధారణ స్పందన లభించింది. ఎన్ఎస్ఈ గణాంకాల ప్రకారం, మొత్తం ఇష్యూ 146.87 రెట్లు సబ్స్క్రైబ్ అయింది. విభాగాల వారీగా చూస్తే.. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ (క్యూఐబీ) విభాగంలో అత్యధికంగా 310.81 రెట్లు దరఖాస్తులు నమోదయ్యాయి. నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎన్ఐఐ) కేటగిరీలో 258.16 రెట్లు సబ్స్క్రిప్షన్ నమోదైంది. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో 49.33 రెట్లు బిడ్లు వచ్చాయి. జనవరి 9న ప్రారంభమైన ఈ ఐపీఓ సబ్స్క్రిప్షన్ ప్రక్రియ జనవరి 13న ముగిసింది. షేర్ ప్రైస్ బ్యాండ్ను రూ.21 నుంచి రూ.23 మధ్యగా నిర్ణయించారు.ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) మార్గంలో కంపెనీ సుమారు 46.57 కోట్ల షేర్లను విక్రయించి,మొత్తం రూ.1,071.11 కోట్ల నిధులను సమీకరించింది.
వివరాలు
బీసీసీఎల్ ఐపీఓ గ్రే మార్కెట్ ప్రీమియం
ఈ ఐపీఓకు ఐడీబీఐ క్యాపిటల్ మార్కెట్ సర్వీసెస్ లిమిటెడ్ లీడ్ మేనేజర్గా వ్యవహరించగా, కేఫిన్ టెక్నాలజీస్ రిజిస్ట్రార్ బాధ్యతలను నిర్వహించింది. గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ) గణాంకాలే ఈ ఐపీఓకు బలమైన లిస్టింగ్ ఉంటుందనే సంకేతాలను ముందే ఇచ్చాయి. సోమవారం ఉదయం వరకు బీసీసీఎల్ ఐపీఓ జీఎంపీ రూ.13.60గా కొనసాగింది. దీని ఆధారంగా షేరు సుమారు రూ.36.60 వద్ద లిస్ట్ అవుతుందని అంచనా వేశారు. అంటే, ఇష్యూ ధరతో పోలిస్తే దాదాపు 59 శాతం లాభంతో ట్రేడింగ్ మొదలయ్యే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావించాయి. అయితే, ఈ అంచనాలను కూడా మించి బీసీసీఎల్ షేరు మార్కెట్లో లిస్ట్ కావడం గమనార్హం.
వివరాలు
భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ గురించి
భారతదేశ ఇంధన, పారిశ్రామిక రంగాల్లో భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ కీలక పాత్ర పోషిస్తోంది. 2025 ఆర్థిక సంవత్సరానికి గాను దేశంలోనే అతిపెద్ద కోకింగ్ కోల్ ఉత్పత్తిదారుగా ఈ సంస్థ నిలిచింది. దేశంలో ఉత్పత్తి అయ్యే మొత్తం కోకింగ్ కోల్లో సుమారు 58.5 శాతం వాటాను బీసీసీఎల్ ఒక్కటే అందిస్తోంది. కోకింగ్ కోల్ ఉత్పత్తే ప్రధాన వ్యాపారంగా ఉన్న ఈ సంస్థకు, 2024 ఏప్రిల్ 1 నాటికి సుమారు 7,910 మిలియన్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నట్లు అంచనాలు చెబుతున్నాయి. ఈ నిల్వలతో బీసీసీఎల్ దేశంలోనే అతిపెద్ద బొగ్గు నిల్వలు కలిగిన సంస్థల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.
వివరాలు
భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ గురించి
కోకింగ్ కోల్తో పాటు, నాన్-కోకింగ్ కోల్, వాష్డ్ కోల్ వంటి ఇతర గ్రేడ్ల బొగ్గును కూడా ఈ సంస్థ ఉత్పత్తి చేస్తోంది. ఇవి ప్రధానంగా ఉక్కు పరిశ్రమలు, విద్యుత్ రంగ అవసరాలను తీర్చుతున్నాయి. కోల్ ఇండియా లిమిటెడ్కు పూర్తి అనుబంధ సంస్థగా బీసీసీఎల్ కొనసాగుతోంది. 1972లో స్థాపితమైన ఈ సంస్థ పనితీరును గుర్తించిన కేంద్ర ప్రభుత్వం, 2014లో దీనికి 'మినీ రత్న' హోదాను మంజూరు చేసింది. జార్ఖండ్లోని ప్రఖ్యాత ఝరియా బొగ్గు క్షేత్రాలు, అలాగే పశ్చిమ బెంగాల్లోని రాణిగంజ్ బొగ్గు క్షేత్రాల నుంచి ఈ సంస్థ బొగ్గు తవ్వకాలు నిర్వహిస్తోంది.